ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని.. సీఎం జగన్​కు లేఖ రాసిన నారా లోకేశ్...

author img

By

Published : Nov 19, 2022, 6:22 PM IST

Lokesh condemns CM Jagan

Lokesh condemns CM Jagan silence on aqua: ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్​కు లేఖ రాశారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై స్పందించి ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్తును 1.50 చొప్పున ఇవ్వాలని సుచించారు. నాణ్యమైన రొయ్య పిల్లలను సరఫరా చేయాలని, దాణా రేట్లు తగ్గేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెరిగిన ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి రొయ్యలకి మద్దతు ధర ప్రకటించాలని నారా లోకేశ్ లేఖలో డిమాండ్ చేసారు.

Nara Lokesh condemns CM Jagan silence: ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ సీఎం కు లేఖ రాసారు. విద్యుత్ రాయితీ, దాణా రేట్లు తగ్గేలా చర్యలు తీసుకుని , రొయ్యలకు మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని లేఖలో కోరారు. ముఖ్యమంత్రి హామీలలో ఏ ఒక్కటీ అమలు కాకపోవడమే నేటి ఆక్వారంగ సంక్షోభానికి కారణమని ధ్వజమెత్తారు. దేశంలోనే ఆక్వా ఉత్పత్తుల్లో ప్రథమస్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆక్వా హాలీడే దిశగా సాగుతోందని మండిపడ్డారు. ఆక్వా అసోసియేషన్ల పేరుతో ప్రకటనలు, అంతఃపుర కమిటీల రాయబేరాలు ఆక్వారంగ సంక్షోభాన్ని పరిష్కరించలేవని లేఖలో తెలిపారు. రొయ్యలు పెంపకం చేపట్టే రైతుల పాలిట శాపంగా మారిన సమస్యలు యుద్ధప్రాతిపదికన పరిష్కరించినప్పుడే ఆక్వారంగానికి పూర్వవైభవం వస్తుందన్నారు.

ఆక్వా పరిశ్రమకి విద్యుత్: ఆక్వా పరిశ్రమకి విద్యుత్ యూనిట్ కు 1.50కే ఇస్తానని హామీ ఇచ్చి జగన్ గద్దెనెక్కాక మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటి తుడుపుగా ప్రకటించిన విద్యుత్ రాయితీ అడ్డగోలు నిబంధనతో అందకుండా పోతోందని విమర్శించారు. దాణా రేట్లు పెరిగిపోయాయి, రొయ్యలకి వ్యాధులు సోకకుండా వాడే మందుల ధరలు మండిపోతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వా కల్చర్‌ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సడా) కింద నమోదు చేసుకున్న 10 ఎకరాల్లోపు చెరువులలో రొయ్యల పెంచే రైతులకే విద్యుత్‌ రాయితీ వర్తించేలా జీవో ఇవ్వడం ఆక్వా రంగం పాలిట శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పది ఎకరాలు దాటిన ఆక్వా రైతులు, ఆక్వాజోన్‌ పరిధిలో లేని చెరువులు, కౌలుదారులు విద్యుత్ రాయితీ అందక.. యూనిట్‌ ధర 3.85 పడటంతో ఎకరాకు 18వేలు అదనపు భారం పడుతోందన్నారు.

రొయ్యలకి మద్దతు ధర: మరోవైపు దాణా, మందులు ధరలు పెరిగి రొయ్యల ఉత్పత్తి వ్యయం 40 శాతం పెరగ్గా, రొయ్యల ధర దారుణంగా పడిపోయింది. 350 రూపాయలు వుండే 80 కౌంట్ ధర 250కి దిగజారింది. వంద కౌంట్ కిలో రొయ్య ఉత్పత్తి కి 270 ఖర్చవుతుంటే కనీసం 200 కూడా రావడం లేదని నారా లోకేశ్ లేఖలో ప్రస్తావించారు. ఇటువంటి దుస్థితిలో ఆక్వారంగం రైతులు తీవ్రనష్టాలతో అప్పులు పాలవుతున్నారని తెలిపారు. రొయ్యలు పెంపకం చేపట్టి అప్పులు పాలయ్యే బదులు ఆక్వా హాలీడే వైపు మొగ్గు చూపడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఆక్వారంగ సంక్షోభంలో పడటం ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరమని పేర్కొన్నారు. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవడానికి ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో కొత్త చట్టాలు తెచ్చి వేధింపులకు గురిచెయ్యడం, ఆక్వా రంగం రైతుల్ని తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తుందని దుయ్యబట్టారు.

నాణ్యమైన రొయ్య పిల్లలను సరఫరా: ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై స్పందించి ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్తును 1.50 చొప్పున ఇవ్వాలని సుచించారు. నాణ్యమైన రొయ్య పిల్లలను సరఫరా చేయాలని, దాణా రేట్లు తగ్గేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెరిగిన ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి రొయ్యలకి మద్దతు ధర ప్రకటించాలని లేఖలో డిమాండ్ చేసారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.