"ఏపీలో తయారీ... కర్ణాటకలో చలామణి".. నకిలీ నోట్ల కేసు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు..!

author img

By

Published : Jan 26, 2023, 9:42 AM IST

నకిలీ నోట్ల

Fake Currency : కర్ణాటక, ఆంధప్రదేశ్‌లలో కలకలం రేపిన నకిలీ నోట్ల తయారీ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ మహిళా నేత నిందితురాలిగా ఉన్న నకిలీ నోట్ల కేసులో బెంగుళూరు పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

Fake currency: కర్ణాటక, ఆంధప్రదేశ్‌లలో కలకలం రేపిన నకిలీ నోట్ల తయారీ కేసులో పట్టుబడిన నిందితులు.. అనంతపురంలోనే వాటిని తయారు చేస్తున్నట్లు అంగీకరించారని బెంగళూరు పశ్చిమ విభాగం అదనపు పోలీసు కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ వెల్లడించారు. చరణ్‌సింగ్‌, రజని, గోపీనాథ్‌, పుల్లలరేవు రాజాలను నిందితులుగా గుర్తించి, అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రొద్దుటూరుకు చెందిన వైఎస్సార్​సీపీ నాయకురాలు, ఏపీ బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రాజపుత్ర రజని (38) నిందితురాలిగా ఉన్న నకిలీ నోట్ల కేసులో బెంగళూరు పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.

ఈ కేసులో వైఎస్సార్​సీపీ నాయకురాలు రజని, ప్రొద్దుటూరుకు చెందిన చరణ్‌సింగ్‌ను రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్న బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర పోలీసులు వారిని వైయస్‌ఆర్‌, అనంతపురం జిల్లాలకు తీసుకొచ్చి నకిలీ నోట్ల ముద్రణ కేంద్రాలు, భద్రపరిచే స్థావరాల్లో దాడులు నిర్వహించారు. రూ.11 లక్షల నకిలీ నోట్లు, వాటిని ముద్రించేందుకు ఉపయోగించే యంత్రాలు, పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాతో సంబంధాలున్న గోపీనాథ్‌, రాజా అనే మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలో నాయకుల అండదండలు!: బెంగళూరులోని ఉత్తరాహళ్లి-కెంగేరి ప్రధాన రహదారిలో పూర్ణప్రజ్ఞా లే అవుట్‌ సాధనా కళాశాల వద్ద బొలెరో వాహనంలో నకిలీ నోట్ల కట్టలు పెట్టుకుని.. వాటిని మార్చుతూ రజని అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. ఆమె వద్దనున్న రూ.4.09 లక్షల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రజని వైకాపా నాయకురాలు కావటం, ముఖ్య నాయకులతో సంబంధం ఉన్న నేపథ్యంలో ఆమె ఫోన్‌ను విశ్లేషించినప్పుడు కొన్ని ఆధారాలు లభించినట్లు సమాచారం. వైయస్‌ఆర్‌, అనంతపురం జిల్లాలకు చెందిన మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ఇప్పటికే కొంత సమాచారం సేకరించారు. వారిని త్వరలో విచారణకు పిలిపించే అవకాశం ఉంది.

నకిలీ నోట్ల తయారీలో ‘రాజా’!: ప్రొద్దుటూరుకు చెందిన చరణ్‌సింగ్‌, రజని కలిసి అనంతపురం, చిక్కబళ్లాపురాలకు చెందిన బృందాల నుంచి నకిలీ నోట్లను సేకరించేవారని దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న అనంతపురం వాసి పుల్లలరేవు రాజా నకిలీ నోట్ల తయారీలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాడని పోలీసు అధికారి సందీప్‌ పాటిల్‌ వివరించారు. రాజాకు సాంకేతిక సహకారం అందిస్తున్న గోపీనాథ్‌ అనే వ్యక్తి గురించీ వివరాలు రాబడుతున్నారు.

వైఎస్సార్​సీపీ నుంచి రజని సస్పెన్షన్‌ : నకిలీ నోట్ల కేసులో నిందితురాలైన రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రజనిని వైఎస్సార్ సీపీ నుంచి సస్పెండు చేస్తూ అధిష్ఠానానికి నివేదిక పంపినట్లు ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. రజనిపై కేసు నమోదవడంతో ఆమెపై నివేదిక పంపాలని పార్టీ నుంచి సమాచారం వచ్చిందని తెలిపారు. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండు చేయాలని నివేదిక పంపానని వివరించారు. వెంటనే పార్టీ చర్యలు తీసుకుందని తెలిపారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.