తెలంగాణలో క్యాసినో కలకలం.. ఈడీ ఎదుట వైకాపా మాజీ ఎమ్మెల్యే హాజరు

author img

By

Published : Nov 17, 2022, 2:43 PM IST

ED Investigating the YSRCP EX MLA

నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లో నమోదైన క్యాసినో కేసు మరోసారి కలకలం రేపుతోంది. తెలంగాణ నేతలతో పాటు అనంతపురం వైఎస్సార్​సీపీ నేతకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్​ పార్టీ నేత గుర్నాథ్‌రెడ్డి హైదరాబాద్‌ ఈడీ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరయ్యారు.

ED Investigating the YSRCP EX MLA : తెలంగాణలో మరోసారి క్యాసినో వ్యవహారం కలకలం రేపుతోంది. నిన్న తెలంగాణ మంత్రి తలసాని సోదరులను విచారించిన ఈడీ.. తాజాగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్​రెడ్డిని విచారించారు. చీకోటి ప్రవీణ్‌తో ఉన్న సంబంధాలు.. ఫెమా నిబంధనల ఉల్లంఘన.. మనీ లాండరింగ్ అంశాలపై ఆయనను బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు ధర్మేంద్రయాదవ్‌, మహేష్ యాదవ్‌లను అధికారులు దాదాపు 10 గంటలపాటు ప్రశ్నించారు. మరో వైపు టీఆర్​ఎస్​ పార్టీకి చెందిన ఎల్. రమణ కూడా ఈడీ విచారణకు హాజరుకావాలంటూ తాఖీదులు జారీ చేసింది. రమణ రేపు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో మరికొంతమందికి ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ జరిగింది: జూదం ఆడేందుకు విదేశాలకు వెళ్తున్నామని చెప్పి...భారీగా నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ఈడీ.. కొందరు టూర్‌ అపరేటర్లపై ఐదునెలల క్రితం కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని 8 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈజనవరిలో సంక్రాంతి పండుగకి ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో క్యాసినో నిర్వహించడం తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

తెలుగు రాష్ట్రాల నుంచి జూదం ఆడేవారిని ప్రత్యేక ప్యాకేజీల ద్వారా విదేశాలకు తరలించి నిధుల మళ్లింపు పాల్పడుతున్నారనే అనుమానంతో హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి తదితరుల ఇళ్లు, కార్యాలయాల్లో అప్పట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. గోవా, నేపాల్‌ థాయ్‌లాండ్‌లో క్యాసినోలు నిర్వహిస్తు తెలుగురాష్ట్రాల నుంచి జూదం ఆడేవారిని.. అక్కడకు తరలిస్తున్నారనేది ఈడీ అభియోగం. ఇందుకు సంబంధించి చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి తదితరులను గతంలో విచారించారు.

విచారణలో భాగంగా చీకోటిప్రవీణ్‌ వ్యాపార లావాదేవీలు, బ్యాంకు ఖాతాలను.. ఈడీ పరిశీలించగా సుమారు 100 మంది.... పెద్దమొత్తంలో నగదు బదిలీ చేశారని గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ వందమందిలో కొందరిని పిలిపించి విచారించనుందని.. ఇందులో భాగంగానే అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్​రెడ్డిని విచారిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.