యూపీ వారియర్స్​పై దిల్లీ ఘన విజయం.. అదరగొట్టిన కెప్టెన్‌ మెగ్ లానింగ్

author img

By

Published : Mar 7, 2023, 11:09 PM IST

Updated : Mar 8, 2023, 9:02 AM IST

wpl 2023

మహిళల ప్రీమియర్​ లీగ్​లో భాగంగా యూపీ వారియర్స్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. యూపీ వారియర్స్​పై 42 రన్స్​ తేడాతో దిల్లీ గెలుపొందింది.

ముంబయిలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా యూపీతో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ 42 పరుగుల తేడాతో గెలుపొందింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్​తో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని కైవసం చేసుకుంది. తమ మొదటి మ్యాచ్‌లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరును చిత్తు చేసిన క్యాపిటల్స్‌.. ఇప్పుడు యూపీ వారియర్స్‌ను కూడా అదే రీతిలో మట్టి కరిపించి ఘన విజయం సాధించింది.

మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్​ను రికార్డు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన యూపీ వారియర్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 169 పరుగులే సాధించింది. తాహిలా మెక్‌గ్రాత్ (90*; 50 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ ఇన్నింగ్స్‌ ఆడినా జట్టును విజయ పథంలోకి నడిపించలేకపోయింది. అలీసా హీలే (24), దేవికా వైద్య (23)లు తమ పర్ఫార్మెన్స్​లతో కాస్త పర్వాలేదనిపించారు. మరో వైపు దీప్తి శర్మ (12), కిరణ్ నవ్‌గిరె (2), శ్వేత సెహ్రావత్‌ (1)లు స్వల్ప స్కోర్​ చేసి అందరిని నిరాశపరిచారు. ఇక దిల్లీ బౌలర్లలో జొనాస్సెన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మరిజేన్‌ కాప్‌, శిఖా పాండే చెరో వికెట్ తీశారు.

ఇక భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగిన యూపీ టీమ్​కు శుభారంభమే లభించింది. తొలుత క్రీజులోకి దిగిన అలీసా హీలే ఒక్క సారిగా చెలరేగడం వల్ల మూడు ఓవర్లకు గాను 25/0 స్కోరు నమోదైంది. అయితే జోనాస్సెన్‌ వేసిన నాలుగో ఓవర్‌లో యూపీకి గట్టి షాక్‌ తగిలింది. క్రమంగా యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్​ బాట పట్టింది అలీసా. అయితే తనకు తోడుగా గత మ్యాచ్‌లో అర్ధ శతకం బాదిన కిరణ్‌ నవ్‌గిరె కూడా కాప్సీకి చిక్కి క్రీజు నుంచి వెనుదిరిగింది.

ఇక మారిజేన్‌ కాప్ వేసిన ఐదో ఓవర్‌తో శ్వేత కూడా ఔట్​ అయ్యింది. దీంతో 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది దిల్లీ టీమ్​. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్‌, దీప్తి శర్మ మరో వికెట్ పడనీయకుండా జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. అయినప్పటికీ శిఖా పాండే వేసిన 11 ఓవర్‌తో దీప్తి శర్మ ఔట్‌ కాగా.. జొనాస్సెన్‌ వేసిన 17 ఓవర్‌తో దేవికా వైద్య కూడా పెవిలియన్‌ చేరింది. ఆఖరిలో మెక్‌గ్రాత్‌ దూకుడుగా ఆడినా అప్పటికే యూపీ టీమ్​కు ఇక ఓటమే మిగిలింది.

కెప్టెన్‌ మెగ్ లానింగ్ (70; 42 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకానికి తోడు చివర్లో జెస్ జొనాస్సెన్ (42*; 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మైదానంలో అదరగొట్టడంతో దిల్లీ భారీ స్కోరును సాధించగలిగింది. మరోవైపు జెమీమా రోడ్రిగ్స్‌ (34*; 22 బంతుల్లో 4 ఫోర్లు), అలీస్‌ కాప్సీ (21), షెఫాలీ వర్మ (17), మరిజేన్ కాప్ (16) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, రాజేశ్వరి గైక్వాడ్, మెక్‌గ్రాత్‌, సోఫీ ఎకిల్‌స్టోన్‌ తలో వికెట్ పడగొట్టారు.

మొదటి రెండు ఓవర్ల వరకు నెమ్మదిగా ఆడిన మెగ్ లానింగ్.. మూడో ఓవర్‌ నుంచి దూకుడు పెంచింది. మూడో ఓవర్‌లో ఓ సిక్సర్‌ కొట్టిన లానింగ్​ . షబ్నిమ్ వేసిన ఐదో ఓవర్‌లో ఒక ఫోర్‌, రెండు సిక్సర్లను బాదింది. రాజేశ్వరి గైక్వాడ్ వేసిన తర్వాతి ఓవర్‌లోనూ మూడు బౌండరీలు బాది మైదానంలో మెరిసింది. మొదటి వికెట్‌కు షెఫాలీతో కలిసి 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మెక్‌గ్రాత్‌ వేసిన ఏడో ఓవర్‌లో షెఫాలీ.. కిరణ్ నవ్‌గిరెకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది.

అయితే లానింగ్​ మాత్రం తగ్గేదే లే అంటూ చెలరేగిపోయింది. ఎకిల్ స్టోన్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో సిక్సర్ బాది తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకుంది మెగ్​. కేవలం 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. కానీ దూకుడుగా ఆడుతున్న లానింగ్‌ ఆఖరికి రాజేశ్వరి గైక్వాడ్ చేతిలో ఔట్‌ అయ్యింది. చివర్లో దిగిన జెమీమా, జోనాస్సెన్ యూపీ బౌలర్లను ఊచకోత కోశారు. ముఖ్యంగా జోనాస్సెన్‌ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి జట్టు స్కోరు 200 దాటడంతో కీలక పాత్ర పోషించింది.

Last Updated :Mar 8, 2023, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.