కరిగిపోయిన స్థిరాస్థి కల.. ఏపీలో ఇలా.. తెలంగాణలో అలా..!

author img

By

Published : Jan 30, 2023, 7:05 AM IST

REAL ESTATE

REAL ESTATE : రాష్ట్రంలో స్థిరాస్తి రంగ వృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారింది. పొరుగు రాష్ట్రం తెలంగాణ.. నిర్మాణాలు, క్రయవిక్రయాల్లో దూసుకుపోతోంది. ఫ్లాట్ల విక్రయాల్లో హైదరాబాద్‌ ఏకంగా దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రిజిస్ట్రేషన్ల ఆదాయపరంగానూ.. తెలంగాణ.. ఏపీ కంటా చాలా ముందుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని వారితో సహా ప్రవాసాంధ్రులు, పెట్టుబడిదారులు.. తెలంగాణనే ఎంచుకుంటున్నారు. ఫలితంగా రాష్ట్రంలో స్థిరాస్తి రంగం ఎన్నడూ లేనంత వెలవెలబోతోంది.

REAL ESTATE DOWN IN AP: ఆంధ్రప్రదేశ్‌లో స్థిరాస్తి రంగం వృద్ధి కలలా కరిగిపోయింది. అమరావతి రాజధాని ప్రకటనతో ఊపందుకున్న స్థిరాస్తి వ్యాపారం.. ప్రభుత్వం మారి రాజధాని పనులు నిలిచిపోవడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ విషయంలో.. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌ బాగా వెనకబడింది.

2015-16, 2021-22 సంవత్సరాల్లో.. రిజిస్టరైన డాక్యుమెంట్లు, ప్రభుత్వాలకు వచ్చిన ఆదాయపరంగా చూస్తే.. రెండు రాష్ట్రాల మధ్య తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 2015-16లో తెలంగాణలో 10.62 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా.. ప్రభుత్వానికి 3,786 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో15.12లక్షల రిజిస్ట్రేషన్లు జరగ్గా 3,585.12 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. తెలంగాణలో కంటే ఏపీలో.. 4.5 లక్షల రిజిస్ట్రేషన్లు ఎక్కువ జరిగినా.. ఆదాయం తెలంగాణకే 200.88 కోట్ల రూపాయలు అధికంగా వచ్చింది.

2021-22కి వచ్చే సరికి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు.. దాదాపు రెట్టింపయ్యాయి. 20.38 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2015-16తో పోల్చితే.. తెలంగాణలో రిజిస్ట్రేషన్లు 91.91 శాతం, ఆదాయం 228.29 శాతం పెరిగాయి. 2015-16తో పోల్చితే.. ఏపీలో రిజిస్ట్రేషన్లు 70.23 శాతం, ఆదాయం 104.89 శాతం పెరిగాయి. 2015-16లో.. తెలంగాణ ప్రభుత్వానికి 3,786 కోట్ల రూపాయల ఆదాయం రాగా.. 2021-22 నాటికి అది 12,429 కోట్ల రూపాయలకు చేరింది.

2015-16 లెక్కలతో పోల్చి చూస్తే 2021-22లో.. ఏపీకి దాదాపు 12వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలి. కానీ 7,345.88 కోట్లే వచ్చింది. 2015-16లో ఇరు రాష్ట్రాల మధ్య ఆదాయంలో వ్యత్యాసం 5.60 శాతం ఉంటే.. అది 2021-22కి 69.21 శాతానికి పెరిగింది. ప్రాప్‌టైగర్‌ అనే సంస్థ దేశంలోని 8 అగ్రశ్రేణి నగరాల్లో.. స్థిరాస్తి రంగం పురోభివృద్ధిపై చేసిన అధ్యయనం ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం కంటే రెండో త్రైమాసికంలో.. ఫ్లాట్ల విక్రయాల్లో అత్యధిక వృద్ధి నమోదైన నగరాల్లో అహ్మదాబాద్‌ తర్వాత... హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో 21 శాతం వృద్ధి నమోదైంది.

రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే!: రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకున్నవారికి అమరావతి చుక్కానిలా కనిపించింది. అనతికాలంలోనే.. అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్‌ ఇమేజ్‌ రావడంతో చుట్టుపక్కలున్న విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి వంటి ప్రాంతాలకూ.. గిరాకీ పెరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు విజయవాడ- గుంటూరు మధ్య జాతీయ రహదారికి అటూ ఇటూ..భారీ ప్రాజెక్టులు చేపట్టాయి. ఇటు విజయవాడలోనూ, అటు గుంటూరులోనూ.... నిర్మాణ రంగం ఊపందుకుంది.

విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటు,లులు, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్, అదానీ డేటా సెంటర్‌ వంటి ప్రాజెక్టులకు స్థలాలు కేటాయించడంతో విశాఖలోనూ నిర్మాణ రంగం వేగం పుంజుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణాన్ని ఆపేయడంతో..విజయవాడ- గుంటూరు మధ్య జాతీయ రహదారి పక్కన చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో చాలా వరకు.. మధ్యలోనే ఆగిపోయాయి.

ఎల్‌ఈపీఎల్, జయభేరి, అపర్ణ వంటి సంస్థలు.. మూడేళ్ల క్రితమే నిర్మాణాలు పూర్తి చేసినా వాటిలో ఫ్లాట్ల విక్రయాలు ఇప్పటికీ పూర్తవలేదు. మరికొన్నిసంస్థలు ప్రాజెక్టుల్ని మధ్యలో వదిలేసి వెళ్లిపోయాయి. ఏపీలో.. రిజిస్ట్రేషన్ల సంఖ్య, ఆదాయం ఆశించినంత పెరగకపోవడానికి ఇదో ప్రధాన కారణం.

రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ఉపాధి, ఉద్యోగావకాశాలు గణనీయంగా తగ్గిపోవడం, ఎక్కువ జీతాలొచ్చే ఐటీ వంటి రంగాల్లో హైదరాబాద్‌తో పోల్చితే విజయవాడ, విశాఖ వంటి నగరాలు వెనకబడి ఉండటంతో స్థిరాస్తి రంగంలో వృద్ధి రేటు మందగించింది. ఏపీలో ఓ స్థాయి నిర్మాణదారుల నుంచి భారీ ప్రాజెక్టులు చేపట్టిన పెద్ద పెద్ద సంస్థలవారు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు తరలిపోయారు. స్థలాలు, ఇళ్లపై పెట్టుబడి పెడదామనుకునే ప్రవాసాంధ్రులు.. ఏపీ కంటే హైదరాబాద్‌ వంటి ఇతర ప్రాంతాలవైపే మొగ్గు చూపుతున్నారు.

ని‘బంధనాల’తో మరింత ప్రతికూలత: తాజాగా 200 అడుగుల రహదారులకు.. అటూ ఇటూ 250 మీటర్ల దూరం వరకు నిర్మించే భవనాలకు.. చదరపు అడుగుకు 75 చొప్పున అదనంగా ఇంపాక్టు ఫీజు కట్టాలంటూ.. ఏపీ సర్కార్‌ మరో నిబంధన తెచ్చింది. ఇది కొత్త నిర్మాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. వీఎంఆర్‌డీఏ ఇది వరకు ఏటా సగటున 80 వరకు లేఅవుట్లకు అనుమతులిచ్చేది. ఈ ఆర్థిక సంవత్సరంలో.. డిసెంబరు వరకు 8 లేవుట్‌లకే అనుమతులిచ్చింది. లేఅవుట్ల సంఖ్య ఏ స్థాయిలో పడిపోయిందో.. చెప్పడానికి ఇదో నిదర్శనం మాత్రమే.

కరిగిపోయిన స్థిరాస్థి కల..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.