Illegal lands of Minister Ushasree Charan: అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో పలువురు టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్.. కళ్యాణ దుర్గం నియోజకవర్గం రాప్తాడు మండలంలో అక్రమంగా భూములు సేకరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. అనంతరం భూములను ఆక్రమించిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. దీంతో కళ్యాణదుర్గం పట్టణం టీడీపీ ఇంచార్జ్ ఉమా మహేశ్వర నాయుడు ఇంటి వద్ద పోలీసులను మొహరించారు. ఎర్రంపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చౌదరి ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో.. ఇద్దరు పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఇంటి దగ్గరకు వచ్చిన తరువాత పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నారు. నియోజకవర్గంలోని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మండల కన్వీనర్లు, మాజీ టీడీపీ ప్రజాప్రతినిధులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
అనంతపురం టీడీపీ కార్యాలయంలో.. కల్యాణదుర్గం టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. మంత్రి ఉష శ్రీచరణ్ భూ అక్రమాల పరిశీలనకు సిద్ధమైన టీడీపీ నేతలను ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తూంపల్లి వద్ద సుజలాం పవన్ విద్యుత్ పార్కు ఏర్పాటు చేసే 120 ఎకరాల భూములను ఆ సంస్థ నుంచి మంత్రి ఉషశ్రీచరణ్ కొనుగోలు చేశారు. దీనిపై మీడియాలో పెద్దఎత్తున కథనాలు రావటంతో టీడీపీ నేతలు వారం రోజులుగా మంత్రి అక్రమాలపై విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రైతుల భూముల్లో మంత్రి ఉషశ్రీచరణ్ రిసార్టు నిర్మిస్తున్న వైనంతోపాటు, వేల టిప్పర్ల మట్టి, ఇసుకను అక్రమంగా రిసార్టుకు తరలిస్తున్న తీరుపై క్షేత్రస్థాయి పరిశీలనకు టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాల్లోనే టీడీపీ నేతలు మంత్రి రిసార్టు ప్రాంత భూముల పరిశీలనకు వెళ్లేందుకు సిద్ధం కావటంతో అన్నిచోట్ల నేతలను గృహనిర్బంధం చేశారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద తూంపల్లి వెళ్లేందుకు బయలుదేరిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీపీ కళ్యాణదుర్గం ఇన్ ఛార్జి ఉమమహేశ్వరనాయుడును నాల్గోపట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీపీ నేత మారితి చౌదరిని కళ్యాణదుర్గం మండంలో అదుపులోకి తీసుకొన్న పోలీసులు గంట సేపటి నుంచి వాహనంలోనే పలుచోట్ల తిప్పుతున్నారు. అవినీతి మంత్రి ఉషశ్రీచరణ్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: