ఏ పని చేసినా హృదయంతో చేయండి: కమలేష్ పటేల్
Updated on: Jan 26, 2023, 1:02 PM IST

ఏ పని చేసినా హృదయంతో చేయండి: కమలేష్ పటేల్
Updated on: Jan 26, 2023, 1:02 PM IST
Kamalesh D Patel Message: ఆది గురు లాలాజీ మహరాజ్ శిష్యులు నెలకొల్పిన ఆధ్యాత్మిక కేంద్రాల్లో రామచంద్ర మిషన్ ఒకటి. అది హార్ట్ఫుల్నెస్, సహజ్ మార్గ్ పేర్లతోనూ ప్రసిద్ధం. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు లాలాజీ మహరాజ్ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా.. తాజాగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కమలేష్ పటేల్ (దాజీ) విలువైన సందేశం మీకోసం..
Kamalesh D Patel Message: రామచంద్ర మిషన్ ఆధ్యాత్మిక కేంద్రాల్లో యోగాసనాలు, ప్రాణాయామం ప్రాథమిక విషయాలు. మధుమేహం, రక్తపోటు, కాలేయ సమస్య, థైరాయిడ్ సమస్య, స్థూలకాయం.. ఇలా.. ఆయా రుగ్మతలకు ఏ ఆసనాలు వేయాలో నేర్పిస్తారు. తమ గురించి తాము తెలుసు కోవడానికీ, లోతుగా అధ్యయనం చేయ డానికి ధ్యానం ఉపయోగపడుతుంది. దీని వల్ల కోట్లాదిమంది లబ్ధి పొందాలనేదే మా లక్ష్యం. న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, హ్యూస్టన్, పారిస్, స్విట్జర్లాండ్, డెన్మార్క్.. ఇలా ఈ యోగా, ధ్యాన పద్ధతులను ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాలకు విస్తరిస్తున్నాం. ఈ ఏడాదిని యోగ మహోత్సవ్ అని పిలుస్తాం.
ప్రాణాహుతి అంటే..: మన ఆదిగురువు శ్రీ లాలాజీ మహారాజ్ భారతీయ ప్రాచీన సంప్రదాయమైన ప్రాణాహుతి అనే ధ్యాన పద్ధతిని మనకు అందించారు. అదెంతో అపురూపమైంది. మీ గురించి మీరు సంపూర్ణంగా తెలుసుకోగలుగు తారు. ప్రత్యక్షంగా అనుభూతి చెందుతారు. అది మీకు గొప్ప ప్రశాంతతనిస్తుంది. ఈ విధానంతో 150 సంవత్సరాలుగా మన పూర్వీకుల కృపను పొందుతున్నాం. ఈ వారసత్వ సంపదతో ప్రపంచ దేశాలెన్నో లబ్ధి పొందుతున్నాయి. మున్ముందు కూడా కోట్లాదిమంది ఈ యోగా, ధ్యానాలను అనుసరించి ఆనందించనున్నారు.
శరీరానికి పోషకాహారం అవసరమైనట్లే మనసు సుసంపన్నం కావాలి. ఎదుటి వ్యక్తి పరిమితంగా ఉంటే క్షీణింపచేయడం తేలిక. కానీ అనంతంతో అనుసంధానించి ఉంటే ఎవరూ బలహీనపరచలేరు. ప్రాణిక శక్తిని కోల్పోలేరు. ఈ ధ్యానం చాలా సులువు. కళ్లు మూసుకుని మీలో ఏం జరుగుతున్నదో గమనించండి. హృదయాన్ని తెరిచి ఉంచి ‘స్వామీ, నువ్వున్నావో లేదో తెలియదు. కానీ ఉన్నావని ఇంట్లో చెప్పినందున, మన పురాణాలన్నీ ధర్మాన్ని ప్రచారం చేశాయి కనుక నమ్ముతున్నాను. కానీ నీ ఉనికి తెలియ లేదు. ఇప్పుడు తెలుసుకోవాలని ఉంది. దయచేసి ఆ విషయంలో సాయం చెయ్యి’ అంటూ ఆర్ద్రంగా భగవంతుడికి విన్నవించు. హృదయపూర్వకంగా చేసే ఈ ప్రార్థనతోనే ప్రాణాహుతి సాధ్యమవుతుంది. మీకు సంతృప్తి కలిగినప్పుడు కళ్లు తెరుస్తారు, ఎంతో శాంతంగా. ఇది మనసును ఎలా సద్వినియోగం చేయాలో, క్రమబద్ధీకరించాలో నేర్పుతుంది. మనసు కోతి లాంటిది. అది క్షణం కూడా ఖాళీగా ఉండదు. కానీ రోజుకు అరగంట చొప్పున మూడు రోజులు ఇక్కడ శిక్షణ తీసుకున్నా రంటే మీ మనసును నియంత్రించుకోవచ్చు.
padmabhushan awardee Kamalesh Patel: మనం చేయాల్సిందల్లా స్వచ్ఛమైన హృదయంతో ఉండాలి. వినయంగా ప్రవర్తించాలి. తల్లిదండ్రులకు హృదయ పూర్వకంగా సేవ చేయాలి. అది విధి అనో, కర్తవ్యం అనో భావించవద్దు. ప్రేమతో చేయాలి. గురువులను గౌరవించాలి. చేసే పని పట్ల పూర్తి శ్రద్ధ, భక్తి ఉండాలి. అదొక తపస్సు కావాలి. లేదంటే ఆశించిన సత్ఫలితం రాదు.
హృదయపూర్వకత (హార్ట్ఫుల్నెస్) అంటే ఏ పని చేసినా హృదయంతో చేయడం. చెప్పే మాటలూ చేసే ఆలోచనలూ హృదయపూర్వకంగా ఉండాలి. ఒకవేళ భేదాభిప్రాయం వ్యక్తం చేసినా అది కూడా హృదయ పూర్వకంగానే ఉండాలనేది సారాంశం. ఈ సాధనతో ఆలోచనలో, ప్రవర్తనలో ఎంతో మార్పు వస్తుంది.
ఇవీ చూడండి..
