నిధులు లేక నిలిచిన రెసిడెన్షియల్ పాఠశాల పనులు.. మరోసారి భూమిపూజ

author img

By

Published : Mar 11, 2023, 8:33 AM IST

Minority Hostel Works

Minority Hostel Works: ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటాలపై ఉన్న శ్రద్ధ పనులపై లేకపోవడం.. మైనార్టీ పేద విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. నిర్మాణ పనులు ప్రారంభమైన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల భవనానికి.. మరోసారి భూమి పూజ చేసినా నిధులు విడుదల చేయకపోవటంతో.. ఎక్కడ పనులు అక్కడే నిలిచి ప్రభుత్వ అసమర్థతను వెక్కిరిస్తున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లులో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులు నిలిచిపోయిన వైనంపై కథనం.

నిధులు లేక నిలిచిన రెసిడెన్షియల్ పాఠశాల పనులు.. మరోసారి భూమిపూజ

Minority Hostel Works: అనంతపురం జిల్లాలో గుంతకల్లు పట్టణం విసిరి పడేసినట్లుగా కర్నూలు జిల్లా సరిహద్దులో ఉంటుంది. తీవ్ర వర్షాభావంతో కరవు ప్రాంతంగా గుర్తించిన గుంతకల్లు నియోజకవర్గంలో అక్షరాస్యత తక్కువగా ఉండటమే కాకుండా, ఉపాధి కోసం వేలాది మంది బెంగుళూరు, ముంబై లకు వెళుతుంటారు. ఇంతటి దుర్భిక్ష ప్రాంతంలో ప్రధాన పట్టణంగా ఉన్న గుంతకల్లులో మైనార్టీల సంఖ్య అధికంగా ఉంటుంది. మైనార్టీల్లో అక్షరాస్యత పెంచటానికి టీడీపీ ప్రభుత్వం ఆ వర్గాల పేద పిల్లలు చదువుకోటానికి అవకాశం కల్పించాలని భావించింది. గుంతకల్లులోని కసాపురం రహదారిలో మైనార్టీ రెసిడెన్షిల్ పాఠశాల ఏర్పాటుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూసేకరణ చేసి 18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గుత్తేదారుకు పనులు అప్పగించింది.

ఈలోపే ఎన్నికలు రావటం, వైఎస్సార్​సీపీ ప్రభుత్వం కొలువుదీరటంతో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినపుడు, గతంలో భూమి పూజ చేసిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, జగన్ మరోసారి రిమోట్​తో భూమి పూజ చేశారు. ఆగిన పనులకు ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ చేశారు కాబట్టి, వేగవంతంగా పాఠశాల నిర్మాణం పూర్తై పేద ముస్లిం మైనార్టీ విద్యార్థులకు చదువుకునే అవకాశం వస్తుందని అందరూ భావించారు. రిమోట్ భూమి పూజ చేశారు కాని నిధులు విడుదల చేయకపోవటంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు సకాలంలో వస్తాయని వేగంగా పనులు నిర్వహించిన గుత్తేదారుకు విడతలవారీగా రావల్సిన బిల్లలు కూడా మంజూరు కాలేదు.

దీంతో ప్రభుత్వంపై అనుమానం వచ్చిన గుత్తేదారు.. తాను చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కోటి 75 లక్షల రూపాయలు బిల్లులు గుత్తేదారుకు చెల్లించింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నిలిచిపోయిన నిర్మాణ పనులు రిమోట్ భూమిపూజ చేశాక కూడా ఒక్క ఇటుక పెట్టలేకపోయారు. విశాలమైన వసతి గృహం రెండు అంతస్తుల వరకు పైకప్పు నిర్మాణం పూర్తైంది. పాఠశాల కూడా అదేస్థాయిలో పైకప్పు పూర్తైంది. గోడలు, ఫ్లోరింగ్ తదితర పనులు చేయకుండా గుత్తేదారుడు వెళ్లిపోయాడు. కొద్దిరోజులు అక్కడ కాపలాదారుడిని ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు, వేతనం ఇవ్వక పోవటంతో వాచ్ మెన్ కూడా మరో పని వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. దీంతో అసంపూర్తి నిర్మాణ భవనం ప్రస్తుతం అసాంఘీక శక్తులకు, మందుబాబులకు అడ్డాగా మారింది.

రోజూ చీకటి పడిందంటే భవనంలో మద్యం తాగేవారు గుంపులుగా వచ్చి చేరుతున్నారు. ఈ పాఠశాల, వసతి గృహం నిర్మాణం నిలిచిపోవటంతో మైనార్టీ వర్గాల్లోని పేద బాలికలకు చదువుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ భవనం నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని గుంతకల్లు మైనార్టీ నాయకులు పలుసార్లు ప్రభుత్వానికి విన్నపాలు చేసినా, అధికారులు, పాలకుల నుంచి స్పందన రాలేదు. పేద మైనార్టీల సంక్షేమంటే ఇదేనా అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీలకు చాలా చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం పూర్తి చేయటానికి నిధులు విడుదల చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ముస్లిం మైనార్టీ నేతలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.