''మధ్వాల్'​ సీఎస్​కేలో ఉంటే క్రెడిట్ అంతా ధోనీకే.. కానీ రోహిత్​కు మాత్రం..'

author img

By

Published : May 26, 2023, 10:43 AM IST

rohit and dhoni

ధోనీ, రోహిత్ కెప్టెన్సీలను పోలుస్తూ టీమ్​ఇండియా మాజీ ప్లేయర్​ సునీల్​ గావస్కర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ ఏ పని చేసినా ఆకాశానికెత్తుతారని, అదే రోహిత్ చేస్తే మాత్రం ఎవరూ పట్టించుకోరని గావస్కర్ వ్యాఖ్యనించాడు. ఇంకా ఏం అన్నాడంటే?

Gavaskar on Rohit Sharma: ఐపీఎల్ సీజన్​ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో టీమ్ఇండియా క్రికెట్​ దిగ్గజం సునీల్ గావస్కర్ సంచలన కామెంట్స్ చేశాడు. ధోనీ, రోహిత్ కెప్టెన్సీలను పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు. 'ధోనీ ఏ పని చేసినా ఆకాశానికెత్తుతారని, అదే రోహిత్ చేస్తే మాత్రం ఎవరూ పట్టించుకోరు' అని అభిప్రాయపడ్డాడు. లఖ్​నవూ- ముంబయి మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే ఈ విషయం స్పష్టంగా అర్థమైందని వ్యాఖ్యానించాడు. ఓ ప్రముఖ న్యూస్​ ఛానెల్​కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఇలా సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు.

'ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ముంబయి సారథిగా ఐదు టైటిళ్లు గెలిచినప్పటికీ అతడి కెప్టెన్సీకి తగిన గుర్తింపు దక్కడం లేదు. లఖ్​నవూతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్​ దీనికి పెద్ద ఉదాహరణ. ముంబయి పేసర్ ఆకాశ్ మధ్వాల్ ఓవర్ ద వికెట్ బౌలింగ్‌ చేసి ఆయుశ్​ బదోనిని ఔట్ చేశాడు. లెఫ్టాండ్ బ్యాటర్​ నికోలస్ పూరన్ రాగానే రౌండ్ ద వికెట్ బౌలింగ్‌ చేసి అతడి వికెట్​ను తీశాడు. చాలా మంది బౌలర్లు ఇలా తమ బౌలింగ్ ఎండ్‌ను మార్చరు. ఓవర్ వికెట్ రిథమ్ దొరికితే లెఫ్టాండర్ బ్యాటింగ్ వచ్చినా కూడా అదే ఎండ్‌లో బౌలింగ్‌ను కొనసాగిస్తారు. లెఫ్టాండర్‌కు ఆఫ్ ద వికెట్‌కు దూరంగా వెళ్లేలా బంతులు వేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇక్కడ మధ్వాల్.. రోహిత్ సూచనలతో తన ఎండ్‌ను మార్చుకొని వికెట్ తీసాడు. ఇదే ధోనీ కెప్టెన్సీలో జరిగి ఉంటే ప్రతి ఒక్కరూ పూరన్‌ను.. ధోనీయే ఔట్ చేశాడని మాట్లాడుకునేవారు. ఒక రకమైన హైప్ క్రియేట్ చేసేవారు. రోహిత్ శర్మ తన బౌలర్లను తెలివిగా ఉపయోగించుకుంటున్నప్పటికీ.. ధోనీలాగా అతడికి క్రెడిట్ ఇవ్వడం లేదు. రోహిత్ శర్మ కూడా ఈ క్రెడిట్ తనదేనని చెప్పుకోవట్లేదు. ఐదు వికెట్లు తీసిన మధ్వాల్‌కే గుర్తింపు దక్కాలనుకున్నాడు.' అని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.

నెహాల్ వధేరాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకోవడం అనేది కూడా కూడా రోహిత్ ఘనతేనని అన్నాడు గావస్కర్​. సహజంగా ముందుగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బ్యాటర్లను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకోరని.. కానీ రోహిత్ వ్యూహాత్మకంగా అతన్ని బరిలోకి దించి ఫలితాన్ని రాబట్టాడని పేర్కొన్నాడు. రోహిత్​ కెప్టెన్సీ నిర్ణయాలు కూడా బాగున్నాయి.. దానికి కూడా అతడికి క్రెడిట్ ఇవ్వండని గావస్కర్ వ్యాఖ్యానించాడు.

కాగా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లఖ్​నవూను 81 పరుగులతో చిత్తుగా ఓడించిన ముంబయి.. శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగే క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్స్​లో చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీకి సిద్ధం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.