Yuvaraj singh: కోట్లొస్తుంటే టెస్టులెందుకు ఆడతారు?

author img

By

Published : May 11, 2022, 6:58 AM IST

యువరాజ్ సింగ్ టెస్టు క్రికెట్

Yuvaraj singh about Test cricket: ప్రేక్షకులు టీ20 క్రికెట్​ కావాలనుకుంటున్నారని అందుకే టెస్టు క్రికెట్‌ చచ్చిపోతుందని అన్నాడు మాజీ స్టార్​ యువరాజ్ సింగ్​. ప్లేయర్స్​కు ఆదాయం కూడా టెస్టుతో పోలిస్తే టీ20లోనే ఎక్కువగా వస్తుందని చెప్పాడు. అందుకే ఆటగాళ్లు కూడా టీ20లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెప్పుకొచ్చాడు.

Yuvaraj singh about Test cricket: టీ20 క్రికెట్‌ ఆడడం ద్వారా ఇప్పుడు కుర్రాళ్లు ఏడాదికి కోట్లు సంపాదిస్తుంటే టెస్టులపై ఎందుకు ఆసక్తి చూపిస్తారని భారత మాజీ స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ ప్రశ్నించాడు. "టెస్టు క్రికెట్‌ చచ్చిపోతుంది. ఎందుకంటే జనం టీ20 క్రికెట్‌ కావాలనుకుంటున్నారు.. టీ20లనే చూడాలని అనుకుంటున్నారు. ఇలాంటి స్థితిలో ఏ ఆటగాడైనా అయిదు లక్షల కోసం అయిదురోజుల క్రికెట్‌ ఆడాలని అనుకోరు కదా. అదే టీ20లు ఆడితే కనీసం 50 లక్షలు సంపాదిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయని కుర్రాళ్లు కూడా ఐపీఎల్‌ ద్వారా 7-10 కోట్ల మధ్య ఆర్జిస్తున్నారు. టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ను చూసిన కళ్లతో వన్డేను చూస్తే టెస్టు చూసినట్లే ఉంటుంది. 20 ఓవర్లు గడిచాక ఇంకా 30 ఓవర్లు బ్యాటింగ్‌ చేయాలా అని అనిపిస్తుంది. టీ20లదే హవా అని చెప్పడానికి ఇదొక్కటే ఉదాహరణ" అని యువీ చెప్పాడు.

అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో.. తాను ఎందుకు టీమ్ఇండియా కెప్టెన్​ అవ్వలేకపోయాడో కూడా వివరించాడు యువీ. "టీమ్‌ఇండియాకు అప్పుడు నేను కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చింది. అదే సమయంలో గ్రేగ్‌ ఛాపెల్‌ వివాదం చోటుచేసుకుంది. అప్పుడు సచిన్‌, ఛాపెల్‌ల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో నేను సచిన్‌వైపే మొగ్గు చూపా. అది కొంతమంది బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. దీంతో నన్ను తప్ప ఎవరినైనా కెప్టెన్‌ చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు నాకు తెలిసింది. అయితే.. అదెంతవరకు నిజమో నాకు తెలియదు. అప్పటికి వైస్‌ కెప్టెన్‌గా ఉన్న నన్ను ఉన్నట్టుండి తొలగించారు. 2007 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు మేం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లాం. అప్పుడు సెహ్వాగ్‌ జట్టులో లేడు. నేను వైస్‌ కెప్టెన్‌గా ఉన్నా. ద్రవిడ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో నేనే కెప్టెన్‌ అవ్వాల్సింది. కానీ, అనూహ్యంగా నన్ను కాదని ధోనీని ఎంపిక చేశారు. అది నాకు పూర్తిగా వ్యతిరేకమైన నిర్ణయం. అయినా, ఆ విషయంలో నేనెప్పుడూ బాధపడలేదు. అయితే, కొద్ది రోజుల తర్వాత ధోనీ కెప్టెన్సీ బాగా చేస్తున్నాడని అర్థం చేసుకున్నా. వన్డేల్లోనూ అతడే నాయకత్వం వహించాలని భావించా. అతడే సరైన నాయకుడని అనుకున్నా. తర్వాత నేను వరుసగా గాయాలపాలయ్యాను. దీంతో ఒకవేళ నన్ను కెప్టెన్‌గా చేసినా ఎక్కువ కాలం కొనసాగనని అనుకున్నా. ఏదైనా మన మంచికే జరుగుతుంది. అయితే, టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించడం చాలా గొప్ప విషయంగా భావిస్తా. నేనెప్పుడూ జట్టు కోసమే ఆలోచిస్తా. అందుకే సచిన్‌కు మద్దతిచ్చా" అని స్పష్టం చేశాడు.

ఇదీ చూడండి: 'ఆ నిర్ణయం సరికాదు.. సచిన్‌ను 200 కొట్టనివ్వాల్సింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.