తృణధాన్యాల ఉత్పత్తులపై తెలంగాణ సర్కార్ ఫోకస్‌.. ఆ సంస్థలతో ఒప్పందాలు

author img

By

Published : Jan 10, 2023, 1:01 PM IST

Millets Products

Millets Products: తెలంగాణ రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు, ఉత్పత్తి, ఉత్పాదతక పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఈ ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో ఆ పంటల ఉత్పత్తుల మార్కెటింగ్ విస్తృతం చేయాలని నిర్ణయించింది. కొవిడ్ నేపథ్యంలో పౌష్టికాహారంపై ప్రజల్లో స్పృహ పెరిగినందున టీఎస్​ ఆగ్రోస్ బ్రాండ్‌ పేరిట ఉత్పత్తులు విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Millets Products: తెలంగాణలో చిరుధాన్యాల విప్లవం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పంటల జీవవైవిధ్యం, పర్యావరణ హితం దృష్ట్యా పెద్దఎత్తున చిరుధాన్యాల సాగు, ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేలా రైతుల్నిప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. పట్టణాలు, నగరాల్లో మంచి నాణ్యమైన చిరుధాన్యాల లభ్యతతోపాటు అదనపు విలువ జోడింపు, రుచికరమైన వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఇప్పటికే రైతుల ప్రయోజనాల దృష్ట్యా నాణ్యమైన విత్తనాలు, రసాయన ఎరువులు, సేంద్రీయ ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఇతర పనిముట్లు సరఫరా చేస్తున్న ఆగ్రో సేవా కేంద్రాల్ని అందులో భాగస్వామం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్ధులకు రుచికర సాత్విక ఆహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వంతో అక్షయ ఫౌండేషన్, హరే కృష్ణ మూవ్‌మెంట్ పదేళ్లుగా భాగస్వామ్యమై సేవలు అందిస్తోంది. జీహెచ్​ఎంసీలో అన్నపూర్ణ పేరిట 5 రూపాయలకే భోజనం సరఫరా చేస్తోంది.

"మిల్లెట్స్​తో తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రభుత్వంతో కలిసి మా సంస్థ తయారుచేస్తోంది. ఈ మధ్య కాలంలో యువత ఆ మిల్లెట్స్​తో తయారు చేసిన ఆహారం తీసుకోవడం మానేశారు. అందుకే ముఖ్యంగా యువత, చిన్నపిల్లలను ఆకార్షితులు చేయడానికి రాగితో తయారు చేసిన ప్రత్యేక వంటకాలు, మోడ్రన్​గా కేక్​లు, ఇతర ఆహార పదార్థాలు తయారు చేస్తున్నాం". -సత్యగౌరచంద్ర దాస్, హరే కృష్ణ మూవ్‌మెంట్‌ అధ్యక్షుడు

స్త్రీ, శిశు సంక్షేమ శాఖతో కలిసి వనపర్తిలో తొలిసారిగా ఐసీడీఎస్​ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టిహాకారం కోసం ప్రయోగాత్మకంగా చిక్కీలను అందిస్తున్నారు. అందుకోసం అవసరమైన ఉత్పత్తులను గ్రామీణప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతుల వద్ద సేకరించి చిరుధాన్యాలకు పూర్వవైభవం తేవాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ క్రమంలో గ్రామాల్లో రైతులకు సేవలందిస్తున్న ఆగ్రో సేవా కేంద్రాల నిర్వాహకులకు ఇతోధికంగా రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని ఎస్​బీఐ అధికారులు తెలిపారు.

ఆగ్రోసేవా కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ: వ్యవసాయంలో వన్‌స్టాప్‌షాప్ సేవలందించేందుకు.. టీఎస్ ఆగ్రోస్ సిద్ధమైంది. పల్లెల్లో విత్తనం నుంచి పంటకోతల వరకు రైతులు పడుతున్న ఇబ్బంది దృష్ట్యా ఓ అడుగు ముందుకు వేసింది. ప్రధాన ఆహార పంట వరి సహా మొక్కజొన్న, పత్తి, మిరప, పప్పుధాన్యాలు, ఇతర పంటల సాగు విత్తనాలు సహా భూసార పరీక్షల సేవలందించేందుకు ఆగ్రో సేవా కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ ఇప్పించనుంది. చిరుధాన్యాల మార్కెటింగ్‌లో వ్యవసాయ పట్టభద్రులైన యువతులు, ఔత్సాహిక మహిళలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది.

మహిళా సాధికారతే లక్ష్యంగా విద్యావంతులైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు త్వరలో టీఎస్ ఆగ్రోస్‌, సిజెంట్ నేతృత్వంలో "వసుధ" బ్రాండ్‌పై చిరుధాన్యాల ఉత్పత్తులు మార్కెట్‌లోకి తీసుకురానున్నారు.

"రాష్ట్రంలో మిల్లెట్ ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం.. హరే కృష్ణ హరే రామా సంస్థతో కలిసి ప్రారంభించాం. టీఎస్ ఆగ్రోస్‌, సిజెంట్ కూడా ఇందులో భాగస్వాములుగా ఉండి మిల్లెట్స్​ ఆహార ఉత్పత్తులను పెంచడానికి తోడ్పడుతున్నారు. జంక్​ఫుడ్​ను పూర్తిని దూరం చేసి ఈ మిల్లెట్​ఫుడ్​ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్యేశ్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంతే కాకుండా యువతకు ఉపాధి మార్గాలు కూడా పెంచాలనే కారణంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం."-డాక్టర్ కె.రాములు, రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఎండీ

మిల్లెట్స్​ ఉత్పత్తులపై సర్కార్ ఫోకస్‌.. ఆ సంస్థలతో ఒప్పందాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.