"నాడు ఠంచనుగా.. నేడు టెన్షన్​గా".. జీతాల చెల్లింపులో ఎందుకీ అలసత్వం.!

author img

By

Published : Jan 21, 2023, 6:55 AM IST

SALARY ISSUES IN AP

GOVT EMPLOYEES SALARY ISSUES IN AP: ఒకటో తేదీ అంటే జీతాల రోజు. ఎప్పటి నుంచో ఈ తేదీకి ఉన్న ప్రాధాన్యం అది. ఆ రోజు కోసమే ఉద్యోగులంతా ఎదురుచూస్తుంటారు. అలాంటిది జగన్‌ వచ్చాక.. అసలు జీతాలు, పింఛన్లు ఎప్పుడొస్తాయో తెలియని దుస్థితి నెలకొంది. "సకాలంలో జీతాలు ఇప్పించండి మహాప్రభో... ఈ విషయంలో చట్టం చేయించండి" అంటూ .. ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్‌కు గోడు వెళ్లబోసుకునే దీనస్థితికి రాష్ట్రం వచ్చింది.

SALARY ISSUES IN AP : రాష్ట్రంలో కొన్ని నెలలుగా సకాలంలో జీతాలందక ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పింఛను వస్తే తప్ప రోజు గడవని విశ్రాంత ఉద్యోగులు ఎందరో. అలాంటి వారికీ దీనావస్థ తప్పడం లేదు. పింఛన్ల కోసం మూడో వారం, నాలుగో వారం వరకూ ఎదురుచూడాల్సిన ఉదంతాలు ఎన్నో. నెలాఖరున లేదా మరుసటి నెల ఒకటో తేదీన జీతం చెల్లించేలా ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయంటున్న ఉద్యోగులు.. ఆ మేరకు చట్టం చేయాలని గవర్నర్‌ను కలిసి విన్నవించారు.

"నాడు ఠంచనుగా.. నేడు టెన్షన్​గా".. జీతాల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు

అప్పటి నుంచే జీతాల విషయంలో 176 జీవో: ఒకప్పుడు ప్రతి నెలా ఒకటో తేదీన జీతం ఇవ్వడం కాదు.. పనిచేసిన నెలకు అదే నెల చివరి రోజు జీతాలు చెల్లించేవారట. ఇందుకు జీవోలే ఉన్నాయి. 1977 నుంచే 176 జీవో అమలవుతోంది. ప్రతినెలా చివరి రోజున ప్రభుత్వ ఉద్యోగులకు ఖజానా ద్వారా జీతాలు, పింఛన్లు చెల్లించేవారు. 1979లో కొన్ని సవరణలతో జీవో నెంబర్ 159ని అప్పటి ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. దాని ప్రకారం ఠంచనుగా నెలాఖరు రోజున ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలిచ్చేవారు.

ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్షియల్‌ కోడ్‌ వాల్యూం 1, ఆర్టికల్‌ 72 ప్రకారం ఈ ఉత్తర్వులు అమల్లో ఉండేవి. ఆ తర్వాత కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో నెలాఖరు కాదు.. ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు వెలువరించింది. జీతాలు, భత్యాలు, సెలవు వేతనం, నెలలో ఇతరత్రా రెగ్యులర్‌గా చేపట్టే చెల్లింపులు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, వర్కుఛార్జ్‌డ్‌ సిబ్బందికి వేతనాలు, ప్రతినెలా ఆనెల ఆఖరు రోజున చెల్లించాలని 1979నాటి జీవో 159 పేర్కొంటోంది.

మార్చి నెల జీతం మాత్రమే ఏప్రిల్‌ ఒకటిన చెల్లించవచ్చని నిర్దేశిస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులు అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌-13 ప్రకారం చట్టంగానే పరిగణించాలని... సకాలంలో జీతాలు చెల్లించాలనే చట్టం, జీవోలు ఎప్పటినుంచో అమల్లో ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మరుసటి నెల మూడోవారం వరకూ జీతాలు చెల్లించలేని పరిస్థితి వస్తుందని ఊహించి ఉండరని... లేకుంటే సకాలంలో జీతాలు చెల్లించేలా రాజ్యాంగంలోనే రక్షణ కల్పించి ఉండేవారనీ వ్యాఖ్యానిస్తున్నారు.

ఒకటో తేదీ జీతానికి ఎలా మారింది?: జీతాల విషయంలో 1990 నుంచి చిన్న మార్పు చేశారు. ఆ నెల జీతం మరుసటి నెల ఒకటో తేదీన చెల్లించాలని నిర్ణయం తీసుకుని... 1990 ఏప్రిల్‌ 17న కొత్త జీవో 223 తెచ్చారు. ఇలా ఎందుకు మార్చారంటే.. 1988లో జిల్లా ఖజానా అధికారుల సదస్సు జరిగింది. అందులో హైదరాబాద్‌ ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌కు ప్రతినెలా అకౌంట్ల సమర్పణపై చర్చ జరిగింది.

జిల్లాల ఖజానా అధికారులు గడిచిన నెల అకౌంట్లు ఆ మరుసటి నెల 12 నుంచి 17 మధ్య ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌కు సమర్పిస్తున్నారన్న చర్చ జరిగింది. ప్రతినెలా ఆఖరి రోజున ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నందున ఆరోజున పెద్దమొత్తంలో లావాదేవీలు జరుగుతున్నాయని.. జిల్లాల ఖజానా అధికారులు తెలిపారు. ఆ లావాదేవీలన్నీ సరిచూసుకుని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌కు అకౌంట్లు సమర్పించేందుకు దాదాపు 12 నుంచి 17 రోజుల సమయం తీసుకుంటోందన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపును ఒకరోజు వాయిదా వేయాలనే అభిప్రాయానికి వచ్చారు.

ఇలా ప్రతినెలా ఒకటిన జీతాలిస్తే.. ఈ లెక్కలన్నీ క్రోడీకరించి సరిచూసుకుని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌కు సమర్పించేందుకు 40 రోజుల సమయం ఉంటుందని వారు వివరించారు. అందుకే జీతాలు చెల్లించే తేదీని మరుసటి నెల ఒకటో తేదీకి మార్చాలని.. ఈ సదస్సు ప్రభుత్వానికి సూచించింది. ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కూడా 1989 జూన్‌ 21న ప్రభుత్వానికి లేఖ రాశారు.

ప్రతి నెలా మొత్తం జిల్లాల ఖజానా అధికారుల నుంచి సమగ్ర లెక్కలు తమకు మరుసటి నెల పదో తేదీ లోపు చేర్చలేకపోతే.... కేంద్రానికి 20వ తేదీలోపు సమగ్ర లెక్కలు సమర్పించలేమని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నెలాఖరున జీతాలు చెల్లించే పక్షంలో... ఖజానా సిబ్బంది ఆ మరుసటి నెల 10లోపు లెక్కలు సమర్పించడం సాధ్యం కాదని ప్రభుత్వానికి చెప్పారు. అప్పటి నుంచి గడిచిన నెల జీతాలు, వేతనాలు ఒకటో తేదీన చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు సవరించింది.

నాడు లెక్క తప్పేది కాదు... మరి నేడో!: అప్పట్లో ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌కు సకాలంలో లెక్కలు సమర్పించేందుకు... కేంద్రానికి సకాలంలో చేర్చేందుకు అంత ప్రాధాన్యం ఇచ్చేవారు. జీతాలు కూడా సకాలంలో అందేవి. ప్రస్తుతం అప్పు పుడితేనే జీతం. ఒకటో తేదీ నాటికి ఖజానా వెలవెలబోతోంది. రిజర్వుబ్యాంకు కల్పించిన ఓవర్‌డ్రాఫ్ట్‌, ఇతర వెసులుబాట్లు వినియోగించుకున్నా జీతాలు, పింఛన్లకు సొమ్ములు సరిపోవట్లేదు. బహిరంగ మార్కెట్‌ రుణాలకు కేంద్రం నుంచి అనుమతులు ఉంటే, అవి సకాలంలో అందితే జీతాలు చెల్లించగలరు. లేదంటే ప్రభుత్వానికి అప్పు పుట్టే వరకూ జీతాల కోసం ఉద్యోగులు వేచిచూడక తప్పట్లేదు. అది రెండో వారం కావచ్చు, నాలుగో వారం వరకైనా పట్టొచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.