టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు..సినీ నటుడు మురళీ మోహన్ ఆచరించారు

author img

By

Published : Jan 23, 2023, 10:04 AM IST

Chataparru

Movie Actor Murali Mohan is remodeling a 98year old house: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పిలుపు మేరకు సినీ నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్ తాను పుట్టి పెరిగిన తాతల నాటి 98 ఏళ్ల నాటి ఇంటికి కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి పునర్ నిర్మిస్తున్నారు. కనీసం మరో 50 ఏళ్లపాటు ప్రజలకు సేవలందించేలా ఇంటిని సిద్ధం చేయిసున్నారు.

98 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇల్లు.. కోట్ల ఖర్చుతో ఆధునికీకరణ

Movie Actor Murali Mohan is remodeling a 98year old house: ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా.. కన్న తల్లిని, ఉన్న ఊరిని మరవకూడదంటారు. ఈ విషయాన్ని బలంగా ఒంటబట్టించుకున్న మాజీ ఎంపీ మురళీ మోహన్.. తన తాతల నాటి ఇంటిని పదిలంగా చూసుకుంటున్నారు. శిథిలావస్థకు చేరిన ఇంటిని కోట్లు ఖర్చు పెట్టి పునర్ నిర్మిస్తున్నారు. కనీసం మరో 50 ఏళ్లు సేవలందించేలా సిద్ధం చేయడమే కాకుండా.. దాన్ని ప్రజా అవసరాలకు ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు.

ఏలూరు గ్రామీణ పరిధిలోని చాటపర్రు.. మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ స్వగ్రామం. ఆయన తాతగారు మాగంటి సుబ్రమణ్యం.. అప్పట్లోనే గ్రామంలో పెద్ద భవంతి కట్టించారు. ఆ ఇంట్లోనే మురళీ మోహన్ పుట్టి పెరిగారు. ఇక్కడి నుంచే విద్యాభ్యాసం కొనసాగించారు. పెద్దయ్యాక సొంతూరి నుంచే ఏలూరులోని కళాశాలకు వెళ్లి చదువుకునే వారు. అలాగే చాటపర్రులోని ఈ ఇంటి నుంచే సినీ, వ్యాపార రంగాల్లో ప్రవేశించారు. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడినా.. సొంతూరిపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదంటున్నారు మురళీ మోహన్‌. తీరిక దొరికినప్పుడల్లా ఊరిని, ఇక్కడి ఇంటిని సందర్శించడం మురళీ మోహన్‌కు అలవాటు.

1925 సంవత్సరంలో 18 అంగుళాల మందంతో, పూర్తిగా సున్నంతో ఇంటి గోడలను నిర్మించారు. రెండతస్థుల ఈ ఇంటిని ఇందిరా విలాస్‌గా పిలుచుకునేవారు. మురళీ మోహన్ తాత, తండ్రి కాలం చేసిన తర్వాత ఖాళీగా ఉన్న ఇంటిని గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అప్పగించారు. కొన్నేళ్ల పాటు ఇందులో ఆస్పత్రిని నడపగా.. భవనం శిథిలావస్థకు చేరడంతో మరోచోటుకి తరలించారు.

ప్రస్తుతం భవనం ఆకారం మారకుండా, పాతకాలపు రూపురేఖలు చెక్కుచెదరకుండా ఆధునికీకరిస్తున్నారు. ఈ పనులు పూర్తయ్యాక సామాజిక కార్యక్రమాలు, గ్రామ అవసరాల కోసం భవనం ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు మురళీ మోహన్ తెలిపారు. తాతల కాలం నాటి ఇంటిని కోట్లు వెచ్చించి పునర్నిర్మించడంతో పాటు సామాజిక అవసరాల కోసం ఇవ్వాలనుకోవడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ గ్రామంలో మా తాతగారు కట్టిన ఇల్లు ఇది. నేటితో 98ఏళ్లు పూర్తయ్యింది ఇల్లు కట్టి. ఈ ఇంటిలోనే మేమందరం పుట్టి, పెరిగాము. ఇక్కడే చదువుకున్నాం. ఇక్కడి నుంచే వ్యాపారాలు, సినిమాల్లోకి వెళ్లాం. చంద్రబాబు నాయుడుగారు ఓ పిలుపిచ్చారు.''జన్మభూమిని, ఉన్న ఊరిని, కన్నతల్లిని ఎప్పటికీ మర్చిపోకండి. ఏ ఊరిలో పుట్టి, పెరిగినా, ఏ ఊరికి వెళ్లి స్థిరపడినా, ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా, మన ఊరిని గుర్తుపెట్టుకోండి, మన గ్రామాన్ని బాగు చేయండి'' అని ఆయన ఇచ్చిన పిలుపును..స్ఫూర్తిగా తీసుకుని మా తాతలు కాలంనాటి 98 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ఇంటిని మరో 50ఏళ్ల వరకు ఉండేలా పునర్ నిర్మిస్తున్నాను. మురళీమోహన్, తేదేపా మాజీ ఎంపీ

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.