క్లీన్​స్వీప్​​పై టీమ్​ఇండియా కన్ను.. ఆ ప్లేయర్స్​కు విశ్రాంతి

author img

By

Published : Oct 3, 2022, 1:51 PM IST

Updated : Oct 3, 2022, 5:25 PM IST

match preview

దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడో టీ20లోనూ గెలిచి సిరీస్​ను క్లీన్​స్వీన్​ చేయాలని భావిస్తోంది టీమ్​ఇండియా. ఈ మ్యాచ్​ కోసం జట్టులో పలు మార్పులు చేయాలని భావిస్తోంది.

సొంతగడ్డపై తొలిసారి దక్షిణాఫ్రికాపై సిరీస్‌ నెగ్గిన టీమిండియా ఇందోర్‌ వేదికగా జరిగే మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయాలని కోరుకుంటోంది. ఈ నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియా ఆడనున్న చివరి టీ20 మ్యాచ్‌ ఇదే. ఈ మ్యాచ్‌ కోసం కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని భారత్ భావిస్తోంది. 12 నెలలు క్రితం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్‌ దశకు చేరకుండానే వెనుదిరిగిన టీమిండియా ఈసారి మాత్రం టైటిల్‌పై కన్నేసింది.

టాప్‌-4 బ్యాట్స్‌మెన్‌ మంచి ఫామ్‌లో ఉండటం భారత జట్టుకు కలిసివచ్చే అంశం. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కేఎల్​ రాహుల్‌ కూడా స్ట్రయిక్‌రేటు మెరుగుపర్చుకుని గాడిలో పడ్డాడు. ఇక విరాట్‌కోహ్లీ ఆసియాకప్‌ నుంచి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఒక శతకం, మూడు అర్థశతకాలతో సత్తా చాటాడు. కోహ్లీ స్ట్రయిక్‌రేట్‌ 140కిపైనే ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇక భీకర ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు.

టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో ఈ నెల 23వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను భారత్‌ ఢీకొననుంది. అక్టోబర్‌ 6న టీమిండియా ఆస్ట్రేలియా వెళ్లనుంది. టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో మూడోటీ20కి విరాట్‌కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అతని స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో రిషభ్‌ పంత్‌కు ఇప్పటివరకు బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాకపోగా రెండో టీ20లో దినేష్‌ కార్తీక్‌ కేవలం 7 బంతులనే ఎదుర్కొన్నాడు. ఫినిషర్‌గా సత్తాచాటుతున్నాడు.

గాయం కారణంగా జస్‌ప్రీత్‌ బుమ్రా జట్టుకు దూరం కావడంతో టీమిండియాకు బౌలింగ్‌ కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంలో చివరి ఓవర్లలో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. టీ20 ప్రపంచకప్‌ రిజర్వ్‌ ప్లేయర్‌గా ఉన్న దీపక్‌ చాహర్‌ కొత్త బంతితో బాగానే రాణిస్తున్నాడు. ఇక అర్షదీప్‌ రెండో టీ20లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన హర్షల్ పటేల్‌ స్థాయికి తగ్గట్లుగా రాణించడం లేదు. స్పిన్నర్‌ అశ్విన్‌ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. బుమ్రా స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న మహమ్మద్‌ సిరాజ్ మూడో టీ20లో బరిలోకి దిగే అవకాశం ఉంది.

మరోవైపు సిరీస్‌ కోల్పోయినా దక్షిణాఫ్రికా జట్టు రెండో టీ20లో బ్యాటింగ్‌లో భళా అనిపించింది. అజేయ సెంచరీతో డేవిడ్‌ మిల్లర్‌ సత్తా చాటగా డికాక్‌ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఐతే కెప్టెన్‌ తెంబా బవుమా పేలవ ఫామే సఫారీ జట్టును వేధిస్తోంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌ మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది.

ఇదీ చూడండి: Rohith: ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్​గా రికార్డ్​​.. గాయంతోనే ఆడి..

Last Updated :Oct 3, 2022, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.