క్షణికావేశంలో కరిగిపోతున్న జీవితాలు..మూడేళ్లలో వెయ్యికి పైగానే

author img

By

Published : Sep 18, 2021, 4:46 PM IST

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/18-September-2021/13098101_suicide.jpg

చరవాణి ఇవ్వలేదని.. భార్య కాపురానికి రావడం లేదని.. వివాహం కావడం లేదని.. చీరలు, నగలు కొనివ్వలేదని.. మద్యం మానమన్నారని.. అప్పులు తీరడం లేదని.. పరీక్షల్లో తప్పారని.. వ్యాపారంలో నష్టాలని.. కుటుంబ కలహాలని.. అనారోగ్యమని.. సంతానం కలగలేదని.. ప్రేమ విఫలమైందని.. పెళ్లికి ఒప్పుకోలేదని.. భర్త మాట వినలేదని.. భూ వివాదం తెగలేదని.. ఒంటరితనం వేధిస్తోందని.. తల్లిదండ్రులు మందలించారని.. కారణాలలేవైనా.. అర్థంతరంగా తనువు చాలిస్తున్నారు. పిల్లలు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, స్నేహితులు, సహచరుల కళ్లల్లో కన్నీళ్లు నింపుతున్నారు. ఒక్క కడప జిల్లాలోనే తొమ్మిది నెలల్లోనే దాదాపు 277 మంది తనువు చాలించారు. మూడేళ్లలో వీరి సంఖ్య వెయ్యికి పైమాటే.

జీవితంలో ఎదురయ్యే సమస్యలకు, సవాళ్లకు పరిష్కారం ఉంటుంది. దానికి కొంచెం ఓపిక, ప్రశాంతత కావాలి. అలా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కరించవచ్చు. కానీ కొంతమంది ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. పదేపదే దాని గురించే ఆలోచిస్తూ ప్రాణాలు విడుస్తున్నారు. ఈ విషయంలో చిన్నా.. పెద్దా అనే తేడా చూడట్లేదు.

చిన్న చిన్న కారణాలు..

ప్రాణం కంటే ఏది గొప్పది కాదు.. కష్టనష్టాలు వచ్చినా తాత్కాలికమే.. భవిష్యత్తు బాగుంటుంది అన్న నమ్మకంతో అడుగేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు. కానీ క్షణికావేశంతో ప్రాణాలు విడుస్తున్నారు.

  • లింగాల మండలం ముర్రా చింతల శుక్రవారం తెల్లవారుజామున శివారెడ్డి వెంకటలక్ష్మి అనే వృద్ద దంపతులు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బలవన్మరణానికి పాల్పడ్డారు.
  • ఓబులవారిపల్లె లో భర్త ఇంటికి రాలేదని మనస్థాపంతో కళ్యాణి అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
  • కడపకు చెందిన వంశీకృష్ణ ప్రేమ వివాహాన్ని తల్లిదండ్రులు ఒప్పుకోలేదని మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
  • కడప చింతకొమ్మదిన్నెకు చెందిన సుబ్రమణ్యం కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
  • కడప జిల్లా మైలవరం మండలం దొమ్మర నంద్యాల కు చెందిన మాధవికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. మాధవి తన నాలుగు సంవత్సరాల కొడుకుతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

మూడేళ్లలో వెయ్యి మందికి పైగా..

2019లో 318, 2020లో 409 మంది, 2021 సెప్టెంబర్ 9 వరకు 277 ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందని.. సమస్యను స్నేహితులు, తల్లిదండ్రులతో పంచుకోవాలని.. అప్పుడే పరిష్కారం దొరుకుతుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: TWO DEAD: కరపలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.