TTD Jumbo Board: తితిదే జంబో పాలక మండలి..వెల్లువెత్తుతున్న విమర్శలు

author img

By

Published : Sep 18, 2021, 7:56 PM IST

TTD Jumbo Board

గతంలో కంటే భిన్నంగా తితిదే జంబో పాలక మండలిని నియమించింది. ఈ బోర్డు ఏర్పాటుపై అన్ని వర్గాల వారి నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సుదీర్ఘ చరిత్ర, ఘనమైన పేరు ప్రఖ్యాతులు కలిగిన తితిదేలో ఇలాంటి నిర్ణయాలపై సర్వత్రా దుమారం చెలరేగుతోంది. కేంద్ర కేబినెట్‌ను మించిన రీతిలో పాలకమండలి ఉండటంపై వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి.జంబో పాలక మండలి నియామకాన్ని ధార్మిక సంస్థలు తప్పుపడుతున్నాయి.

కలియుగ వైకుంఠంగా పేరొందింది తిరుమల పుణ్యక్షేత్రం. ఘనమైన పేరుప్రఖ్యాతులు, చరిత్ర కలిగింది తిరుమల తిరుపతి దేవస్థానం. అలాంటి పవిత్ర క్షేత్రంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పాలకమండలిపై సర్వత్రా దుమారం చెలరేగుతోంది. 29 మంది పాలకమండలి సభ్యులు, మరో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులతో కలిసి 81 మందిని ఈ బోర్డులో నియమించారు. ఇంత ఎక్కువ సంఖ్యలో బోర్డు సభ్యులను నియమించడం ఇదే ప్రథమం. గతంలో 40 మందికి మించి పాలకమండలిలో సభ్యులు ఉండేవారు కాదు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో సభ్యుల సంఖ్యే 78.. కానీ తితిదే పాలకమండలి సంఖ్య 81 మంది అంటూ వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్‌ను మించిన రీతిలో పాలకమండలి ఉండడాన్ని ధార్మిక సంస్థలు తప్పుపడుతున్నాయి.

ఏంటీ జంబో పాలక మండలి...ఎవరెవరున్నారు..

తితిదే పాలకమండలి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడు జీవోలు జారీ చేసింది. ఛైర్మన్‌గా రెండోసారి వైవీ సుబ్బారెడ్డిని ఇప్పటికే నియమించారు. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నలుగురు అధికారులతో పాటు 24 మందిని సభ్యులుగా నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌కు అవకాశం కల్పించారు. వీరికి బోర్డులో ఓటింగ్‌ హక్కు లేనప్పటికీ, సభ్యుల్లాగే ప్రొటోకాల్‌ ఉంటుందని పేర్కొన్నారు. వీరికితోడు గతంలో ఎప్పుడూ లేనంతగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. వీరిలో ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ధార్మిక సంస్థల సభ్యులు తదితరులు ఉన్నారు. చైర్మన్‌ సహా సభ్యుల పదవీ కాలం దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్‌ 99ను అనుసరించి ఉంటుందని పేర్కొన్నారు. తితిదే పాలక మండలి సభ్యుల పదవీ కాలం కొనసాగినంత కాలం ఆలయ ప్రత్యేక ఆహ్వానితుల పదవీ ఉంటుందని.. పాలక మండలి సభ్యులకు వర్తించే ప్రొటోకాల్‌ వీరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. పాలకమండలిలో పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధుల బంధువులు, రాజకీయ సిఫార్సులతో అవకాశం దక్కించుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అధికార వైకాపా బాధ్యతలు చూస్తున్న వారితోపాటు కొందరు నేర అభియోగాలున్న వారికీ ఈ జంబో పాలకమండలిలో చోటు దక్కిందనే ప్రచారం లేకపోలేదు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల వారిని సభ్యులుగా, ఆహ్వానితులుగా నియమించారు. పాలక మండలి సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 10 మంది, తెలంగాణ నుంచి ఏడుగురు, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర నుంచి ఇద్దరేసి, గుజరాత్‌, పశ్చిమబంగాల్‌, పుదుచ్చేరి నుంచి ఒక్కకొక్కరికి అవకాశం దక్కింది. పాలకమండలి కూర్పు, భారీగా ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై ధార్మిక వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో వారికి మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ఎక్కువమందికి అవకాశం కల్పించడం సబబేనని ప్రత్యేక ఆహ్వానితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నియామకాలు అపహాస్యపు విధానాలుగా కనిపిస్తున్నాయని...దీనివల్ల తితిదే వ్యవస్థ హాస్యాస్పదం అవుతుందని విశ్రాంత ఈవోలు పెదవి విరుస్తున్నారు. సభ్యుల సంఖ్య పెరిగితే ఆ భారం తితిదేపైనే పడుతుందని ధార్మిక సంస్థ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ వ్యవస్థల జోక్యం నుంచి ధార్మిక సంస్థలు పూర్తిగా బయటకు రావాలని స్వామి కమలానంద భారతి ఆకాంక్షిస్తున్నారు. తిరుమల ప్రతిష్ట, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆరోపిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

తితిదే జంబో పాలక మండలి..వెల్లువెత్తుతున్న విమర్శలు

పదవుల పందేరానికి వేదికకాదు

పదవుల పందేరానికి తితిదే వేదిక కాదని భాజపా పెదవి విరిచింది. తితిదే పరిధిలో పాలకమండలి సభ్యుల సంఖ్యను ఎన్నడూ లేనివిధంగా పెంచడాన్ని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఆక్షేపించారు.

" ఛైర్మన్‌తో సహా 25 మంది సభ్యులుంటే వారికి అదనంగా మరో యాభై మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? ఈ ప్రత్యేక ఆహ్వానితులు భక్తులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా తమ అధికార, రాజకీయాలకు, పదవుల పందేరాలకు వేదికగా ఈ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి. చట్టానికి, నిబంధనలకు లోబడి నియమించే పాలకమండలి సరిపోతుంది. పుణ్యక్షేత్రంగా, తిరుమల విశిష్టత గుర్తించి అలాంటి ఆలోచనలు మానుకోవాలి" - జీవీఎల్‌ నరసింహారావు, భాజపా రాజ్యసభ సభ్యుడు.

సీఎం జగన్‌కు.. చంద్రబాబు లేఖ..ఏమన్నారంటే..?

తిరుమల తిరుపతి పాలకమండలి ఏర్పాటుపై సీఎం జగన్​కు చంద్రబాబు లేఖ రాశారు. పుణ్య క్షేత్రం ఆధ్యాత్మిక చింతనకు, సనాతన హైందవ ధర్మానికి ప్రతీక. అలాంటి పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార సంస్థగా మార్చడం అత్యంత బాధాకరం. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థగా పేరుగాంచిన తితిదేని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదు. భక్తి భావం, సేవా స్ఫూర్తి కలిగిన వారితో ఏర్పాటవ్వాల్సిన తితిదే బోర్డులో పారిశ్రామికవేత్తలు, అవినీతిపరులు, నేరస్తులు, కళంకితులకు చోటు కల్పించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన తితిదేకి ముందెన్నడూ లేని విధంగా 81 మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయడం గర్హణీయం. గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో ఇంతమందితో జంబో బోర్డు ఏర్పాటు చేయలేదు. ఈ జంబో బోర్డు ఏర్పాటులో స్వార్థ ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతమంది వ్యక్తుల సేవలో మునిగి తేలే వారికే అవకాశం ఇచ్చారన్నది సుస్పష్టం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తిరుమల ప్రాశస్త్యాన్ని, పవిత్రతను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ, వ్యాపార ప్రయోజనాలతో జంబో బోర్డు ఏర్పాటు చేశారు.

సామాన్య భక్తులకు నిబంధనలు విధించి.. వీఐపీల సేవలో తరించే విధానాన్ని ప్రస్తుతం చూస్తున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం సాంప్రదాయాలను గాలికొదిలేసి తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారు. ధర్మకర్తల మండలిలో సభ్యత్వమంటే భక్తి భావానికి ప్రతీక. గతంలో సభ్యత్వం కల్పించాలనుకుంటే.. వారి వ్యక్తిగత గుణ గణాలను పరిశీలించి బోర్డులో సభ్యత్వం కల్పించేవారు. కానీ నేడు స్వప్రయోజనాల కోసం.. రాజకీయ నిరుద్యోగులకు ధర్మకర్తల బోర్డును కేంద్రంగా మార్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను సభ్యులుగా నియమించి బోర్డు పవిత్రతను దెబ్బతీశారు. గత రెండున్నరేళ్లుగా తిరుమల పవిత్రత, ప్రాశస్త్యం దెబ్బతింటున్నది. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ టీటీడీ ఆస్తుల వేలానికి పూనుకున్నారు. తిరుపతి-తిరుమల బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేశారు. టీటీడీ వెబ్‌సైట్‌లో అన్యమత గేయాలు, స్విమ్స్‌ ఆసుపత్రిలో అన్యమత ప్రచారం, ఎస్వీబీసీ ఛైర్మన్‌ రాసలీలలు, భక్తుల తలనీలాల స్మగ్లింగ్‌, టీటీడీ మాసపత్రికలో రామాయణాన్ని వక్రీకరించడం, లడ్డూ ప్రసాద ధరలు పెంచడం, భక్తి శ్రద్దలతో స్వీకరించే శ్రీవారి ప్రసాదాన్ని ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేయడం వంటి అనేక అనైతిక చర్యలు చోటు చేసుకున్నాయి. శ్రీ వేంకటేశ్వరుడి తిరునామాలకు తప్ప.. మరో చిహ్నానికి తావులేని తిరుగిరుల్లో డివైడర్లకు వైసీపీ రంగులు వేశారు, కొండపై వైసీపీ నేతలు రాజకీయ ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్లు ఎగరేశారు. ర్యాలీలు నిర్వహించారు.

ధర్మకర్తల మండలి ఏర్పాటులో భక్తుల మనోభావాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిందిపోయి మనోభావాలను కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు. దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఆచార సాంప్రదాయాలతో పాటు, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. భక్తుల మనోభావాలకు భిన్నంగా ఏర్పాటు చేసిన జంబో బోర్డును తక్షణమే రద్దు చేయాలి. తిరుమల ప్రతిష్టను కాపాడాలి. తితిదే సాంప్రదాయాలను పాటిస్తూ నూతన ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలి. కలియుగ దైవమైన శ్రీనివాసుని ప్రతిష్టను దెబ్బతీస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

జంబో పాలక మండలి హాస్యాస్పదం..

"తితిదేలో తొలి నుంచి చట్టం, నిబంధనలు అనుసరించే విధానం ఉండేది. బోర్డు అనేది మొత్తం వ్యవస్థను సక్రమంగా నడపడం కోసం. భారీ సంఖ్యలో పాలకమండలి కూర్పు అపహాస్యపు విధానం ఉంది. హైందవ సంస్థల విషయంలో అడిగే వారు లేరు మాకిష్టం వచ్చినట్లు చేస్తామనేలా ఉంది. తప్పకుండా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు వారు చేసుకునే దర్శనాల కోసం తితిదే యంత్రాగంపై ఒత్తిడి పెంచడమే అవుతుంది. గతంలో ప్రత్యేక ఆహ్వానితుల వ్యవస్థ అనేది లేదు. ఇప్పుడు ఈ పేరిట ఒక అపహాస్యపు ప్రక్రియ మొదలైంది. ఈవో, జేఈఓలు పరిపాలన చూస్తారా? సభ్యుల సౌకర్యాలు చూసుకుంటారా? పాలకమండలి తప్ప ప్రత్యేక ఆహ్వానితులు అనేకది చట్టంలో లేదు. ఈ మధ్య చట్టానికి సవరణ చేసి ఆ వెసులుబాటు పొంది ఉంటే నాకు తెలియదు. ఇందరు సభ్యులను నియమించాల్సిన అవసరం ఏమిటి? పాలించే మండలా? పునరావాస మండలా? అనేది ఆలోచించాలి. నిజంగా పరిపాలన కోసం అయితే పది మంది సభ్యులు చాలు. పాలకమండలిలో రాజకీయంగా నియామకాలు జరుగుతున్నా.. దానికి ఓ పరిమితం ఉండేది. ఇప్పుడు పరిధి దాటి పెద్ద ప్రహసనంలా చేయడం ఏమిటి? ప్రత్యేక ఆహ్వానితులు అంటే ఏ నిర్ణయం తీసుకోవడంలోను భాగస్వామ్యం ఉండదు. పారదర్శకతకు వారు ఎలా తోడ్పడుతారు? ఇది సమర్దించడానికి వీల్లేని అపహాస్యపు చర్య తప్ప అంతకు మించి ఏమీలేదు. పారదర్శకత అనేది నిర్ణయాల నుంచి వస్తుంది. నిర్ణయాల్లో ప్రత్యేక ఆహ్వానితులకు భాగస్వామ్యంలేదు. ఓటింగ్‌ హక్కు లేదు. సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి పాత్ర లేదు. ఇటువంటివి తుగ్లక్‌ చర్యలు. ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు తప్పకుండా హిందు ధర్మ సంస్థలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధి నుంచి పక్కకు తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను." - ఐవైఆర్‌ కృష్ణారావు, తితిదే మాజీ ఈవోరాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి

రాజకీయ పెత్తనం తగదు..

"దేవాలయంలో రాజకీయ ప్రమేయం తగదు. ఎక్కువమందితో ధర్మకర్తల మండలి నియమించాల్సిన అవసరం లేదు. దీనివల్ల అక్కడి వ్యవస్థపై భారం, ఒత్తిడి, ఖర్చులు పెరుగుతాయి. తితిదే నిర్మించిన కల్యాణ మండపాలు నిర్వహించలేక వాటిని ప్రైవేటు లీజుకు ఇవ్వాలని చూస్తోంది. దేశంలో కొత్తగా కల్యాణ మండపాలు, దేవాలయాలు నిర్మించేందుకు ఈ సభ్యులు, ఆహ్వానితులు తీర్మానాలు చేయించి ఇక్కడి నిధులు అక్కడ ఖర్చు చేయిస్తారు. ఇప్పటికే కన్యాకుమారి, చెన్నై, మధురై, బెంగళూరు, ముంబాయి, దిల్లీలో తితిదే కమిటీలున్నాయి. వీటికి ఏటా లక్షల రూపాయలు పరిపాలన కోసం ఖర్చు చేస్తున్నారు. నిజంగా పరిపాలనలో పారదర్శకత తీసుకురాలంటే పది మంది చాలు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్ల జనాభాకు ఒక్కరే ప్రధాని. ఇప్పుడు 130 కోట్ల జనాభాకు ప్రధాని ఒక్కరే. తితిదే లెక్కన నలుగురు ప్రధానులు ఉండాలి. వెంకటేశ్వరస్వామిని చూసి తప్ప ధర్మకర్తల మండలిలో సభ్యులు ఎవరనేది చూసి భక్తులు కానుకలు ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వ చర్య వల్ల వ్యవస్థ బలహీనతమవుతుంది. ఇతర రాష్ట్రాల వారిని సభ్యులుగా తీసుకొచ్చి దీనికి అఖిలభారత స్వరూపం ఇచ్చిన తర్వాత తితిదేని కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావాలనే ఆందోళనకు ఆస్కారం ఉంటుంది. కానీ అలా చేయడం సరికాదు. ఒక రాష్ట్రంలో ఉన్న క్షేత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిర్వహించాలి. దేవాలయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ నుంచి బయటకు రావాలి. దీనిపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉంది" - స్వామి కమలానంద భారతి,హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు

పరిపాలనలో పారదర్శత కోసమే...!

"1932లో తితిదే ట్రస్టు బోర్డు ఏర్పాటైనప్పుడు ఏడుగురు సభ్యులు. అప్పటికి ఇప్పటికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నాటి సౌకర్యాలతో పోలిస్తే నేడు గణనీయమైన మార్పులు జరిగాయి. ఇంకా అనేక సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. తిరుమల క్షేత్రానికి వచ్చే యాత్రికులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత పాలకమండలిపై ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ తితిదే ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ పనులు సజావుగా జరగాలన్నా, అధికారులపై పని భారం తగ్గాలన్న పాలకమండలి సభ్యుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. స్వామి వారి సామ్రాజ్యం విశ్వమంతా వ్యాపిస్తున్న సమయంలో ఆస్తుల పరిరక్షణ, పర్యవేక్షణ, నిఘా కోసం పాలకమండలి సంఖ్య పెంచడం సబబే. ప్రస్తుతం ఒక్కో సభ్యుడు రెండు మూడు విభాగాలు చూడాల్సి వస్తోంది. ఐదు నుంచి పది మంది సభ్యులు ప్రతి ట్రస్టును పర్యవేక్షించేలా వారికి బాధ్యతలు అప్పగించడం వల్ల మరింత బలోపేతానికి వీలుంది. ప్రత్యేక ఆహ్వానితులకు అదనపు సౌకర్యాలు ఉండవు. పాలక మండలి సభ్యులు, ఆహ్వానితులు పొందే సౌకర్యాలకు రుసుము చెల్లించాల్సిందే తప్ప ఉచితం కాదు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనేదే ప్రస్తుత పాలకమండలి ఆలోచన. గతంలో ఇక్కడి పరిస్థితులు ఇష్టారాజ్యంగా ఉండేవి. వాటికి సంస్కరణ అవసరం. నిరుపయోగ కల్యాణ మండపాలను గోశాలుగా మార్చాలనే ఆలోచన చేస్తున్నాం. సూక్ష్మస్థాయిలో పర్యవేక్షణ జరగాలంటే పాలకమండలిలో ఎక్కువ మంది అవసరం ఉంది." - కొలిశెట్టి శివకుమార్‌, ప్రత్యేక ఆహ్వానితులు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.