కామన్వెల్త్​లో భారత్ జోరు.. గోల్డ్​ కొట్టిన సుధీర్

author img

By

Published : Aug 5, 2022, 6:57 AM IST

Commonwealth Games 2022

commonwealth games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత్​ను మరో పసిడి వరించింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్​లో సుధీర్ స్వర్ణం సాధించాడు. హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్యం గెలిస్తే.. లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్‌ రజతం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్‌ క్రీడల పురుషుల లాంగ్‌జంప్‌లో భారత్‌కు లభించిన తొలి పతకం ఇదే. మరోవైపు భారత బాక్సర్ల పతక పంచ్‌లు కొనసాగుతున్నాయి. ఆ పతకాలను పసిడిగా మారుస్తారా అన్నదే చూడాలి. గురువారం అమిత్‌ ఫంగాల్‌, సాగర్‌, జాస్మిన్‌ సెమీఫైనల్‌ చేరి పతకాలు ఖరారు చేశారు. హాకీలో భారత పురుషుల జట్టు సెమీస్‌ చేరగా.. టేబుల్‌టెన్నిస్‌, స్క్వాష్‌లో మన క్రీడాకారులు దూసుకెళ్తున్నారు.

commonwealth games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత్​ను మరో పసిడి వరించింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్​లో సుధీర్ స్వర్ణం సాధించాడు. ఆసియా పారా ఒలింపిక్స్​లో కాంస్య విజేత అయిన సుధీర్ తాజాగా ఈ పతకాన్ని సాధించాడు.
కామన్వెల్త్‌ క్రీడల బాక్సింగ్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల్లో స్టార్‌ బాక్సర్‌ అమిత్‌ ఫంగాల్‌ (48-51 కేజీలు), సాగర్‌ (92 కేజీల పైన), మహిళల్లో జాస్మిన్‌ (57-60 కేజీలు) సెమీఫైనల్‌ చేరారు. క్వార్టర్స్‌లో అమిత్‌ 5-0తో లెనోన్‌ (స్కాట్లాండ్‌)ను చిత్తు చేయగా.. సాగర్‌ అంతే తేడాతో కెడీ ఇవాన్స్‌ (సెచిలెస్‌)ను ఓడించాడు. గత క్రీడల్లో రజతం గెలిచిన ఫంగాల్‌ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఒకవైపు పదునైన పంచ్‌లతో లెనోన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన అతడు.. పటిష్టమైన డిఫెన్స్‌, చక్కని ఫుట్‌వర్క్‌తో ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. ఇవాన్స్‌తో పోరులో సాగర్‌ కూడా అమిత్‌ మాదిరే దూకుడుగా ఆడాడు. లెఫ్ట్‌ హుక్స్‌తో పాయింట్లు కొల్లగొట్టిన అతడు సులభంగా బౌట్‌ గెలిచాడు. మహిళల విభాగంలో జాస్మిన్‌ 4-1తో టోరీ గార్టన్‌ (న్యూజిలాండ్‌)ను ఓడించింది. ఈ బౌట్లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా నిలిచిన జాస్మిన్‌ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ ఆటలో పతకాలు ఖాయం చేసిన బాక్సర్ల సంఖ్య ఆరుకు చేరింది. వీరి కంటే ముందు నిఖత్‌ జరీన్‌, హుసాముద్దీన్‌, నీతు సెమీస్‌ చేరారు.

.

ప్రిక్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌:

.

బ్యాడ్మింటన్‌లో భారత స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సింధు 21-4, 21-11తో ఫాతిమా అబ్దుల్‌ (మాల్దీవులు)ను చిత్తు చేసింది. తొలి గేమ్‌ను సులభంగా గెలుచుకున్న సింధుకు రెండో గేమ్‌లో ఫాతిమా నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. ఒక దశలో స్కోరు 9-9తో సమమైంది. కానీ అక్కడ నుంచి తన శైలిలో విజృంభించిన సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో శ్రీకాంత్‌ 21-9, 21-9తో డానియల్‌ (ఉగాండా)పై విజయం సాధించాడు.

హిమ ముందంజ:

.

మహిళల 200 మీటర్ల పరుగులో స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. హీట్‌-2లో పోటీపడిన హిమ 23.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంమీద 200 మీటర్ల హీట్స్‌లో ఎలెన్‌ థాంప్సన్‌ (జమైకా, 22.80 సెకన్లు) ఉత్తమ టైమింగ్‌ నమోదు చేసింది. మహిళల హ్యామర్‌త్రోలో మంజు బాల ఫైనల్‌ చేరగా.. సరిత విఫలమైంది. క్వాలిఫయింగ్‌లో హ్యామర్‌ను 59.68 మీటర్ల దూరం విసిరి 11వ స్థానంలో నిలిచి మంజు ముందంజ వేసింది. ఇదే విభాగంలో సరిత (57.48 మీ) 13వ స్థానం సాధించింది. ఈ విభాగంలో టాప్‌-12 అథ్లెట్లు మాత్రమే పతక పోరుకు అర్హత సాధిస్తారు.

సెమీస్‌లో హాకీ జట్టు:

.

హాకీలో భారత పురుషుల జట్టు సెమీస్‌ చేరింది. పూల్‌-బి చివరి మ్యాచ్‌లో మన జట్టు 4-1 గోల్స్‌తో వేల్స్‌ను ఓడించింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (18, 19, 41 నిమిషాలు) హ్యాటిక్‌ సాధించగా.. గుర్జాంత్‌ (49వ ని) ఒక గోల్‌ కొట్టాడు. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఒక డ్రాతో భారత్‌ పూల్‌-బిలో అగ్రస్థానంతో ముందంజ వేసింది. లీగ్‌ దశలో భారత్‌ 4 మ్యాచ్‌ల్లోనే 27 గోల్స్‌ కొట్టడం విశేషం. కామన్వెల్త్‌ క్రీడల్లో సెమీస్‌ చేరడం భారత జట్టుకు ఇది వరుసగా నాలుగోసారి.

శ్రీజ-శరత్‌ జోరు:

.

టేబుల్‌టెన్నిస్‌లో ఆకుల శ్రీజ-ఆచంట శరత్‌కమల్‌ ప్రిక్వార్టర్స్‌ చేరారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో శ్రీజ-శరత్‌ 3-0తో ఒవెన్‌ కాథ్‌కార్ట్‌-సోఫి ఎర్లీ (నార్తన్‌ ఐర్లాండ్‌)పై విజయం సాధించారు. మనిక బత్రా-సత్యన్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో మనిక జంట 3-0తో క్రెయా-సినోన్‌ (సెచెలిస్‌)పై గెలిచింది. ఇదే విభాగంలో సనీల్‌శెట్టి-రీత్‌ టెన్నిసన్‌ ఓడిపోయారు. తొలి రౌండ్లో సనీల్‌ జంట 2-3తో వాంగ్‌షెన్‌-టీ జిన్‌ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశారు. ఆకుల శ్రీజ, మనిక బాత్రా మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. తొలి రౌండ్లో శ్రీజ 4-1తో కరెన్‌ లెన్‌ (మలేసియా)ను ఓడించింది. మరో మ్యాచ్‌లో మనిక 3-0తో చింగ్‌ నమ్‌ (కెనడా)ను చిత్తు చేసింది. పారా టీటీలో భవినా పటేల్‌ తొలి రౌండ్లో 3-0 అకాన్‌సి (ఫిజి)పై గెలిచింది. స్క్వాష్‌లో దీపిక పల్లికల్‌-సౌరభ్‌ ఘోషల్‌ క్వార్టర్స్‌ చేరారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో దీపిక జంట 2-0తో ఎమిలీ-పీటర్‌ (వేల్స్‌) జోడీని ఓడించింది. మహిళల డబుల్స్‌లో సునయన-అనహత్‌ 11-9, 11-4తో యెహెని-చనితమ (శ్రీలంక)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరారు. మహిళల క్రికెట్లో భారత్‌ నాకౌట్‌ చేరింది. గ్రూప్‌-ఏ ఆఖరి మ్యాచ్‌లో భారత్‌ 100 పరుగుల తేడాతో ఉగాండాను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లింది.

మెరిసిన మురళీ:

.

కామన్వెల్త్‌ గేమ్స్‌ అథ్లెటిక్స్‌లో మరో శంకర్‌ మెరిశాడు. బుధవారం హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్యం గెలిస్తే.. గురువారం లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్‌ రజతం పట్టేశాడు. అయిదో ప్రయత్నంలో 8.08 మీటర్ల దూరం దూకిన అతడు రెండో స్థానంలో నిలిచాడు. బహమాస్‌కు చెందిన లకాన్‌ నైర్న్‌ స్వర్ణం గెలుచుకున్నాడు. లకాన్‌ కూడా 8.08 మీటర్లే దూకాడు. కానీ అతని రెండో ఉత్తమ ప్రదర్శన (7.98మీ) శ్రీశంకర్‌ (7.84మీ) కన్నా మెరుగ్గా ఉండడంతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. జమైకాకు చెందిన థాంప్సన్‌ (8.05మీ) కాంస్యం చేజిక్కించుకున్నాడు. మరో భారత అథ్లెట్‌ మహ్మద్‌ అనీస్‌ యహియా (7.97మీ) అయిదో స్థానంతో సంతృప్తి చెందాడు.

.

ఇక రెజ్లర్ల వంతు:

.

కామన్వెల్త్‌ క్రీడల్లో దేశానికి పతకాలు అందించడంలో ముందున్న వెయిట్‌లిఫ్టర్ల ప్రస్థానం ముగిసింది. ఇక వాళ్ల పతక జోరును కొనసాగించేందుకు రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారమే రెజ్లింగ్‌ పోటీలకు తెరలేవనుంది. 2018 గోల్డ్‌కోస్ట్‌ క్రీడల్లో రెజ్లర్లు 5 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలు గెలిచారు. పోటీపడిన అన్ని విభాగాల్లోనూ పతకాలు నెగ్గడం విశేషం. ఈ సారి కూడా వాళ్లపై మంచి అంచనాలే ఉన్నాయి. తొలి రోజు మోహిత్‌, బజ్‌రంగ్‌, దీపక్‌, అన్షు మలిక్‌, సాక్షి మలిక్‌, దివ్య బరిలో దిగుతున్నారు. బజ్‌రంగ్‌, వినేశ్‌, సాక్షి లాంటి అగ్రశ్రేణి రెజ్లర్లు వరుసగా మూడో కామన్వెల్త్‌ క్రీడల పతకంపై కన్నేశారు. టోక్యో ఒలింపిక్స్‌ రజత విజేత రవి దహియాపై భారీ అంచనాలున్నాయి. మొత్తం 12 మంది భారత రెజ్లర్లు పతకాల కోసం పోటీపడనున్నారు. మరోవైపు అమ్మాయిల హాకీ సెమీస్‌లో భారత్‌.. పటిష్ఠమైన ఆస్ట్రేలియాను ఢీ కొడుతోంది. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌ క్వార్టర్స్‌లో ఆసీస్‌కు 1-0తో షాకిచ్చిన భారత్‌.. ఇప్పుడూ అదే ప్రదర్శన పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. పూల్‌- బిలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆసీస్‌ అగ్రస్థానంతో ముందంజ వేసింది. పూల్‌- ఎలో మూడు విజయాలు, ఓ ఓటమి (ఇంగ్లాండ్‌తో 1-3)తో రెండో స్థానంతో భారత్‌ సెమీస్‌ చేరింది. ఇటీవల సంచలన ప్రదర్శనతో మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో పతక ఆశలు రేపుతున్న ఏపీ అథ్లెట్‌ జ్యోతి యర్రాజి నేడు బరిలో దిగుతోంది. ఈ ఏడాది మేలో మూడు సార్లు జాతీయ రికార్డును బద్దలు కొట్టిన ఆమె రెండో హీట్స్‌లో పోటీపడుతోంది.

కామన్వెల్త్‌లో ఈనాడు:

హాకీ (మహిళలు, రా.10.30 నుంచి): భారత్‌ × ఆస్ట్రేలియా, సెమీఫైనల్‌

అథ్లెటిక్స్‌: జ్యోతి యర్రాజి, మహిళల 100 మీ.హర్డిల్స్‌ (మ.2.56 నుంచి); పురుషులు 4×400 మీ రిలే (సా.4.07 నుంచి); హిమదాస్‌, మహిళల 200 మీ. సెమీస్‌ (రా.12.45 నుంచి)

రెజ్లింగ్‌ (మ.3 నుంచి): బజరంగ్‌ పునియా, 65 కేజీలు; దీపక్‌ పునియా, 86 కేజీలు; సాక్షి మలిక్‌, 62 కేజీలు; అన్షు మలిక్‌, 57 కేజీలు; మోహిత్‌, 125 కేజీలు; దివ్య, 68కేజీలు

బ్యాడ్మింటన్‌ (మ.3.30 నుంచి): సింధు, మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌; శ్రీకాంత్‌, పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌

టేబుల్‌ టెన్నిస్‌ (సా.5 నుంచి): ఆకుల శ్రీజ-రీత్‌, మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌

ఇవీ చదవండి: హర్మన్​ప్రీత్​ హ్యాట్రిక్​ గోల్స్​.. సెమీస్​కు దూసుకెళ్లిన హాకీ టీం

క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్ ​న్యూస్.. 15 రోజుల్లో మూడు భారత్​- పాక్​ మ్యాచ్​లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.