థామస్​ కప్​లో భారత్ సంచలనం.. 43 ఏళ్ల తర్వాత సెమీస్​కు.. పతకం ఖాయం

author img

By

Published : May 13, 2022, 6:28 AM IST

Updated : May 13, 2022, 7:02 AM IST

thomas-cup

Thomas cup 2022: థామస్‌ కప్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. 43 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ సెమీఫైనల్‌ చేరిన భారత్‌ ఈ టోర్నీలో తొలిసారి పతకం ఖాయం చేసుకుంది. స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన పురుషుల జట్టు క్వార్టర్‌ఫైనల్లో మలేసియాను ఓడించింది. మరోవైపు ఉబెర్‌ కప్‌లో అమ్మాయిల పోరాటం క్వార్టర్‌ఫైనల్లోనే ముగిసింది.

Thomas Cup India: భారత్‌ అదిరే ఆటతో థామస్‌కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో చరిత్రాత్మక పతకం ఖరారు చేసింది. గురువారం హోరాహోరీగా సాగిన పోరులో భారత్‌ 3-2తో మలేసియాను ఓడించింది. ఈ పోరు ఆరంభంలో భారత్‌ది వెనకడుగే. తొలి సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ 21-23, 9-21తో లీ జీ జియా చేతిలో ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్య పోరాటం తొలి గేమ్‌కే పరిమితమైంది. అయితే డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి 21-19, 21-15తో గోఫియ్‌-ఇజుద్దీన్‌పై గెలిచి భారత్‌ను పోటీలో నిలిపారు. దూకుడుగా ఆడిన భారత జంట.. అయిదు మ్యాచ్‌ పాయింట్లు సాధించి ఓ మెరుపు స్మాష్‌తో మ్యాచ్‌ను ముగించింది.

Badminton news: ఆ తర్వాత సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 21-11, 21-17తో జె యంగ్‌పై గెలవడంతో భారత్‌ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. కానీ డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్‌-విష్ణువర్దన్‌ 19-21, 17-21తో ఓడడంతో మళ్లీ స్కోర్లు 2-2తో సమమయ్యాయి. ఈ స్థితిలో ఒత్తిడిలోనూ గొప్పగా ఆడిన ప్రణయ్‌ 21-13, 21-8తో జున్‌ హోను చిత్తు చేసి భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. సెమీస్‌ చేరడంతో భారత జట్టుకు పతకం ఖాయమైంది. 1979 తర్వాత భారత్‌ ఏనాడూ ఈ దశకు రాలేదు. గతంలో వేరే ఫార్మాట్‌లో ఉన్నప్పుడు భారత్‌ మూడుసార్లు సెమీస్‌ చేరింది. అయితే అప్పుడు ఫైనలిస్టులకు మాత్రమే పతకాలు ఇచ్చేవారు. ఫార్మాట్‌ మారిన తర్వాత భారత్‌ సెమీస్‌ చేరడం ఇదే తొలిసారి.

మహిళలకు నిరాశ: ఉబెర్‌ కప్‌లో పతకం సాధించాలన్న పట్టుదలతో బరిలో దిగిన పి.వి.సింధు సారథ్యంలోని భారత మహిళల జట్టుకు నిరాశే ఎదురైంది. క్వార్టర్స్‌లో భారత్‌ 0-3తో థాయ్‌లాండ్‌ చేతిలో చిత్తయింది. తొలి సింగిల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు 21-18, 17-21, 12-21తో రచనోక్‌ ఇంటోనన్‌ చేతిలో ఓటమి చవిచూసింది. తొలి గేమ్‌ నెగ్గి జోరు మీద కనిపించిన సింధు.. కీలక సమయాల్లో తడబడి వరుసగా రెండు గేమ్‌లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. డబుల్స్‌లో శ్రుతి మిశ్రా-సిమ్రాన్‌ సింగ్‌ 16-21, 13-21తో జాంగ్‌కోపాన్‌-రవిండా చేతిలో ఓడిపోవడంతో భారత్‌ ఓటమి ఖాయమైంది. సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్‌ 16-21, 11-21 చోచువాంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం చవిచూడడంతో పరాజయం పరిపూర్ణమైంది.

ఇదీ చదవండి: 156 గంటల్లో 480కి.మీ 'గిన్నిస్​' రన్.. ఆక్సిజన్ కొరత, మైనస్ ఉష్ణోగ్రత మధ్యే..

Last Updated :May 13, 2022, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.