Moola Reddy: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే, తెదేపా వ్యవస్థాపక సభ్యుడు నల్లమిల్లి మూలారెడ్డి (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం మధ్యాహ్నం అనపర్తి మండలం రామవరంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1942 మే 8న జన్మించిన మూలారెడ్డి 1970లో రాజకీయ అరంగేట్రం చేశారు. రెండుసార్లు రామవరం సర్పంచిగా పనిచేశారు. 1978లో రామచంద్రపురం కో-ఆపరేటివ్ సూపర్ బజార్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. 1982లో తెదేపా ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్కు దగ్గరయ్యారు. 1983 నుంచి 2009 వరకు ఏడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన మూలారెడ్డి నాలుగుసార్లు (1983, 1985, 1994, 1999లో) ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మూలారెడ్డి కుమారుడు.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా అనపర్తి ఎమ్మెల్యేగా పని చేశారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబు సంతాపం
మూలారెడ్డి మృతి దిగ్భ్రాంతి కలిగించిందనీ, ఆయన మరణం పార్టీకి తీరని లోటనీ తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రామకృష్ణారెడ్డిని వారు ఫోన్లో పరామర్శించారు. ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణరెడ్డి, చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు నివాళి అర్పించారు.