దిల్లీ లిక్కర్​ స్కామ్​.. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

author img

By

Published : Dec 3, 2022, 7:42 AM IST

ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

CBI Notices to MLC Kavitha : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 160 సీఆర్​పీసీ కింద నోటీసులు జారీ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. ఈ నెల 6న విచారణకు హజరు కావాలని వెల్లడించింది. ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలపాలని సూచించింది. నోటీసులు అందిన విషయాన్ని ధ్రువీకరించిన కవిత.. హైదరాబాద్‌లోని తన నివాసంలో వివరణ ఇస్తానని వెల్లడించింది.

CBI Notices to MLC Kavitha : దిల్లీ మద్యం కేసులో సీబీఐ శుక్రవారం తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసింది. దిల్లీలో నమోదు చేసిన ఆర్‌సీ 53(ఎ)/2022 కేసులో దర్యాప్తు కోసం సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద దిల్లీకి చెందిన సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్‌ కుమార్‌ షాహి ఈ నోటీసులు జారీ చేశారు. ‘‘ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో కానీ, దిల్లీలో కానీ మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నాం. మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో దయచేసి తెలియజేయండి’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ రాయ్‌ నుంచి వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియాతోపాటు మరో 14 మందిపై కేసు నమోదైనట్లు ఇందులో తెలిపారు.

2021-22 దిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్‌ విధానంపై వచ్చిన ఆరోపణల్లో భాగంగా ఈ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ‘‘విచారణ సమయంలో వెలుగులోకి వచ్చిన విషయాల గురించి మీకు తెలిసి ఉండొచ్చు. దర్యాప్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ అంశాలపై మిమ్మల్ని విచారించాల్సిన అవసరం ఏర్పడింది’’ అని కవితకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఇదే కేసులో ఈడీ అరెస్ట్‌ చేసిన అమిత్‌ అరోడాను బుధవారం కోర్టులో హాజరుపరిచినప్పుడు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో కవిత పేరు తొలిసారిగా కనిపించింది. ఆప్‌ నేతలకోసం సౌత్‌గ్రూప్‌ విజయ్‌నాయర్‌కు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చిందని, ఆ గ్రూప్‌ కవిత, శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రణలో ఉందని ఈడీ అందులో పేర్కొంది. అలాగే దిల్లీ మద్యం విధాన ఖరారు సమయం నుంచి ఈ వివాదం వెలుగులోకి వచ్చిన గత ఆగస్టు నాటికి దాదాపు ఏడాది కాలంలో కవిత రెండు ఫోన్‌ నంబర్లకు చెందిన పది ఫోన్లు మార్చడమో, ధ్వంసమో చేసినట్లు కూడా పేర్కొంది. అందులో 5 ఫోన్లు ఈ ఏడాది ఆగస్టు 9, 22, 23 (రెండు ఫోన్లు), 24 తేదీల్లో మార్చినట్లు తెలిపింది. ఆ విషయం వెలుగులోకి వచ్చిన రెండో రోజే సీబీఐ విచారణ కోసం సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద నోటీసులు జారీ చేసింది.

నా వివరణ కోసం నోటీసులిచ్చింది..: సీబీఐ నోటీసులు జారీ అయిన విషయాన్ని కవిత ధ్రువీకరించారు. ‘‘నా వివరణ కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది. వారి అభ్యర్థన మేరకు ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్‌లోని మా నివాసంలో కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేశా. ఇంటివద్దే వారికి వివరణ ఇస్తా’’ అని కవిత శుక్రవారం రాత్రి చెప్పారు.

ఇవీ చూడండి..

'అత్యంత పారదర్శక వ్యవస్థల్లో ఒకటి'.. కొలీజియంను పూర్తిగా సమర్థించిన సుప్రీం

ల్లలు దాటిన 'పుష్ప' క్రేజ్.. బన్నీతో సినిమాకు ఆ బాలీవుడ్​ డైరెక్టర్​ రెడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.