R5 Zone: అమరావతి మాస్టర్ ప్లాన్​ను చెడగొట్టడమే ప్రభుత్వ లక్ష్యం: రాజధాని రైతులు

author img

By

Published : May 15, 2023, 4:27 PM IST

Amaravati farmers

Amaravati farmers: ఆర్‌-5 జోన్​కు వ్యతిరేకంగా రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓ వైపు ఆందోళనలు, ధర్నాలు చేస్తూనే.. మరోవైపు సుప్రీం కోర్టులో న్యాయం కోసం పోరాడుతున్నారు రాజధాని రైతులు. రాజధాని రైతుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు.

Amaravati farmers On R5 Zone: ఆర్-5జోన్ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం తమకు న్యాయం చేస్తుందని.. రాజధాని ఐకాస నాయకులు పువ్వాడ సుధాకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి కేసులతో కలిపి ఆర్‌-5జోన్ అంశాన్ని కూడా విచారించాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. మరో మూడు రోజుల్లో సుప్రీంకోర్టులో ఈ అంశం విచారణకు వస్తున్నందున అప్పటివరకు ఆర్‌-5 జోన్​లో పనులు ఆపేయాలని, ప్లాట్ల పంపిణీ ప్రక్రియ వాయిదా వేయాలని రైతులు కోరుతున్నారు.

మాస్టర్ ప్లాన్ ను చెడగొట్టడమే ప్రభుత్వ లక్ష్యం: ఆర్‌-5 జోన్​కు వ్యతిరేకంగా రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాజధాని అభివృద్ధి కోసం తమ భూములు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నాశనం చేసి ఇష్టారీతిన భూముల పంపిణీకి తెరలేపిందని ఆరోపించారు. పేదల ఇళ్ల కోసం ఆర్‌-3 జోన్ భూములు ఉన్నప్పటికీ.. ప్రత్యేకించి ఆర్‌-5 జోన్ ఎందుకని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్​ను చెడగొట్టడమే ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. రాజధానిని అభివృద్ధి చేయకుండా ఇతర ప్రాంతాల్లోని పేదలను తీసుకువచ్చి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఏం చేస్తారని వారు ప్రశ్నించారు. ఇక్కడ ఉన్నవారికే ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే.. బయట వారిని తెచ్చిపెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

23మంది రైతులపై​ కేసులు: ఆర్ 5 జోన్​కు వ్యతిరేకంగా దొండపాడులో ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మాస్టర్ ప్లాన్​లో సూచించిన ప్రాంతంలో కాకుండా పారిశ్రామిక జోన్లో పేదల కోసం ఇళ్ల స్థలాలు కేటాయించటాన్ని నిరసిస్తూ రైతులు రెండు రోజులు ఆందోళనలు చేశారు. దొండపాడులో లే ఔట్లు అభివృద్ధి పనులు చేయటానికి వచ్చిన సీఆర్డీఏ అధికారుల్ని అడ్డుకున్నారు. జేసీబీలను వెనక్కు పంపించారు. పెట్రోల్ సీసాలతో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులతో పలుమార్లు వాగ్వాదం జరిగింది. శనివారం సాయంత్రం రైతుల ఆందోళనను బలవంతంగా విరమింపజేశారు. అయితే ఆందోళనలో పాల్గొన్న రైతులపై ఆదివారం సాయంత్రం ఎఫ్​ఐఆర్ నమోదైంది. 23మంది రైతుల పేర్లను ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొన్నారు. మరికొందరి పేర్లను ఎఫ్.ఐ.ఆర్ చేర్చే అవకాశమున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకోవటం, విధులు నిర్వహించకుండా నిలువరించటం, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించటం వంటి కారణాలను ఎఫ్.ఐ.ఆర్​లో పేర్కొన్నారు. రైతలపై కేసులు నమోదు చేయడంపై పలు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం పోరాడుతుంటే తమపైనే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్‌-5 జోన్​కు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.