ప్యాసింజర్​ రైలుకు ఇమాంపురం గ్రామస్థుల పూజలు.. ఎందుకంటే..!

author img

By

Published : Sep 9, 2022, 5:47 PM IST

train stopped in the imamapuram

Train stopped at Imampuram: ఆ ఊరికి బస్సు సౌకర్యం లేదు... పని కోసమైనా, చదువుకోసమైనా సరే.. వెళ్తే ఆటోలో లేదా రైలులో వెళ్లాలి. దాని కోసం ఐదు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి సొంతంగా స్టేషన్‌ నిర్మించుకున్నారు. రైలు ఆగింది. ఇంతలో కరోనా వచ్చింది. ఆ సౌకర్యమూ నిలిచిపోయింది. మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. సమస్యను ఈటీవీ-భారత్​ దృష్టికి తీసుకొచ్చారు గ్రామస్థులు. ఈ విషయంపై "ఈటీవీ-ఈటీవీ భారత్​" కథనం ప్రచురించింది. ఫలితంగా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి.. మళ్లీ ఆ గ్రామంలో రైలు ఆగేలా చర్యలు తీసుకున్నారు.

Train Stopped in Imampuram After Three Years: పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఇమాంపురం గ్రామస్థులు నిరూపించారు. ఎలాంటి రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామమైన ఇమాంపురం మీదుగా రోజూ అనేక రైళ్లు తిరుగుతున్నా.. ఊర్లో ఆగేవి కాదు. చాలాసార్లు అభ్యర్థనలు ఇచ్చినా అధికారులు స్పందించలేదు. చివరకు సొంత ఖర్చుతో రైల్వే స్టేషన్ నిర్మించుకుంటే రైలు నిలుపుతామని అధికారులు గ్రామస్థులకు చెప్పారు. ఊరంతా చందాలేసుకొని 2017లో ఇమాంపురంలో రైల్వే స్టేషన్ నిర్మించుకున్నారు. అధికారులు రెండేళ్ల పాటు స్టేషన్‌లో రైళ్లు నిలిపారు.

కరోనా లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా రైళ్లను రద్దుచేసిన సమయంలో ఇమాంపురం మీదుగా వెళ్లే రైళ్లు కూడా రద్దయ్యాయి. కరోనా తర్వాత అన్నిచోట్ల రైళ్లను పునరుద్ధరించినా ఇమాంపురంలో మాత్రం హాల్ట్‌ ఇవ్వలేదు. దీంతో గ్రామస్థులు దాదాపు మూడేళ్లుగా రైలు హాల్ట్‌ కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇమాంపురం గ్రామ ప్రజల సమస్యపై జులైలో.. ఈటీవీ, ఈటీవీ భారత్​లో కథనం వచ్చింది. ఈ సమస్యను ఎంపీ తలారి రంగయ్య, రైల్వే డీఆర్ఎంల దృష్టికి తీసుకెళ్లగా.. వారు స్పందించారు. గ్రామస్తుల కోరిక నెరవేరింది.

ఉదయం తిరుపతి నుంచి గుంతకల్లుకు వెళ్లే రైలుతోపాటు, గుంతకల్లు నుంచి తిరుపతికి వెళ్లే ప్యాసింజర్ రైలు తొలిసారిగా ఇమాంపురం గ్రామంలో ఆగాయి. గ్రామస్థులు కొబ్బరి మట్టలు, మామిడాకులు కట్టి పూజలు నిర్వహించి.. ప్రయాణాన్ని ప్రారంభించారు. "ఈటీవీ- ఈటీవీ భారత్​" చొరవతోనే తమ గ్రామంలో నేటి నుంచి రైలు నిలిచిందని రైలు ప్రయాణంలో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైలు లేనంతకాలం అనంతపురం పట్టణానికి వెళ్లడానికి వచ్చే కూలిలో సగానికి పైగా ఖర్చు చేయాల్సి వచ్చేదని భవన నిర్మాణ కూలీలు చెబుతున్నారు. కిలోమీటర్ల దూరం ఉన్న పాఠశాలకు నడిచి వెళ్లే వాళ్లమని పిల్లలు తెలిపారు. ఈటీవీ, సమస్య పరిష్కారానికి కృషిచేసిన ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

మూడేళ్ల నిరీక్షణ తర్వాత.. నెరవేరిన గ్రామస్థుల కల

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.