రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

author img

By

Published : Mar 15, 2023, 1:38 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఆందోళలకు గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్కో జిల్లాలో పరీక్షలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందా రండి..

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతి లేకపోవటంతో విద్యార్థులంతా తొందరగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

కర్నూలు జిల్లాలో..
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులకు అనుమతి లేకపోవడంతో ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 124 కేంద్రాల్లో 76,607 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

బాపట్ల జిల్లాలో..
బాపట్లజిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం జూనియర్ ఇంటర్ పరీక్ష ప్రారంభం కాగా గురువారం సీనియర్ ఇంటర్ పరిక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 34 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జూనియర్ ఇంటర్ విద్యార్థులు 8,759 మంది పరిక్షలు రాస్తుండగా.. 10,474 మంది సీనియర్ ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించేదే లేదని అధికారులు చెప్పారు. చీరాలలో పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు కిటకిటలాడారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను స్వయంగా పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకొచ్చి వదిలి పెడుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

వైయస్సార్ జిల్లాలో..
వైయస్సార్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. గట్టి బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 92 పరీక్ష కేంద్రాలలో 18,377 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాలలో కెమెరాలు ఏర్పాటు చేసి పరీక్షల విధానాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు కొనసాగుతాయి. విద్యార్థులను 9:30 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.

అంతకు మించి ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం లేదు. మొదటి రోజు పరీక్షలు కావడంతో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటబెట్టుకొని పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చారు. తమ పిల్లలు పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లేంత వరకు తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. విద్యార్థులు ఏమాత్రం ఆందోళన గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు. జిల్లాలో ఒక్కో పరీక్షా కేంద్రం వద్ద ఒక్కో ఏఎస్ఐ తో పాటు ముగ్గురు కానిస్టేబుల్స్​తో బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్ర పరిసర ప్రాంతాలలో ఎలాంటి జిరాక్స్ కేంద్రాలు లేకుండా మూసివేశారు.

అన్నమయ్య జిల్లాలో..
అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజంపేట పట్టణంలో నాలుగు సెంటర్లలో 1,200 మంది పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షకు హాజరయ్యారు.

కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లాలోని గన్నవరంలో ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు ప్రారంభమయ్యాయి. గన్నవరం పరిసరాల్లోని చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిని అనుకొని ఉన్న పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళాశాలకు వెళ్లే వాహనాలు అమాంతం హైవేపై నిలుపుదల చేయడంతో ప్రధానంగా గూడవల్లి, నిడమానూరు వద్ద ఉదయం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు కూడా సమాంతరంగా జరుగుతుండటంతో.. కేంద్రాలకు వచ్చే విద్యార్థులు ఒకింత అవస్థలు పడ్డారు. హైవేపై ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు సత్వర చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గన్నవరం పరిసరాల్లో సుమారు 20 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 5వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా..
కట్టదిట్టమైన ఏర్పాట్లు మధ్య నెల్లూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 55,909 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం 26,030 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, ద్వితీయ సంవత్సరం 26,705 మంది విద్యార్థులు పరీక్షలు రానున్నారు. ప్రధమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 3,150 వృత్తి విద్యా కోర్సు పరీక్ష రాయనున్నారు. వీరి కోసం జిల్లాలో 95 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరా ఏర్పాటుతో పాటు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్షా కేంద్రం వద్ద ఇంటర్ విద్యార్థులు అవస్థలు పడ్డారు. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించమని ఆదేశాలు ఉండడంతో విద్యార్థులంతా ముందుగానే పరీక్షా కేంద్రం వద్దకు భారీగా చేరుకున్నారు. అయితే ప్రభుత్వ జూనియర్ కళాశాల యాజమాన్యం గేటు తాళాలు ఆలస్యంగా తీయడమే కాకుండా పూర్తిగా తీయకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో గెేటు సందులో నుంచి పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.