చిన్నా... ఏవిరా నీ కాళ్లు

author img

By

Published : Nov 21, 2022, 10:44 AM IST

Child lost his two legs

Child seriously injured due to electric shock: దర్శిత్‌... ఎంత చలాకీ పిల్లాడో... ఇల్లంతా కలియతిరుగుతూ తెగ సందడి చేసేవాడు... పిలవగానే పరిగేత్తుకుంటూ వచ్చి అమ్మ పక్కనే కూర్చుని... చీర కొంగును రెండు చేతుల్లోకీ తీసుకుని ముఖంపై కప్పుకొని దాగుడుమూతలు ఆడేవాడు. ఎంతో మురిపెంగా అమ్మ పెట్టే గోరుముద్దలు తిని.. ఆమె ఒడిలో పడుకుని నిద్రపోయేవాడు. హాయిగా సాగుతున్న జీవితం... అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ చిన్నోడి రెండు కాళ్లూ పోయాయి.

Child seriously injured due to electric shock: అమ్మ చేసిన ముస్తాబులో అందమంతా తనదే అనేలా వెలిగిపోయేవాడు ఆ బుడ్డోడు. బుడిబుడి అడుగులు వేస్తుంటే... ఆ తల్లిదండ్రుల ఆనందం అంతాఇంతా కాదు. ముద్దుముద్దు మాటలు వింటూ మురిసిపోయేవారు. తమ కలలపంటను అల్లారుముద్దుగా పెంచి, ఉన్నత చదువులు చదివించాలనుకున్నారు. అంతలోనే కుమారుడికి కొండంత కష్టమొచ్చింది. చిన్నా... అని పిలవగానే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చే బుజ్జాయి ఇక నడవలేడని అమ్మానాన్నల గుండెలు పగిలిపోయాయి. బిడ్డతో పాటు తమ జీవితాలూ విద్యుదాఘాతం వల్ల తలకిందులయ్యాయంటూ ఆ దంపతులు రోదిస్తున్న తీరు హృదయాల్ని ద్రవింపజేస్తోంది... తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టకు చెందిన జొన్నకూటి వినోద్‌ లారీ డ్రైవర్‌. భార్య చాందిని గృహిణి. పెద్ద కుమారుడు అక్షిత్‌ యూకేజీ చదువుతున్నాడు. రెండోకుమారుడు దర్శిత్‌కు మూడేళ్లు. ఈనెల 12న భవనంపై దుస్తులు ఆరేయడానికి తల్లితోపాటు దర్శిత్‌ కూడా వెళ్లాడు. ఆమె పనిలో నిమగ్నమై ఉండగా ఆ చిన్నారి అక్కడున్న 33కేవీ విద్యుత్తు తీగల సమీపానికి వెళ్లి, విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు. అప్పటివరకు ఆడుకుంటున్న కుమారుడు పడిపోవడంతో చాందిని ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కాకినాడలోని జీజీహెచ్‌కు తీసుకెళ్లారు.

మోకాళ్ల వరకు తొలగింపు

నాలుగు రోజుల చికిత్స అనంతరం ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో బాలుడికి రెండు కాళ్లూ మోకాళ్ల కింది వరకు తొలగించారు. కొన్ని రోజులు పరిశీలనలో ఉండాలని, ఇన్‌ఫెక్షన్‌ తగ్గకపోతే మోకాళ్లనూ తొలగించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తమ కుమారుడికి వచ్చిన కష్టం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

చేతిలో చిల్లిగవ్వలేదు..

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం... కుమారుడి కోసం ఆసుపత్రి దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఉన్న కాస్త బంగారాన్నీ తాకట్టు పెట్టి రూ.35 వేలకు పైగా ఖర్చు చేశారు. రోజూ మందులకే రూ.10 వేలకు పైగా అవుతోందని, ముందుముందు ఇంకెంత ఖర్చు అవుతుందో తెలియదని వాపోతున్నారు. మెరుగైన వైద్యం కోసం వేరేచోటకు తరలిస్తే రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని, తమ దగ్గర అంత మొత్తం లేదని కన్నీటిపర్యంతం అవుతున్నారు. దాతలు ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నారు.

పదేళ్ల నుంచి పోరాటం చేసినా..

పదేళ్ల క్రితం ఆ ఇంటిస్థానంలో పూరిపాక ఉండేది. అప్పుడు వద్దని మొత్తుకున్నా విద్యుత్తుశాఖ అధికారులు పాక మీదుగా 33 కేవీ విద్యుత్తు లైన్లు వేశారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాటిని తొలగించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. మూడునెలల కిందట ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో సమస్యను హోంమంత్రి తానేటి వనితకు విన్నవించామని, అయినా పరిష్కారం కాలేదని బాధితులు వాపోయారు. అప్పుడే పట్టించుకుని ఉంటే ఇలా జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

వారం తర్వాత పరిశీలన.. ఘటన జరిగిన వారం తర్వాత విద్యుత్తు శాఖ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. 33 కేవీ లైన్లకు సంబంధించి విద్యుత్తు స్తంభాల ఎత్తు పెంచి ప్రమాద పరిస్థితిని లేకుండా చేస్తామని ఈఈ వీరభద్రరావు చెప్పారు. 33 కేవీ లైన్‌ పక్కనే 11 కేవీ లైన్‌ వెళ్తుండటంతో సాంకేతిక సమస్యలు ఉన్నాయని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. విద్యుత్తు తీగలు మార్చేందుకు రుసుం చెల్లించాలని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు. రోజు గడవడమే కష్టమైన తమకు, రుసుములు చెల్లించే ఆర్థిక స్తోమత లేదని బాధిత కుటుంబసభ్యులు వాపోతున్నారు. మరో నాలుగైదు భవనాలపై నుంచీ విద్యుత్తు తీగలు వెళ్తున్నాయని, ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.