Public Opinion on ACCMC: అమరావతి గ్రామసభల్లో నిరసన గళం.. 29 గ్రామాలను కలిపే ఉంచాలని డిమాండ్‌

author img

By

Published : Jan 8, 2022, 1:45 PM IST

Public Opinion on ACCMC

Public Opinion on ACCMC: అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు కోసం జరుగుతున్న గ్రామసభల్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 19 గ్రామ పంచాయతీలతో ఏర్పాటు చేసే అమరావతి కార్పొరేషన్​ను వ్యతిరేకిస్తున్నారు. గతంలో మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటు కూడా ప్రజామోదంతో జరగలేదని అంటున్నారు. తుళ్లూరు మండల పరిధిలోని మూడు గ్రామాలను ఎందుకు కలపలేదని ప్రశ్నిస్తున్నారు.

Public Opinion on ACCMC: అమరావతి కార్పొరేషన్‌ ఏర్పాటుపై గ్రామ సభల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 19 గ్రామాలతో అమరావతి కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని రైతులు గట్టిగా నిలదీస్తున్నారు. 29 గ్రామాలతో కూడిన కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తేనే అంగీకరిస్తామని తేల్చిచెబుతున్నారు. మంగళగిరి మండలంలో 3 గ్రామాలు, తుళ్లూరు మండలంలో 16 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని రాజధాని ప్రజలు అంటున్నారు. విభజించు - పాలించు తరహాలో రాజధాని ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడుతున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం 29 గ్రామాలను అభివృద్ధి చేసిన తర్వాత.. అన్నింటినీ కలిపే కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని.. గ్రామసభలకు హాజరైన వారందరూ తేల్చిచెప్పారు.

అమరావతి గ్రామసభల్లో నిరసన గళం..

తుళ్లూరు మండలంలో 20 గ్రామాలు, మంగళగిరి మండలంలో 7 గ్రామాలు, తాడేపల్లి మండలంలోని 2 గ్రామాలను.. గత ప్రభుత్వం అమరావతి పరిధిలోకి తెచ్చింది. వైకాపా ప్రభుత్వం రాకతో మూడు రాజధానులు తెర మీదకు వచ్చాయి. అమరావతి నిర్మాణం నిలిచిపోయింది. 2021లో ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా రాజధాని పరిధిలోని 6 గ్రామాలను కలుపుతూ మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు రాజధాని పరిధిలో ఉండగా.. పెదపరిమి, వడ్లమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలు మాత్రం విడిగా ఉన్నాయి. అక్కడ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించలేదు. అనవసర గందరగోళం సృష్టించకుండా.. 29 గ్రామాలతోనే కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

29 గ్రామాలు కలిపి సీఆర్​డీ పరిధిలో ఉంది. దానికో చట్టరూపత కల్పిస్తున్నామని ఆ రోజు చెప్పారు. ఆ విధంగానే 29 గ్రామాలు కలిపి ఒకే కార్పొరేషన్​గా ఉంచాలి. విభజించు - పాలించు తరహాలో రాజధాని ప్రజల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం 29 గ్రామాలను అభివృద్ధి చేసిన తర్వాత.. అన్నింటినీ కలిపే కార్పొరేషన్‌ ఏర్పాటు చేయండి - కృష్ణాయపాలెం గ్రామస్థుడు

ఇదీ చదవండి: SomiReddy On Amaravathi Corporation : భూములు తాకట్టు పెట్టడానికే.. అమరావతి కార్పొరేషన్ : సోమిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.