'నా సినిమాలు ఆపండి.. చిత్రపరిశ్రమను కాదు'

author img

By

Published : Sep 25, 2021, 9:54 PM IST

Updated : Sep 26, 2021, 2:12 PM IST

Pawan

'చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త' అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు, హీరో పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటే నాకు బాధేస్తుందని అన్నారు.

'ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు ఆపేసి లక్షల మంది పొట్టగొడుతున్నారు. పవన్‌కల్యాణ్‌ సినిమాను ఆపేసినా, అతనొచ్చిన చిత్ర పరిశ్రమను ఆపేసినా అందరూ భయపడిపోయి.. తమ దగ్గరికొస్తారని వైకాపా నాయకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త' అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు, హీరో పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు.

చిత్రపరిశ్రమ నుంచి వచ్చిన సంపదను బ్యాంకుల్లో చూపించి, అప్పులు తెచ్చుకోవాలనే.. సినిమా టికెట్లపై పెత్తనం చెలాయించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. సీనియర్‌ నటుడు మోహన్‌బాబు సహా పరిశ్రమలో ప్రతి ఒక్కరూ స్పందించి, జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలని అన్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'రిపబ్లిక్‌' సినిమా ముందస్తు విడుదల వేడుకకు పవన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ఇలా సాగింది..

జనసేన పార్టీ అధ్యక్షుడు, హీరో పవన్‌కల్యాణ్‌ స్పీచ్

కనికరం చూపాలి

"సాయితేజ్‌ ప్రమాదానికి గురైతే చాలామంది సానుభూతి తెలిపారు. ఇదే సమయంలో మీడియాలో కొద్దిమంది నిర్లక్ష్యంగా వెళ్లాడని, ఎక్కువ వేగంతో వెళ్లాడని ప్రోగ్రామ్స్‌ చేశారు. అలా చేసే వ్యక్తులు కొంచెం కనికరం చూపించాలని కోరుతున్నా. ఇలాంటి కథనాల కంటే.. వై.ఎస్‌.వివేకానందరెడ్డి ఎందుకు హత్యకి గురయ్యారో మాట్లాడితే బాగుంటుంది. కోడి కత్తితో ఒక నాయకుడిని అంతర్జాతీయ విమానాశ్రయంలో పొడిచారు. అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ కూడా భారీ కుట్ర ఉందని చెప్పారు. అది ఏమైందని అడగండి. లక్షలాది ఎకరాల్లో గిరిజనులు పోడుభూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే అది వాళ్లకి దక్కడం లేదు. అదెందుకో దాని గురించి మాట్లాడండి. ఇడుపులపాయలో నేలమాళిగలో టన్నులకొద్దీ డబ్బులు ఉంటాయని చెబుతుంటారు. దానిపై కథలు నడపండి. పొలిటికల్‌ క్రైమ్‌ గురించి మాట్లాడండి. సినిమావాళ్ల గురించి కాదు."

-- పవన్ కల్యాణ్, జనసేన అధినేత

'తెదేపా అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్లు గురించి మాట్లాడి, వైకాపా వచ్చాక దాని గురించి ఎందుకు మాట్లాడలేదో అడగాలి. అవన్నీ వదిలేసి.. అందరూ సినిమా హీరోల మీద ఎందుకు మాట్లాడతారంటే వీళ్లని సులభంగా లక్ష్యం చేసుకోవచ్చనే.. పొలిటికల్‌ క్రైమ్‌ గురించి మాట్లాడండి' అన్నారు.

థియేటర్లు ఎక్కడ?

"భారతదేశపు రిపబ్లిక్‌ ఏ విలువలతో ఏర్పడిందో ఆ ఆశయాల కోసం నా వంతు కృషి చేస్తున్నా. ముఖ్యమంత్రి పదవి వస్తుందా? లేదా? అని కాదు, పోరాటం చేస్తున్నామా? లేదా? అనేది ముఖ్యం. అందరూ థియేటర్లలోనే సినిమా చూడండని చెబుతున్నారు. తెలంగాణలో సరే.. ఆంధ్రాలో థియేటర్లు ఎక్కడున్నాయి" అని ఆయన ప్రశ్నించారు. వైకాపా నాయకులు రాజ్యాంగాన్ని కాపాడతామంటూనే దాన్ని కూల్చేస్తున్నారని విమర్శించారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు, హీరో పవన్‌కల్యాణ్‌ స్పీచ్

'చిత్రపరిశ్రమ గురించి మాట్లాడితే బాధేస్తుంది'

"చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటే నాకు బాధేస్తుంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు కోట్లు తీసుకున్నారంటున్నారు. అది ఎవరినీ దోచింది కాదు, వాళ్ల కష్టంతో సంపాదించింది. మేము డబ్బు తీసుకుంటున్నామంటే తప్పుడు కాంట్రాక్టులతో సంపాదించలేదు. కింద పడి, మీద పడి, వెన్నెముకలు విరగ్గొట్టుకొని జనాలకి వినోదం అందించి సంపాదిస్తున్నాం. పైగా ప్రభుత్వానికి 45శాతం పన్ను కడుతున్నాం. మారుమూల ప్రాంతానికి చెందిన కళాకారుడు మొగిలయ్యని ఎవ్వరూ గుర్తించకపోతే.. గుర్తించి డబ్బు ఇచ్చాను. మీరు ఒక్కసారి ఎన్నికల్లో గెలిచి 30 ఏళ్లు ఉండాలనుకుంటారు. వ్యాపారాల్లో ఉన్నవాళ్లకి అలా ఉండదా? వాళ్లు థియేటర్లు కట్టుకుంటే తప్పా? మీరు ఇంకో పదిమందికి అవకాశం ఇవ్వండి. ఆర్థికంగా బలంగా లేనివారికి భూములిచ్చి ప్రోత్సహించండి. సంపద సృష్టించకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సంపద సృష్టి లేకపోతే మొగిలయ్యకు, కరోనా నిధికి, సైనిక నిధికి డబ్బు ఇవ్వగలనా?"

-- పవన్ కల్యాణ్, జనసేన అధినేత

అలా చేయటం బాధాకరం..

సాయితేజ్ ఇంకా కోమాలోనే ఉన్నారని, కళ్లు తెరవలేదని స్పష్టం చేశారు. అతివేగమే తేజ్‌ ప్రమాదానికి కారణమని ప్రచారం చేయటం బాధాకరమని అన్నారు. ఆటోను దాటే క్రమంలో ఇసుకపై జారిపడి సాయితేజ్ కిందపడ్డాడని వివరించారు. సినిమాలో చెప్పిన విలువలు నిజజీవితంలో అమలుచేయడం కష్టమన్నారు.

  • " 'వకీల్‌సాబ్‌' దిల్‌రాజు నాతో ఎందుకు చేశారు? నాతో ఆ సినిమా తీయకపోతే ఈపాటికే ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు విడుదలై ఉండేవి. ఇప్పటికైనా కావాలంటే నా సినిమాలను ఆపేయండి. మిగతా వారి సినిమాలను వదిలేయండి. పరిశ్రమలోని పెద్దలందరూ థియేటర్ల సమస్యపై మాట్లాడాలి. ప్రభుత్వాలను గట్టిగా ప్రశ్నించాలి. చిత్ర పరిశ్రమ చిన్నది అనుకుంటున్నారేమో! దీని బడ్జెట్‌ తక్కువేమో, ప్రభావం చాలా పెద్దది. వైకాపా నాయకులకు ఒకటే చెబుతున్నా. చిత్ర పరిశ్రమవైపు కన్నెత్తి చూడకండి. కాలిపోతారు జాగ్రత్త." అని హెచ్చారించారు పవన్.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " వైకాపా వాళ్లను అడిగితే రూల్స్‌ అంటారు. రూల్స్‌ ఉంటాయి.. కానీ అన్వయించే నైతికత నిబద్ధతను బట్టి ఉంటుంది. చిత్ర పరిశ్రమకు నా వంతుగా ఇంట్లో వ్యక్తిగా చెబుతున్నా. మీపై దాడి చేస్తున్నప్పుడు బలంగా మాట్లాడండి. చిరంజీవి గారు బతిమిలాడుకోవాల్సిన పనిలేదు. ఇప్పుడు నేను ఇలా గట్టిగా మాట్లాడితే ఇంకా ఇబ్బందులు పెడతారని కొందరు అన్నారు. ఏం చేస్తారో చూద్దాం. వాళ్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, న్యాయమూర్తులపైనే దాడి జరిపిన వాళ్లు.. వాళ్లకు పరిశ్రమ ఓ లెక్కకాదు.. అయినా మనం అడుగుదాం. పోరాడదాం" అని పవన్‌ అన్నారు.

సాయితేజ్​ ఆసుపత్రిలో ఉన్నందు వల్లే ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపిన పవన్ కల్యాణ్.. 'రిపబ్లిక్' సినిమా విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: కోలుకుంటున్న సాయి తేజ్​.. ఐసీయూలో పర్యవేక్షణ

Last Updated :Sep 26, 2021, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.