ఇలా అయితే ఎక్కువ పతకాలు ఎలా వస్తాయి?

author img

By

Published : Aug 10, 2021, 7:04 AM IST

Pullela Gopichand

సరైన వ్యవస్థ లేకుండానే ఒలింపిక్స్​లో భారత్​కు ఎక్కువ సంఖ్యలో పతకాలు ఆశించడం సరికాదని ప్రముఖ బ్యాడ్మింటన్​ కోచ్​ పుల్లెల గోపీచంద్​ పేర్కొన్నాడు. ప్రస్తుత వ్యవస్థ గందరగోళంగా ఉందని, దానిని సరిచేస్తేనే భవిష్యత్తులో మంచి ఫలితాలు దక్కుతాయని తెలిపాడు.

దేశంలో క్రీడా వ్యవస్థ జాతీయ ప్రయోజనాల కోణంలో ఉండాలని భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభిప్రాయపడ్డాడు. సరైన వ్యవస్థ, నిర్మాణం లేకుండా ఒలింపిక్స్‌లో ఎక్కువ సంఖ్యలో పతకాలు ఆశించడం సరికాదని తెలిపాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ ఏడు పతకాల ప్రదర్శన.. భవిష్యత్‌ కార్యాచరణపై గోపీచంద్‌తో ఇంటర్వ్యూ 'ఈనాడు'కు ప్రత్యేకం.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ ప్రదర్శనపై మీ విశ్లేషణ ఏంటి?

2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ తర్వాత 2010లో దిల్లీలో కామన్వెల్త్‌ క్రీడలు జరిగాయి. పతకాల కోసం బాగా కష్టపడ్డాం. ఫలితం సాధించాం. కామన్వెల్త్‌ క్రీడల కొనసాగింపు ప్రదర్శన 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో చూశాం. అందుకే ఆరు పతకాలొచ్చాయి. ఆ తర్వాత ఉత్సాహం తగ్గడం వల్ల 2016 రియో ఒలింపిక్స్‌లో బోల్తాపడ్డాం. ఆ వైఫల్యంతో కనువిప్పు కలిగింది. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించింది. ఒడిషా ప్రభుత్వం భారత హాకీ జట్లకు అండగా నిలిచింది. టోక్యోలో భారత హాకీ జట్ల ప్రదర్శన చిన్న విషయం కాదు. కొన్నేళ్లుగా ఇస్తున్న నాణ్యమైన శిక్షణ, మంచి కోచ్‌లు, టోర్నీల కారణంగా ఈ ప్రదర్శన చేశాయి. 2004లో బ్యాడ్మింటన్‌లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల వరుసగా మూడు ఒలింపిక్స్‌ల్లో పతకాలు వచ్చాయి.

130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ ఏడు పతకాలు గెలవడంపై ఏమంటారు?

2012 లండన్‌ ఒలింపిక్స్‌ తర్వాత చాలామంది షూటింగ్‌కు ఆకర్షితులయ్యారు. నెలకు రూ.2 లక్షలు ఖర్చు వస్తుందనేసరికి మానేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ, లెక్కల ప్రకారం ఒక ఒలింపియన్‌ కోసం ప్రతి ఏడాది రూ.8 లక్షల దాకా ఖర్చు అవుతాయి. చిన్నప్పట్నుంచి ఏడాదికి అంత మొత్తం ఖర్చు చేయాలి. మనదేశంలో ఎంతమంది అలా చేయగలరు? దేశంలో 70 నుంచి 80 శాతం మందికి పోషకాహారం దొరకట్లేదని నివేదికలు చెప్తున్నాయి. వీళ్లందరినీ పక్కన పెడితే.. మిగిలిన వారిలో ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లను గుర్తిస్తే సగం మంది తగ్గిపోతారు. వారిలో ఆసక్తి ఉండాలి. వసతులు కావాలి. 130 కోట్ల జనాభాలో క్రీడలకు అవసరమైన అన్నీ ఉన్న వారి సంఖ్య చాలా తక్కువ. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం క్రీడారంగానికి వెన్నుదన్నుగా ఉంటోంది. కానీ ఇది సరిపోదు. హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటు చేశాం కాబట్టి ప్రపంచ స్థాయి క్రీడాకారులు వస్తున్నారు. హరియాణాలో అఖాడాల వ్యవస్థ ఉండటం.. క్రీడాకారుల దేహదారుఢ్యం బాగుండటం వల్ల రెజ్లర్లు, బాక్సర్లు, అథ్లెట్లు ప్రతిభ కనబరుస్తున్నారు. మణిపూర్‌లో చిన్నప్పట్నుంచే కష్టాల నడుమ పెరుగుతారు. అక్కడి నుంచి వెయిట్‌ లిఫ్టర్లు, బాక్సర్లు వస్తున్నారు. వారికి మద్దతుగా నిలుస్తూ.. విశాల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఏకీకృత సమగ్ర క్రీడా వ్యవస్థను రూపొందించాలి.

దేశంలో క్రీడాభివృద్ధికి ఏం చేయాలి?

భారత క్రీడా వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. ప్రస్తుతం అగ్రశ్రేణి క్రీడాకారులకు మాత్రమే ప్రభుత్వాలు ఆర్థిక సహాయం, శిక్షణ వ్యయం అందిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి, గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహం లభించట్లేదు. 'ఈనాడు' లక్ష్య, మైత్ర లాంటి ప్రాజెక్టులను గమనిస్తే.. అవి అట్టడుగు స్థాయిని లక్ష్యంగా చేసుకున్నాయి. అక్కడి నుంచి వచ్చిన తెలంగాణ క్రీడాకారులు నందిని, శ్రీనివాస్‌ ప్రపంచ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో పాల్గొనబోతున్నారు. పతకాలు గెలిచిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పు లేదు. ఆ స్థాయికి చేరుకోడానికి మద్దతు అవసరం. క్రీడాకారులు ఓ స్థాయికి రావడానికి, వచ్చాక మార్గనిర్దేశం ఎలా అన్నది కీలకం. విజయవాడకు చెందిన 'ఈనాడు' లక్ష్య క్రీడాకారిణి అనూషను హైదరాబాద్‌ తీసుకొచ్చి మరింత మెరుగైన శిక్షణ ఇస్తే ఫెడరేషన్‌ కప్‌లో కాంస్యం సాధించింది. అనూష విజయవాడలోనే ఉండిపోతే అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌ కాలేదు. క్రీడాకారుల శిక్షణలో మూడంచెల వ్యవస్థ ఉండాలి. అందులో ఒక దశ నుంచి ఇంకో దశకు బదిలీ కీలకం.

కార్పొరేట్‌ సంస్థల నుంచి సహకారం ఎలా ఉంది?

2004లో నేను అకాడమీ పెట్టాలనుకున్నపుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ డబ్బులు ఇచ్చారు. ఆ సమయంలో ఇంకెవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు క్రీడల్ని ప్రోత్సహించేందుకు కార్పొరేట్‌ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అంకితభావంతో పని చేయాలనుకునే వారికి ఎక్కువ వనరులు, అవకాశాలు అందుబాటులో ఉన్నాయిప్పుడు. గ్రామీణ, పట్టణ, నగర స్థాయిల్లో అకాడమీలు ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ క్రీడాకారులు ఒక స్థాయికి చేరుకోగానే ప్రభుత్వం మార్గనిర్దేశం చేయాలి. ఎవరి పాత్ర, బాధ్యత ఏంటో స్పష్టంగా ఉండాలి. ఇప్పుడు అంతా గందరగోళంగా ఉంది. ఎవరు ఎందుకు పనిచేస్తున్నారో తెలియదు. కొందరు కోచ్‌లు క్రీడాకారుల్ని ఆపేస్తున్నారు. ప్రతిభావంతులు ముందుకెళ్లలేకపోతున్నారు. ఆటతో సంబంధం లేనివాళ్లు ఓ స్థాయికి వచ్చిన క్రీడాకారుల కెరీర్‌లను నిర్ణయిస్తున్నారు. ఒక స్థాయి, సామర్థ్యం కలిగిన వ్యక్తులే ఆ పని చేయాలి.

ఒలింపిక్స్‌ లక్ష్యంగా దేశంలో ఒకే క్రీడా విధానం తెస్తే..?

భారత్‌లో ఒక్కో క్రీడకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒకే విధానం అన్ని క్రీడలకు నప్పదు. క్రీడల వారీగా విధానాలు, మార్గదర్శకాలు ఉండాలి. కన్యాకుమారి లేదా మిజోరాం.. ప్రాంతం ఏదైనా జాతీయ దృక్కోణం అవసరం. ఎవరు ఎక్కడ ఆడినా.. ప్రతిభావంతులు ఎక్కడ ఉన్నా తెలిసిపోయే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. శిక్షణ, సెలెక్షన్‌, టోర్నీల నిర్వహణలో జాతీయ ప్రయోజనాలే ఉండాలి. 13 ఏళ్ల వయసులో ఎలాంటి శిక్షణ ఇవ్వాలి? ఎంత కసరత్తులు చేయించాలి? అనే విషయాల్లో ఏకీకృత వ్యవస్థ ఏర్పాటు చేయాలి. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో ప్రదర్శనల పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోవాలి. వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. తర్వాతి దశకు తీసుకెళ్లే వ్యవస్థ ఉండాలి. ప్రతి ఒక్కరి సమాచారం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

ఇదీ చూడండి:- ఒలింపిక్ పతక​ విజేతలకు అదిరిపోయే సన్మానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.