బడ్జెట్‌లో బుగ్గన సూక్తి ముక్తావళి.. అబద్ధాలాడే వాళ్లంటే నాకు అసహ్యం అంటూ!

author img

By

Published : Mar 18, 2023, 10:19 AM IST

Updated : Mar 18, 2023, 12:53 PM IST

Buggana Rajendranath Reddy

Buggana Rajendranath Reddy: అబద్ధాలాడే వాళ్లంటే నాకు అసహ్యం.. కొన్నాళ్ల కిందట వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో హర్షవర్ధన్‌ అనే నటుడు ఎంతో ఆత్మవిశ్వాసంగా ఈ విషయం చెబుతాడు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పే ఆ పాత్రే అలా అనేసరికి.. వెంటనే కథానాయకుడు అల్లు అర్జున్‌ అతనితో కరచాలనం చేసి ‘మనం చేయనివి కూడా ఇంత స్ట్రాంగ్‌గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్‌. ఒక వర్గానికి మీరు ఇన్‌స్పిరేషన్‌.. ఇన్‌స్పిరేషన్‌ అంతే ’ అంటాడు వెటకారంగా! ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇటీవల బడ్జెట్‌ ప్రవేశపెడుతూ చేసిన ప్రసంగం చూస్తే అదే సీన్‌ గుర్తొస్తోందని కొందరంటున్నారు. బుగ్గన తన ప్రసంగంలో వివిధ రంగాల గురించి చెబుతూ.. మహానుభావుల మాటల్ని, సూక్తుల్ని ఎడాపెడా ఉటంకించారు. వారి స్ఫూర్తితో అద్భుతాలు చేస్తున్నట్లుగా ఊదరగొట్టారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం.. ఆయా ప్రముఖుల మాటలకు పూర్తి విరుద్ధంగా పనిచేస్తోందన్న విమర్శలు ఉన్నాయి.

బడ్జెట్‌లో బుగ్గన సూక్తి ముక్తావళి.. అబద్ధాలాడే వాళ్లంటే నాకు అసహ్యం అంటూ!

Buggana Rajendranath Reddy: మనం మొక్కలు నాటడం అంటే.. ఆశ, శాంతి అనే విత్తనాలను నాటినట్లే. మన పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించినట్లే’ ఇవి కెన్యాకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త వంగారి మతాయి చెప్పిన మాటలు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని చెబుతూ ఆమె మాటల్ని ఆర్థిక మంత్రి ప్రస్తావించారు.

1. వాస్తవం.. కొత్తగా మొక్కలు నాటడం మాట అటుంచి, వైసీపీ ప్రభుత్వం ఉన్న చెట్లనే బతకనివ్వడం లేదు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వెళుతుంటే.. ఆయన భద్రత చర్యల్లో భాగమంటూ, అంతెత్తున పెరిగిన చెట్లనూ, కొమ్మల్నీ ఎడాపెడా నరికేస్తున్నారు. ఒకపక్కన చెట్లను నరికేస్తూ, మరోపక్క పర్యావరణానికి అగ్రపాధాన్యమిస్తున్నామని బుగ్గన చెప్పడం విడ్డూరమే మరి.

భూమిని సాగు చేసేవారు అత్యంత ముఖ్యమైన పౌరులు. వీరు అత్యంత శక్తిమంతులు, అత్యంత స్వతంత్రులు, అత్యంత ధర్మబుద్ధులు’అమెరికా మూడో అధ్యక్షుడు థామస్‌ జెఫర్సన్‌ వ్యాఖ్యలివి. తమది అన్నదాతకు మట్టికి ఉన్న అనుబంధానికి శిరస్సు వంచి అభివాదం తెలిపే ప్రభుత్వమని, నేలను నమ్ముకున్న రైతుల వృత్తి ధర్మాన్ని శ్రమ వేదంగా భావించే ప్రభుత్వమని, రైతు లేనిదే రాజ్యం లేదని గుండెల నిండా విశ్వసించే ప్రభుత్వమని చెబుతూ.. బుగ్గన.. థామస్‌ జెఫర్సన్‌ వ్యాఖ్యల్ని కోట్‌ చేశారు. ‘ప్రతి వస్తువును రిటైల్‌గా కొని, తాను పండించిన దాన్ని హోల్‌సేల్‌గా అమ్మేవాడే రైతు’- అంటూ మరో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీ చేసిన వ్యాఖ్యల్నీ ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. వ్యవసాయ రంగానికి తామెంతో ప్రాధాన్యమిస్తున్నామో చెప్పుకొచ్చారు.

2. వాస్తవం.. వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఘనంగా చూపుతూ, ఖర్చు దగ్గరకు వచ్చేసరికి భారీగా కోత పెట్టడమేనా ఆ రంగానికి మీరిచ్చే ప్రాధాన్యం బుగ్గన గారూ! 2019-20 బడ్జెట్‌ కేటాయింపుల్లో 46.40 శాతం, 2021-22 బడ్జెట్‌ కేటాయింపుల్లో 59.86 శాతం మాత్రమే ఖర్చు పెట్టడాన్ని ఏమనాలి? నాలుగేళ్లుగా రైతులకు వ్యక్తిగత వ్యవసాయ యంత్ర పరికరాల్ని ఇవ్వకపోవడం, 2022-23 బడ్జెట్‌లో ఏడు లక్షల మందికి ఇస్తామని చెప్పి ఒక్కరికీ ఇవ్వకపోవడం, కీలకమైన సూక్ష్మ పోషకాల పంపిణీని గాలికొదిలేయడం, సూక్ష్మ సేద్యం పథకాన్ని మూడేళ్లుగా అటకెక్కించడం, కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర వాటా నిధులివ్వకపోవడం.. ఇదేనా మీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేస్తున్న మేలు!!

నీరము తప్ప లోహమున నిల్చి... అనే భర్తృహరి సుభాషితం ఈ విధంగా చెబుతుంది. వర్షపు చినుకు భవిష్యత్తు అది పడే స్థానంపై ఆధారపడి ఉంటుంది. సలసలా కాగుతున్న ఇనుము మీద నీటిచుక్క పడితే అది క్షణాల్లో ఆవిరవుతుంది. అదే నీటి బిందువు తామరాకు మీద పడితే తళతళ మెరుస్తుంది. ఆల్చిప్పలో పడితే ముత్యమై మిగులుతుంది. రైతన్నల పొలాల్లో పడితే మొక్కలుగా మొలచి ప్రజల ప్రాణమై నిలుస్తుంది.’ నీటిపారుదల రంగానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందంటూ.. బుగ్గన భర్తృహరి సుభాషితాన్ని ప్రస్తావించారు.

3. వాస్తవం.. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులు అంతంతే. కేటాయించిన వాటిలో సగం నిధులూ ఖర్చు చేయలేదు. నెల్లూరు, సంగం బ్యారేజీల్ని తప్ప ఏ ప్రాజెక్టునూ ఇంతవరకు పూర్తి చేయలేదు. పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. వెలిగొండ ప్రాజెక్టును 2024 జూన్‌లోపు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా, ఈ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు కేవలం రూ.101.47 కోట్ల్లే. 2022-23 బడ్జెట్‌లో సాగునీటి రంగానికి 9 వేల810 కోట్ల కేటాయింపులు చూపించి, ఈ జనవరి నెలాఖరుకు చేసిన ఖర్చు కేవలం 3 వేల514 కోట్లు. ఇదేనా బుగ్గన గారూ సాగునీటి రంగానికి మీరిచ్చే ప్రాధాన్యం?

భారతదేశ ఆత్మ గ్రామాల్లో నివసిస్తుంది అంటూ గ్రామీణాభివృద్ధికి తమ ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యమిస్తోందని చెబుతూ మహాత్మాగాంధీ మాటల్ని బుగ్గన ప్రస్తావించారు.

4. వాస్తవం.. గ్రామ స్వరాజ్యానికి మూలస్తంభాల్లాంటి పంచాయతీల్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. పంచాయతీలకు 14, 15 ఆర్థిక సంఘాలు ఇచ్చిన నిధుల్నీ విద్యుత్‌ బకాయిల పేరుతో సర్దుబాటు చేసేసింది. గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించేందుకూ నిధుల్లేని పరిస్థితి కల్పించింది. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థల్ని ఏర్పాటు చేసి పంచాయతీల్ని నిర్వీర్యం చేసింది. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది.

విద్య మాత్రమే మానవాళికి జీవనాడి. విద్య వల్ల ఆత్మ విశ్వాసం మెరుగుపడుతుంది. ఇది మన సొంతమైతే మహోన్నత విజయాలకు దారితీస్తుంది’. విద్యారంగానికి తమ ప్రభుత్వం విశేష ప్రాధాన్యమిస్తోందంటూ వివేకానంద చెప్పిన సూక్తిని బుగ్గన ప్రస్తావించారు.

5. వాస్తవం.. ఆడంబరం తప్ప విద్యారంగానికి జగన్‌ ప్రభుత్వం చేస్తోంది తక్కువ. చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకూ పొంతన లేదు. ‘నాడు-నేడు’కు అరకొర కేటాయింపులతో సరిపెట్టింది. డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలలకు 2020-21 విద్యా సంవత్సరంలో నాలుగో త్రైమాసికం బోధన రుసుముల్ని చెల్లించలేదు. ప్రైవేటు కళాళాలల్లో పీజీ కోర్సులకు 2020-21 నుంచి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ నిలిపేసింది. ఒక్కో పీజీ విద్యార్థిపై సగటున 60 వేల రూపాయల వరకు భారం పడుతుండటంతో, చాలా మంది పీజీ చదివేందుకు ఆసక్తి చూపడం లేదు. నూతన విద్యా విధానం అమలు పేరుతో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసి నానా గందరగోళం సృష్టించింది. దీంతో 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల నుంచి 3.50 లక్షల మంది ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. ఒకపక్క విద్యారంగం పరిస్థితి ఇలా ఉంటే.. బుగ్గన మాత్రం తన బడ్జెట్‌ ప్రసంగంలో తెగ గొప్పలు చెప్పారు.

బుగ్గన చెప్పిన సూక్తులు..

  • ‘మనం మొక్కలు నాటడం అంటే.. ఆశ, శాంతి అనే విత్తనాలను నాటినట్లే. మన పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించినట్లే ' - కెన్యా పర్యావరణవేత్త వంగారి మతాయి
  • 'భూమిని సాగు చేసేవారు అత్యంత ముఖ్యమైన పౌరులు. వీరు అత్యంత శక్తిమంతులు, అత్యంత స్వతంత్రులు మరియు అత్యంత ధర్మబుద్ధులు ’-అమెరికా మూడో అధ్యక్షుడు థామస్‌ జెఫర్సన్‌
  • ‘ప్రతి వస్తువును రిటైల్‌గా కొని, తాను పండించిన దాన్ని హోల్‌సేల్‌గా అమ్మేవాడే రైతు ’- అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీ
  • ‘నీరము తప్ప లోహమున నిల్చి.. వర్షపు చినుకు భవిష్యత్తు అది పడే స్థానంపై ఆధారపడి ఉంటుంది. సలసలా కాగుతున్న ఇనుము మీద నీటిచుక్క పడితే అది క్షణాల్లో ఆవిరవుతుంది. అదే నీటి బిందువు తామరాకు మీద పడితే తళతళ మెరుస్తుంది. ఆల్చిప్పలో పడితే ముత్యమై మిగులుతుంది. రైతన్నల పొలాల్లో పడితే మొక్కలుగా మొలచి ప్రజల ప్రాణమై నిలుస్తుంది.’ -భర్తృహరి సుభాషితం
  • భారతదేశ ఆత్మ గ్రామాలో నివసిస్తుంది- మహాత్మాగాంధీ
  • విద్య మాత్రమే మానవాళికి జీవనాడి. విద్య వల్ల ఆత్మ విశ్వాసం మెరుగుపడుతుంది. ఇది మన సొంతమైతే మహోన్నత విజయాలకు దారితీస్తుంది’- వివేకానంద

ఇవీ చదవండి:

Last Updated :Mar 18, 2023, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.