IND VS NZ: మూడో వన్డేలో వారికి ఛాన్స్​.. గెలిస్తే ఇక అగ్రస్థానం మనకే!

author img

By

Published : Jan 23, 2023, 5:14 PM IST

IND VS NZ third ODI match preview

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంపై కన్నేసిన భారత్‌.. న్యూజిలాండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌ను గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే సిరీస్‌ను ఒడిసిపట్టిన రోహిత్‌ సేన ఆఖరి వన్డేలో నెగ్గి క్వీన్‌స్వీప్‌ చేయాలని కోరుకుంటోంది. చివరి మ్యాచ్‌లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని భారత్‌ యోచిస్తోంది. అటుచివరి వన్డేలోనైనా గెలిచి తర్వాతి టీ20 సిరీస్‌కు ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని పర్యాటక జట్టు కివీస్ ఆరాటపడుతోంది. ఇందౌర్ వేదికగా మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఆ మ్యాచ్​ సంగతులు..

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంపై భారత్‌ గురిపెట్టింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌ను 2-0తో నెగ్గిన టీమ్​ఇండియా చివరి మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేస్తే నంబర్‌-1గా నిలవనుంది. ఈ సిరీస్‌కు ముందు వన్డేల్లో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ సిరీస్‌ కోల్పోవడంతో రెండో ర్యాంక్‌కు పడిపోయింది. దీంతో రెండోస్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌ అగ్రస్థానానికి చేరింది. సిరీస్‌కు ముందు ఐదో స్థానంలో ఉన్న భారత్‌ 2 విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 113 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్​, న్యూజిలాండ్, భారత్‌ సమానంగా ఉన్నప్పటికీ... కొద్ది తేడాలో తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. దీంతో చివరి వన్డే గెలిస్తే భారత్‌ అగ్రస్థానంలోకి దూసుకెళ్లనుంది.

తొలి 2 వన్డేల్లో గెలిచి ఊపు మీద ఉన్న రోహిత్‌ సేన చివరి మ్యాచ్‌లో ప్రయోగాలు చేయాలని భావిస్తోంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ భీకర ఫామ్‌లో ఉండటం... రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీ సాధించడం భారత్‌కు సానుకూలాంశం. ఇక అంతకుముందు 4 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు చేసిన విరాట్‌ కోహ్లీ... కివీస్‌తో సిరీస్‌లో 2సార్లూ లెఫ్టార్మ్‌ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌కు దొరికిపోయాడు. ఈ ఏడాదే వన్డే ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో ఇలాంటి బలహీనతలను కోహ్లీ అధిగమించాలని జట్టు ఆశిస్తోంది. శ్రేయస్ అయ్యర్‌ గైర్హాజరీలో జట్టులోకి చేరిన సూర్యకుమార్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ను జట్టు కోరుకుంటోంది. తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్న ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాళ్లను ఆడించాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఐపీఎల్​తోపాటు దేశవాళిలో మంచి ప్రదర్శన చేసిన రజత్‌ పాటిదార్‌ వన్డే అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బౌలింగ్ విభాగంలో భారత స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్ మాలిక్‌, చాహల్‌కు తుది జట్టులో చోటు దక్కవచ్చు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 131 పరుగులకే 6 వికెట్లు కూల్చిన భారత బౌలర్లు ఆ తర్వాత లయ తప్పడంతో 300 పైచిలుకు స్కోరు నమోదైంది. తర్వాతి వన్డేలో అద్భుతంగా పుంజుకున్న బౌలర్లు 108 పరుగులకే కివీస్‌ను కట్టడి చేశారు. అటు రెగ్యులర్ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ లేకపోవడం కివీస్‌కు భారీ ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే సిరీస్‌ను చేజార్చుకున్న లాథమ్‌ సేన చివరి వన్డేలోనైనా గెలిచి తర్వాత జరిగే టీ20 సిరీస్‌కు ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని ఆరాటపడుతోంది. ఆ జట్టులోని టాప్ సిక్స్ బ్యాటర్లు... గత 30 ఇన్నింగ్స్‌లలో కేవలం 7సార్లు మాత్రమే 40.. అంతకంటే ఎక్కువ పరుగులు చేశారు. ఇక అరంగేట్ర బ్యాటర్ మైఖేల్ బ్రేస్‌వెల్... హైదరాబాద్‌లో విశ్వరూపం చూపించినా తర్వాతి మ్యాచ్‌లో తేలిపోయాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే ఇందౌర్‌ పిచ్‌పై బౌలర్లు చాలా కష్టపడాల్సి ఉంటుందని హోల్కర్‌ మైదాన వర్గాలు తెలిపారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టు ఇదే.. టీమ్​ఇండియా నుంచి ముగ్గురు.. ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.