అట్టహాసంగా ప్రారంభమైన 36వ జాతీయ క్రీడలు.. ఫైనల్లో తెలంగాణ

author img

By

Published : Sep 30, 2022, 8:33 AM IST

national games 2022

National Games 2022 : ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో 36వ జాతీయ క్రీడలు గురువారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు.

National Games 2022 : ఏడేళ్ల నిరీక్షణ ముగిసిన వేళ.. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతుల్లో.. బాణాసంచా వెలుగుల్లో.. చూపు తిప్పుకోనివ్వని నృత్యకారుల ప్రదర్శన మధ్యలో.. మనసును మైమరిపించే సంగీత మాయలో.. 36వ జాతీయ క్రీడలు గురువారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో36వ జాతీయ క్రీడలు ఆరంభోత్సవ వేడుక కనుల పండుగగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. సంగీత విభావరితో మొదలైన కార్యక్రమం ఆద్యంతం అలరించింది. శంకర్‌ మహాదేవన్‌ తదితర గాయకుల పాటలకు అనుగుణంగా స్టాండ్స్‌లోని ప్రేక్షకులు స్టెప్పులతో స్టేడియాన్ని హోరెత్తించారు. పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు ఇతర జనాలతో స్టేడియం దాదాపుగా నిండిపోయినట్లే కనిపించింది.

36th National Games 2022
ప్రారంభమైన 36వ జాతీయ క్రీడలు

జాతీయ క్రీడల మస్కట్‌తో కూడిన ప్రత్యేక వాహనంలో మైదానంలో తిరిగిన ప్రధాని ప్రజలకు అభివాదం చేశారు. మైదానంలో కళాకారులు విభిన్న నృత్య రూపకాలు ప్రదర్శించారు. అందులో గుజరాత్‌ సంప్రదాయ నృత్యం గర్భా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేదికపై నుంచి స్వర్ణిమ్‌ గుజరాత్‌ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ప్రధాని ప్రారంభించారు. "అథ్లెట్లందరికీ స్వాగతం. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంలో, అత్యధిక యువ శక్తి కలిగిన భారత్‌లో, దేశంలోనే పెద్ద క్రీడా సంబరాలైన జాతీయ క్రీడల ఆరంభోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం".

"దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 7 వేలకు పైగా అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. దేశ అత్యుత్తమ భవిష్యత్‌ దిశగా జాతీయ క్రీడలు మంచి ఆరంభాన్నిచ్చే వేదిక. తక్కువ వ్యవధిలో క్రీడల కోసం ఇంత గొప్పగా ఏర్పాట్లు చేసిన గుజరాత్‌ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. ఆటలతో పాటు ఇక్కడ జరిగే నవరాత్రి ఉత్సవాలనూ ఆస్వాదించండి. నీరజ్‌ చోప్రా కూడా గర్భా ఆడాడు. క్రీడలతో దేశ ప్రగతికి సంబంధం ఉంది. జీవన నిర్మాణానికి ఆటలు ముఖ్యం".

"మైదానంలో ఆటగాళ్ల గెలుపు.. వివిధ మార్గాల్లో దేశ విజయాలకు బాటలు వేస్తాయి. వైఫల్యాలతో ఆగిపోకుండా ముందుకు సాగుతూనే ఉండాలి. కరోనా కాలంలోనూ ఆటగాళ్ల మనోబలం తగ్గలేదు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. థామస్‌ కప్‌లో బ్యాడ్మింటన్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఉగాండాలో పారా షట్లర్లు 47 పతకాలు గెలిచారు. ఫిట్‌ ఇండియా, ఖేలో ఇండియా, టాప్‌ పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయి".

"వెయ్యేళ్ల భారత సభ్యత, సంస్కృతికి ఆటలు ప్రతీకగా నిలుస్తున్నాయి. యోగాసన, మల్లఖంబ్‌ లాంటి సంప్రదాయ ఆటలకు జాతీయ క్రీడల్లో చోటు దక్కింది. అందరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి. జాతీయ క్రీడల్లో అథ్లెట్ల ప్రదర్శన.. దేశానికి కొత్త విశ్వాసాన్ని అందిస్తుందని నమ్ముతున్నా. జాతీయ క్రీడలు ఆరంభమయ్యాయని ప్రకటిస్తున్నా" అని మోదీ ప్రసంగించారు. అనంతరం అన్ని జట్లు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నాయి. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  • అంజు బాబి, రవి దహియా, మీరాబాయి చాను, పీవీ సింధు, నీరజ్‌ చోప్రా, గగన్‌ నారంగ్‌, దిలీప్‌ టిర్కీ సమక్షంలో టెన్నిస్‌ క్రీడాకారిణి అంకిత రైనా నుంచి ఏకతా జ్యోతిని ప్రధాని అందుకుని మైదానంలో ఉంచారు.
  • ఆర్చర్‌ జ్యోతి సురేఖ పతాకాన్ని పట్టుకుని ముందు నడవగా.. ఆంధ్రప్రదేశ్‌ బృందం ఆమెను అనుసరించింది. తెలంగాణ బృందానికి షూటర్‌ రష్మీ రాథోడ్‌ పతాకధారిగా వ్యవహరించింది. రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కూడా మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. అసోం తరపున హిమదాస్‌.. మణిపూర్‌కు మీరాబాయి చాను పతాకధారులుగా వ్యవహరించారు. కేరళ అథ్లెట్లు సంప్రదాయ వస్త్రధారణలో హాజరై ఆకట్టుకున్నారు. అనంతరం అథ్లెట్లందరూ ప్రతిజ్ఞ చేశారు.
    36th National Games 2022
    ఆంధ్రప్రదేశ్​ బృందం
  • ఆంధ్రప్రదేశ్‌ నుంచి 21 క్రీడాంశాల్లో మొత్తం 156 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. తెలంగాణ నుంచి 27 క్రీడాంశాల్లో 233 మంది అథ్లెట్లు బరిలో నిలిచారు. ఈ క్రీడల్లో ఇప్పటికే తెలంగాణ రెండు రజతాలు, ఓ కాంస్యం సాధించింది. టీటీ మహిళల సింగిల్స్‌లో ఆకుల శ్రీజ, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శ్రీజ- స్నేహిత్‌ రజతాలు గెలిచారు. మహిళల టీమ్‌ విభాగంలో కాంస్యం దక్కింది.
    36th National Games 2022
    తెలంగాణ బృందంతో రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ఫైనల్లో తెలంగాణ: జాతీయ క్రీడల నెట్‌బాల్‌లో తెలంగాణ పురుషుల జట్టు తుదిపోరు చేరింది. గురువారం హోరాహోరీగా సాగిన సెమీస్‌లో తెలంగాణ 55-53 తేడాతో గుజరాత్‌ను ఓడించింది. తొలి క్వార్టర్‌లో 13-15తో వెనకబడ్డ మన జట్టు.. ఆ తర్వాత పుంజుకుంది. రెండో క్వార్టర్‌లో 15-15తో లయ అందుకుంది. మూడో క్వార్టర్‌లో 17-12తో కీలకమైన ఆధిక్యం సాధించింది.

దీంతో నాలుగో క్వార్టర్‌లో 10-11తో వెనకబడ్డప్పటికీ ఇబ్బంది లేకుండా పోయింది. మరోవైపు టెన్నిస్‌ మహిళల టీమ్‌ విభాగం తొలి రౌండ్లో తెలంగాణ 0-2తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ చేతిలో ఓటమిపాలైంది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి తుపాకీ పట్టిన ఒలింపిక్‌ రజత విజేత విజయ్‌ కుమార్‌ 25మీ. ర్యాపిడ్‌ పిస్టల్‌ ఫైర్‌ తొలి దశ పోటీల్లో రెండో స్థానంలో నిలిచాడు. అంకుర్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇవీ చదవండి: T20 worldcup: టీమ్​ఇండియాకు ఇబ్బందులు తప్పవా?.. అతడి స్థానంలో ఎవరొస్తారో?

ఇర్ఫాన్​, ఓజా మెరుపులు.. ఫైనల్​లో ఇండియా లెజెండ్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.