మూడో టీ20 మ్యాచ్‌ టై.. భారత్‌దే సిరీస్‌

author img

By

Published : Nov 22, 2022, 4:02 PM IST

Updated : Nov 22, 2022, 4:48 PM IST

teamindia won the series against newzealand

15:57 November 22

మూడో టీ20 మ్యాచ్‌ టై.. భారత్‌దే సిరీస్‌

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా ఆగిపోయింది. మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి భారత్‌ 9 ఓవర్లలో 75/4 స్కోరు చేసింది. డక్‌వర్త్‌లూయిస్‌ ప్రకారం మ్యాచ్​ను టైగా ప్రకటించారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకొంది.

పంత్‌ మళ్లీ ఫెయిల్​.. బౌలర్లు కష్టపడి కివీస్‌ను 160 పరుగులకే కట్టడి చేస్తే బ్యాటర్లు మాత్రం నిరాశపరిచారు. రెండో టీ20లో అద్భుతంగా ఆడిన ఇషాన్‌ కిషన్‌ (10)తోపాటు రిషభ్‌ పంత్ (11), సూర్యకుమార్‌ యాదవ్‌ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో భారత్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే మరోవైపు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (30 నాటౌట్: 18 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. దీంతో 9 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం రావడం టీమ్‌ఇండియాకి కలిసొచ్చింది. డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం 76 పరుగులు చేస్తే విజయం.. 75 చేస్తే టైగా ముగుస్తుంది. భారత్‌ సరిగ్గా 75 చేయడంతో ఓటమి నుంచి తప్పించుకొంది. కివీస్‌ బౌలర్లలో సౌథీ 2.. మిల్నే, ఐష్ సోధి చెరో వికెట్‌ తీశారు.

రెండు జట్లలోనూ ఇద్దరే.. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే ఈ ఇన్నింగ్స్​లో భారత బౌలర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌ (4/37), సిరాజ్ (4/17) విజృంభించడంతో కివీస్‌ 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ డెవాన్ కాన్వే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అతడికి గ్లెన్ ఫిలిప్స్ సహకారం అందించాడు. అయితే వీళ్లిద్దరూ మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో కివీస్ పూర్తి ఓవర్లు ఆడకుండానే వెనుదిరిగింది. అయితే కాన్వే, ఫిలిప్స్ కారణంగా న్యూజిలాండ్‌ గౌర‌వప్రదమైన స్కోర్ చేయగలిగింది. నిజానికి భారీ స్కోరు దిశ‌గా వెళ్తున్న కివీస్‌ను భార‌త బౌల‌ర్లు అడ్డుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ చెరో 4 వికెట్లతో చెలరేగారు. భువనేశ్వర్‌కు వికెట్లు ఏమీ దక్కలేదు. హర్షల్ పటేల్ ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు.

ఇదే తొలిసారి.. మొత్తంగా మూడోసారి.. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆగిపోయి టైగా ముగియడం భారత టీ20 చరిత్రలో ఇదే తొలిసారి. అయితే అంతర్జాతీయంగా మాత్రం మూడో మ్యాచ్‌ కావడం గమనార్హం. గతేడాది (2021) నెదర్లాండ్స్-మలేషియా... మాల్టా-మార్సా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు ఇలా టైగా ముగిశాయి.

ఇదీ చూడండి: ఆ జట్టును బురిడీ కొట్టించి.. ఫిఫా చరిత్రలోనే గ్రేటెస్ట్​గా నిలిచిన​ గోల్​ ఇదే!

Last Updated :Nov 22, 2022, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.