3 Reservoirs Expatriates: పరిహారం లేదు.. అడిగితే బెదిరింపులు.. ఇది చిత్తూరు జిల్లాలోని నిర్వాసితుల గోడు

author img

By

Published : May 18, 2023, 9:09 AM IST

3 Reservoirs Expatriates

3 Reservoirs Expatriates: చట్టాలు, కోర్టుల్ని లెక్కచేయకుండా.. 3 రిజర్వాయర్ల పనులు చేయించడంలో ఉన్న శ్రద్ధ.. నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో లేకపోయింది. రిజర్వాయర్లు పూర్తైతే.. దాదాపు 11 గ్రామాలతో పాటు 3,500 ఎకరాలు ముంపునకు గురవుతాయని అంచనాలున్నాయి. కానీ పరిహారం ఊసేలేదు. పరిహారం అడిగితే పోలీసులతో బెదిరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అదే పుంగనూరు నియోజకవర్గం..

చిత్తూరు జిల్లాలోని రిజర్వాయర్ల నిర్వాసితుల గోడు

3 Reservoirs Expatriates: ఎక్కడైనా జలవనరుల ప్రాజెక్టులు చేపట్టాలనుకుంటే ముందుగా.. ఎన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయి? ఎన్ని ఇళ్లున్నాయి? ఎన్ని ఎకరాల భూముల్ని రైతులు కోల్పోతారు? ఇళ్లు, ఇతర నిర్మాణాలు,.. బోర్లు, చెట్లు ఎన్ని పోతాయి? ఇలాంటి వివరాలన్నీ రెవెన్యూ యంత్రాంగం సేకరించాలి. సహాయ, పునరావాస కార్యక్రమాలు అమలు చేసి.. ప్రాజెక్టులు పనులు ప్రారంభించాలి. కానీ ఆవులపల్లి, నేతిగుట్లపల్లె, ముదివేడు జలాశయాల ప్రాజెక్టుల్ని.. ఇందుకు పూర్తి భిన్నంగా చేస్తున్నారు.

13ఏళ్ల క్రితం పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా ఉండగానే,.. అప్పటి పీలేరు నియోజకవర్గ పరిధిలోని చల్లంపల్లె ప్రాజెక్టును బాధితులకు పరిహారం ఇవ్వకుండా పూర్తి చేశారు. ఇప్పుడు ఈ 3 రిజర్వాయర్ల నిర్వాసితుల్నీ అదే భయం వెంటాడుతోంది. ఇంతవరకూ ఒక్క రూపాయీ పరిహారం ఇవ్వలేదు. ఎంత పరిహారం వస్తుందో కూడా.. వారికి చెప్పలేదు. ఇళ్లకు మార్కింగ్‌ చేశారు.

ఆ మూడు రిజర్వాయర్ల నిర్మాణంతో సోమల మండలం ఆవులపల్లి పంచాయతీ పరిధిలోని.. రామకృష్ణాపురం, బయ్యారెడ్డిపల్లి, చిన్నదేవళకుప్పం, పెద్దదేవళకుప్పం, ఎస్టీ కాలనీ,.. పుంగనూరు మండలంలోని ఏటిగడ్డ కమ్మపల్లె, అరంట్లపల్లె,.. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలంలోని శీతివారిపల్లె, కొత్తపల్లి, బి.కొత్తకోట మండలం చవటకుంటపల్లె, దిన్నెమీదపల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.

"ముదివేడు రిజర్వాయర్​ దగ్గరలోనే హంద్రీనీవా కాలువ ఉంది.200 కోట్ల రూపాయల ఖర్చు పెడితే చిన్న కాలువలు నిర్మించవచ్చు. వాటి ద్వారా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రతి ఊరిలోని చెరువును నింపవచ్చు. అలా చేస్తే ప్రాజెక్టే అవసరం లేదు. ఎలాగూ పనులు చేస్తున్నారు కాబట్టి సరైన సమయంలో పరిహారమైనా ఇస్తే ప్రయోజనం ఉంటుంది"-రాజశేఖర్​రెడ్డి, శీతివారిపల్లె, కురబలకోట. అన్నమయ్య జిల్లా

ఇందులో దాదాపు.. 3వేల500 ఎకరాలు ముంపునకు గురవుతాయని అంచనా వేస్తున్నారు. ముదివేడు రిజర్వాయర్‌ పనుల కారణంగా,.. ఇప్పటికే శీతివారిపల్లె గ్రామానికి దారి లేకుండా పోయింది. వారు ప్రాజెక్టు కట్ట మీద నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. నేతిగుట్లపల్లె.. జలాశయ నిర్మాణం మూలంగా..గతేడాది డిసెంబరులో ఏటిగడ్డ కమ్మపల్లె గ్రామం జలదిగ్బంధమైంది. నిర్మాణ సంస్థ పనుల చేస్తున్న సందర్భంలో తూమును మూసేయడంతో నీరు ముంచెత్తింది.

గ్రామంలోని 16 ఇళ్లలోని ప్రజలు ట్రాక్టర్‌ వేసుకుని బయటకు వచ్చారు. పంటలు నీట మునగడంతో రైతులు లబోదిబోమన్నారు. మునిగిన పంటల.. వివరాలు నమోదు చేసుకున్న అధికారులు.. ఇంత వరూ ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు. ఏటిగడ్డకమ్మపల్లెలో.. ప్రస్తుతం నివసిస్తున్న 16 కుటుంబాలవారు 1971లో మదనపల్లె మండలం నందిరెడ్డిపల్లె నుంచి వలస వచ్చారు. ఇక్కడ పొలాలు కొనుక్కుని,.. ఇళ్లు కట్టుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. నేతిగుట్లపల్లె జలాశయం నిర్మాణంతో.. వారంతా మరోసారి వలస పోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

3జలాశయాల నిర్వాసితుల్లో ఎవర్ని కదిలించినా కన్నీరుమున్నీరవుతున్నారు.! పరిహారం కోసం గట్టిగాఅడగాలన్నా హడలిపోతున్నారు. ‘పెద్దాయన’కు కోపం వస్తే.. తమ బతుకులు ఏమైపోతాయోనని భయపడుతున్నారు. రెవెన్యూ అధికారుల్ని అడిగితే... రేపు, మాపు అంటున్నారే తప్ప కచ్చితమైన హామీ ఇవ్వడం లేదు. నేతిగుట్లపల్లె రిజర్వాయర్‌ కింద ఇళ్లు, భూములు కోల్పోతున్న వారికి ఎంత పరిహారం ఇవ్వాలనే విషయమై సర్వే పూర్తి చేశామని, ఆవులపల్లి జలాశయానికి సంబంధించి ఇంకా సర్వే జరుగుతోందని రెవెన్యూ అధికారులు.. చెప్తున్నారు. నిర్వాసితులకు పునరావాసం, మెరుగైన పరిహారం చెల్లించి నష్టం జరగకుండా చూస్తామని.. భరోసా ఇస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.