IPL 2023 : పంజాబ్ X​ రాజస్థాన్.. గెలిచి నిలిచిన రాజస్థాన్.. పంజాబ్ ఔట్​

author img

By

Published : May 19, 2023, 10:57 PM IST

Updated : May 20, 2023, 6:56 AM IST

Punjab kings vs Rajasthan royals

IPL 2023 PBKS Vs RR :ఐపీఎల్ 16వ సీజన్​లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలకమైన మ్యాచ్​ జరిగింది. ఈ మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​.. 4 వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్​ రేసులో నిలిచింది.

IPL 2023 PBKS Vs RR : ఐపీఎల్ 16వ సీజన్​లో భాగంగా పంజాబ్​ కింగ్స్​, రాజస్థాన్​ రాయల్స్​ మధ్య కీలకమైన మ్యాచ్​ ఉత్కంఠగా సాగింది. పంజాబ్‌తో జరిగిన కీలక పోరులో రాజస్థాన్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి ఛేదించింది. ఇక 14 మ్యాచులు ఆడిన పంజాబ్‌ 6 విజయాలు, 8 ఓటములతో ఈ సీజన్​ను ముగించింది. అటు రాజస్థాన్‌ 14 మ్యాచుల్లో 7 ఓటములు, 7 విజయాలతో 14 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో నిలిచి.. ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. రాజస్థాన్ ప్లే ఆఫ్స్​ రేసులో ఉన్నప్పటికీ.. బెంగళూరు, ముంబయి తమ చివరి మ్యాచ్​లో ఓడితేనే ప్లేఆఫ్స్‌లోని నాలుగో బెర్తును ఖరారు చేసుకొనే అవకాశం ఉంది. బాధ్యతాయుత ఇన్నింగ్స్​తో హాఫ్ సెంచరీ సాధించిన దేవదత్‌ పడిక్కల్‌కు 'ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

ఛేదనలో రాజస్థాన్​..
డేంజరస్ ఓపెనర్ జోస్ బట్లర్ (0) మరోసారి డకౌట్​గా వెనుదిరిగాడు. అయినప్పటికీ.. ఆ ప్రభావం రాజస్థాన్‌ ఛేదనపై పడలేదంటే దానికి కారణం యశస్వి జైస్వాల్ (50), దేవదత్‌ పడిక్కల్‌ (51). వీరిద్దరూ అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. ఈ జోడి రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించింది. అయితే, పడిక్కల్‌తోపాటు సంజూ శాంసన్ (2) పెవిలియన్‌కు చేరడంతో ఇబ్బంది పడినట్లు అనిపించింది. కానీ, యశస్వితో కలిసి హెట్​మయర్‌ (46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

19వ ఓవర్‌లో హెట్​మయర్‌ ఇచ్చిన క్యాచ్‌ను శిఖర్ ధావన్‌ అద్భుతంగా ఒడిసి పట్టాడు. అప్పటికే పంజాబ్‌కు చేయాల్సిన నష్టం చేసేశాడు హెట్​మయర్‌. ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం కాగా.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన ధ్రువ్‌ జురెల్‌ (10 నాటౌట్​) సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. పంజాబ్​ బౌలర్లలో రబాడా 2, సామ్​ కరన్, అర్షదీప్, ఎలిస్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. మొదటి ఓవర్లోనే ప్రభ్​సిమ్రన్​ సింగ్​ను బౌల్ట్​ పెవిలియన్ చేర్చాడు. తర్వాత కెప్టెన్ ధావన్​(17) జంపా ఔట్​చేయగా.. అథర్వ(19)ను నవదీప్ సైనీ వెనక్కి పంపాడు. మరోవైపు సైనీ బౌలింగ్​లో, లివింగ్​స్టన్(9) క్లీన్​ బౌల్డయ్యాడు. దీంతో 6.3 ఓవర్లకు పంజాబ్ 50-4 తో కష్టాల్లో పడింది.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జితేశ్​ శర్మ(44)తో కలిసి సామ్​కరన్(49) రాజస్థాన్​కు మరో ఛాన్స్ ఇవ్వలేదు. వీరిద్దరూ ఐదో వికెట్​కు 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫామ్​లో జితేశ్​ను సైనీ ఔట్​చేయగా.. చివర్లో షారుక్​ ఖాన్ (23 బంతుల్లో 41: 4x4, 2x6 )తో ధనాధన్​ ఇన్నింగ్స్​ వల్ల పంజాబ్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో నవదీప్ సైనీ 3, బౌల్ట్​, జంపా తలో వికెట్ పడగొట్టారు.

Last Updated :May 20, 2023, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.