రాష్ట్రంలో ఘనంగా దీపావళి సంబరాలు - నరకసురవధను అసక్తిగా తిలకించిన ప్రజలు

రాష్ట్రంలో ఘనంగా దీపావళి సంబరాలు - నరకసురవధను అసక్తిగా తిలకించిన ప్రజలు
Diwali Celebrations 2023 All in Over AP: రాష్ట్రవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రముఖ దేవాలయాల్లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పట్నం, పల్లె అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పండుగ వాతావరణంలో గడుపుతున్నారు. పలు చోట్ల పెద్దఎత్తున నరకాసురుని వధ కార్యక్రమాలు నిర్వహించారు.
Diwali Celebrations 2023 in All Over AP: రాష్ట్రవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళిని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామికి సహస్ర దీపాలంకరణ చేశారు. విజయవాడ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో లక్ష్మీ యాగం.. మార్కాపురంలోని పలు వీధుల్లో నరకాసురుని వధ నిర్వహించారు. అంతేకాకుండా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నరకసుర వధను ఏర్పాటు చేయగా.. ప్రజలు అసక్తిగా తిలకించారు.
Diwali in Tirupati: తిరుమల శ్రీవారి ఆలయంలో పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయదేవేరులతో మలయ్యప్ప స్వామిని సర్వభూపాల వాహనంపై బంగారువాకిలి ముందున్న ఘంటా మండపంలో ఉంచారు. స్వామి వారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదలను చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామికి సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. అనంతరం మలయప్పస్వామికి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఆస్థానం వల్ల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
"దీపావళి ఆస్థానం వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న రితీలోనే ఈ రోజున స్వామి వారి ఆలయంలో.. వైభవంగా జరిగింది. ప్రజలందరూ సుభీక్షంగా ఉండాలని వేంకటేశ్వర స్వామి వారి దీవేనలు అందరికి ఉండాలని ప్రార్థిస్తున్నాము." భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్
దీపావళి పర్వదినం సందర్భంగా విజయవాడ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో లక్ష్మీ యాగం నిర్వహించారు. మరకత రాజరాజేశ్వరీ అమ్మవారి శ్రీ చక్రం వద్ద నాణాలతో ధనార్చన చేశారు. ప్రతి ఒక్కరి ఇంట్లో సిరి సంపదల విషయంలో ఎటువంటి లోటు ఉండకూడదని ఈ పూజ చేసినట్లు ప్రధాన అర్చకలు ప్రసాద్ శర్మ తెలిపారు. దీపారాధన చేసే ఇంట్లోకి మహాలక్ష్మి దేవి ప్రవేశిస్తుందని ఎంతో మంది నమ్ముతారని ఆయన తెలిపారు.
"దీపావళి అంటేనే విశేషంగా దీపారాధన. లక్ష్మీ పూజ, దీపా దుర్గ పూజ అని చెప్పి .. చాలా మంది ద్వాదశి వేళలో చేస్తుంటారు. టపాసులు కాల్చుకున్నా ప్రధానంగా చేయాల్సింది దీపారాధన. ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ దీపారాధనను కార్తీక మాసం వరకు చేస్తుంటారు." -ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు, గణపతి సచ్చిదానంద ఆశ్రమం
దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఊరూ వాడ సందడి నెలకొంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పండగ సందర్భంగా నరకాసురుని వధ నిర్వహించారు. సంప్రదాయ బద్ధంగా రుక్మిణీ, సత్యభామ అవతారంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఊరేగింపుగా వచ్చి.. నరకాసురున్ని వధించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
దీపావళి సందడితో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కళకళలాడిపోతున్నాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరం, కేంద్రపాలిత ప్రాంతం యానాంలో టపాసులు దుకాణాల వద్ద సందడి నెలకొంది. అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వడంతో దుకాణాల సంఖ్య భారీగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈసారి ధరలు పెరగడంతో.. టపాసులు కొనలేక పోతున్నామని ప్రజలు చెబుతున్నారు.
