ఎండాకాలం వచ్చేసింది.. జాగ్రత్త! దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు!

author img

By

Published : Mar 7, 2023, 12:56 PM IST

Temperatures are Rising

Temperatures are Rising: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీలు పెరిగాయని వాతావరణ విభాగం చెబుతోంది. దేశవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఒడిశాలోని భువనేశ్వర్, కచ్ ప్రాంతంలోని భుజ్, ఆంధ్రప్రదేశ్​లోని తునిలో నమోదు అయినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల పట్ల జాగ్రత్తలు అవసరమని వైద్యులు చెప్తున్నారు.

Temperatures Rising in the State: వేసవి ప్రారంభంలోనే ముందే ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పొడి వాతావరణం నెలకొనటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పగటి పూట సాధారణ ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల మేర పెరిగాయని భారత వాతావరణ విభాగం తెలియచేస్తోంది. ప్రత్యేకించి దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల్లోనే ఉష్ణోగ్రతల తీవ్రత గణనీయంగా పెరుగుతోంది.

దీంతో ఎండ వేడి , వడగాలుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త అవసరం. జాగ్రత్త తీసుకోకపోతే.. కిడ్నీ, గుండెపై తీవ్ర ప్రభావితమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా కిడ్నీ జబ్బులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.

దేశవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఒడిశాలోని భువనేశ్వర్, కచ్ ప్రాంతంలోని భుజ్, ఆంధ్రప్రదేశ్​లోని తునిలో నమోదు అయినట్టు ఐఎండీ స్పష్టం చేసింది. ఈ మూడు చోట్లా 38.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయినట్టు వెల్లడించింది. సాధారణంతో పోలిస్తే సగటు ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఓడిశా, తమిళనాడు, కేరళ సహా వేర్వేరు రాష్ట్రాల్లో పెరిగినట్టు భారత వాతావరణ విభాగం చెబుతోంది.

మరోవైపు ట్రోపో ఆవరణం నుంచి మహారాష్ట్రలోని మధ్య ప్రాంతాల నుంచి హిమాలయ పర్వత పాదప్రాంతాల వరకూ పశ్చిమ అలజడుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. మరోవైపు వాయువ్య ప్రాంతం నుంచి కోస్తాంధ్ర వరకూ ఉష్ణగాలుల తీవ్రత కూడా క్రమేపీ పెరిగే అవకాశముందని ఐఎండీ చెబుతోంది. గడచిన 24 గంటల్లో గరిష్టంగా శ్రీకాకుళంలో 35.2 డిగ్రీలు, విజయనగరం 37.1 డిగ్రీలు, విశాఖ 35 డిగ్రీలు, తునిలో 38.5 డిగ్రీలు, విజయవాడ 35.3 డిగ్రీలు, కర్నూలు 36 డిగ్రీలు, ఒంగోలు 35.2 డిగ్రీలు, నెల్లూరు 34.5 డిగ్రీలు, తిరుపతి 35.9 డిగ్రీలు, అనంతపురం 36.2, చిత్తూరు 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.

జాగ్రత్తలు అవసరం:

శరీరానికి అవసరమైన నీటిని తీసుకోవాలి. ముఖ్యంగా వయసు మీద పడినవారు, చిన్న పిల్లలు విధిగా నీటిని తీసుకోవాలి. భయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. నీరు తీసుకొని వెళ్లాలి.. లేదంటే అపరిశుభ్రమైన నీరు తాగితే విరేచనాలు, వాంతులు వచ్చే ప్రమాదం ఉంది. అదే విధంగా ఎండలో భయటకు వెళ్లేటప్పుడు గొడుగు పట్టుకోవాలి.

కేవలం నీరు, ద్రవణాలే కాకుండా ఖనిజ లవణాలు కూడా తీసుకోవాలి. ప్రతి గంటకీ.. నీటిని తీసుకుంటూ ఉండాలి. వదులైన దుస్తులు ధరించాలి. కూల్ డ్రింక్​లకు దూరంగా ఉండటం మంచిది.. ఎందుకంటే ఇవి జీర్ణకోశ వ్యవస్థ నుంచి రక్తంలోకి ద్రవాలు త్వరగా వెళ్లకుండా అడ్డుకుంటాయి. వీటి స్థానంలో మజ్జిగ, పళ్లరసాల వంటివి తీసుకోవటం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.