ఎవరైనా అడిగితే ఓటీపీ చెప్పేస్తున్నారా?.. అయితే జాగ్రత్త పడాల్సిందే!!

author img

By

Published : Oct 1, 2022, 4:05 PM IST

otp updates

డిజిటల్‌ చెల్లింపులు.. ఒక్క రూపాయిని ఎవరికైనా ఇవ్వాలన్నా.. ఇప్పుడు డిజిటల్‌లోనే బదిలీ చేసేస్తున్నారు. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ విధించినప్పుడు కొత్తగా ఎంతోమంది ఈ లావాదేవీలను నిర్వహించడం నేర్చుకున్నారు. అందరికీ ఆర్థిక సేవలను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతోపాటు, ఖాతాదారులకూ ఇది ఎంతో సౌకర్యంగా మారింది. ఎంత వేగంగా ఆర్థిక సేవలు డిజిటల్‌లోకి మారుతున్నాయో.. అదే సమయంలో మోసాలూ పెరిగాయి. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో సైబర్‌ నేరగాళ్లు ప్రజల కష్టార్జితాన్ని కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన డబ్బును కాపాడుకునేందుకు మనమూ దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాం..

ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు మనం ఒకటికి రెండుసార్లు ఆ మొత్తాన్ని లెక్కిస్తాం. బ్యాంకు శాఖకు వెళ్లి, నగదు జమ చేసేటప్పుడు మన ఖాతా సంఖ్య, ఇతర వివరాలు రాసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటాం. కానీ, చాలామంది డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించేటప్పుడు కనీస జాగ్రత్తలు మర్చిపోతుంటారు. మోసగాళ్లు తమ పనిని సులువుగా చేసేందుకు ఇవే కారణం అవుతున్నాయి. ఆర్‌బీఐ సైతం ఈ అంశాలపై ఎప్పటికప్పుడు ఖాతాదారులను అప్రమత్తం చేస్తూనే ఉంది. అయినప్పటికీ రోజూ ఎక్కడో ఒక చోట డబ్బులు పోగొట్టుకున్న కథనాలు మనం చూస్తూనే ఉన్నాం.

క్లిక్‌ చేసి.. వివరాలు ఇవ్వాలంటూ...
మోసం చేస్తున్నట్లు ఖాతాదారులు ఏమాత్రం గుర్తించని విధంగా మోసగాళ్లు సాంకేతికతను వినియోగించుకుంటారు. ముఖ్యంగా బ్యాంకు వెబ్‌సైట్లను పోలిన నకిలీ సైట్లను తయారు చేస్తారు. వాటి నుంచి మీకు ఇ-మెయిల్‌లో లింకులు పంపిస్తుంటారు. లేదా మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ చేస్తారు. ఒకటి రెండు వివరాలు అడిగి.. మన ఖాతాను మొత్తం వారి చేతుల్లోకి తీసుకుంటారు. బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ చెబుతారు. మీ పేరు.. కార్డులోని చివరి నాలుగు అంకెలు చెప్పేస్తారు. నిజమేనని నమ్మి వారు అడిగిన వివరాలు ఇచ్చేస్తారు.

  • మీ ఫోన్‌, సామాజిక వేదికల పాస్‌వర్డ్‌లు ఎవరికైనా చెబుతారా? అత్యంత రహస్యంగా భావిస్తారు కదా. మరి, బ్యాంకు ఖాతా వివరాలు అంతకన్నా సురక్షితంగా ఉంచుకోవాలి. బ్యాంకు ఖాతా, క్రెడిట్‌ కార్డు వివరాలు వాటి రహస్య సంఖ్యలు (పిన్‌), పాస్‌వర్డ్‌లు ఎవరికీ తెలియనీయొద్దు.
  • ఒకవేళ మీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డును కుటుంబంలో ఇతరులూ ఉపయోగిస్తుంటే.. తరచూ పాస్‌వర్డ్‌, పిన్‌ను మార్చేస్తుండాలి. వారికి అవసరం అయినప్పుడు మిమ్మల్ని అడగాలని చెప్పండి. బ్యాంకులు, ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు.. చెల్లింపుల సంస్థలు మీకు ఫోన్‌ చేసి, ఇ-మెయిల్‌ పంపి, వన్‌టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ)ని చెప్పాలని అడగవు. అడిగితే... మోసం అంతే,మరోమాటకు తావులేదు.

యాప్‌ల మాయలో పడొద్దు..
సామాజిక వేదికల్లో ప్రకటనలు కనిపిస్తూనే ఉంటాయి. చాలామంది వీటిపై నేరుగా క్లిక్‌ చేసేస్తుంటారు. ఇలా చేసినప్పుడు అసలు యాప్‌లను పోలిన నకిలీ యాప్‌లు ప్రత్యక్షం కావడంతోపాటు, నేరుగా మీ మొబైల్‌లోకి డౌన్‌లోడ్‌ అయిపోతాయి. అక్కడి నుంచి మీ మొబైల్‌, కంప్యూటర్లలోని సమాచారాన్ని మోసగాళ్లకు చేరవేస్తుంటాయి. కొన్నిసార్లు పూర్తిగా మొబైల్‌, కంప్యూటర్లను వారే స్వాధీనం చేసుకొని, మన సమాచారాన్ని తస్కరిస్తారు.మీరు ఒక ప్రకటన చూసినప్పుడు వెంటనే దాన్ని క్లిక్‌ చేయకుండా.. ఆ ప్రకటన ఇచ్చిన అసలు ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లోకి వెళ్లండి.

మీ మొబైల్‌లో యాప్‌ ఉన్నప్పటికీ డౌన్‌లోడ్‌ అడుగుతోంది అంటే అది మోసపూరిత యాప్‌. ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు దానిని తయారు చేసిందెవరు, డౌన్‌లోడ్లు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోండి. ఉదాహరణకు ప్రముఖ ఇ-కామర్స్‌ యాప్‌ల డౌన్‌లోడ్లు లక్షల్లో ఉంటాయి. అందుకు భిన్నంగా వందలు, వేలలో ఉన్నట్లు కనిపిస్తుంటే అనుమానించాల్సిందే. యాప్‌లు మీ వ్యక్తిగత సమాచారాన్ని అంటే మీ ఫోన్‌లో ఉన్న నెంబర్లు, ఫొటోలు, ఇతర వివరాలను ఎంత మేరకు వినియోగించుకుంటున్నాయన్నదీ చూసుకోవాలి. అవసరం లేని వాటికి అనుమతి నిరాకరించాలి.

క్యూఆర్‌ కోడ్‌తో..
మనం ఎవరికైనా డబ్బులు చెల్లించాలనుకోండి.. అప్పుడు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. కానీ, కోడ్‌ పంపించి, పిన్‌ నమోదు చేస్తే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పారంటే ఎక్కడో తేడా ఉన్నట్లే. యూపీఐ ఆధారిత యాప్‌ల ద్వారా మీకు డబ్బు పంపేందుకు మీ ఫోన్‌ నంబరు వారికి తెలిస్తే చాలు. అంతేకానీ, ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ అవసరం లేదు. ఎం-పిన్‌ను నమోదు చేయక్కర్లేదు.

స్నేహితుల ముసుగులో..
సామాజిక వేదికల్లో మనకు బాగా తెలిసిన వారి నుంచి అర్జంటుగా నగదు పంపాల్సిందిగా సమాచారం వస్తుంది. నిజంగా వారికి ఏమైందో అనే ఆందోళనతో డబ్బులు పంపించేస్తుంటారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాల సంఖ్య ఎంతో పెరిగింది.
మీకు బాగా తెలిసిన వారు డబ్బు కావాలంటే ఫోన్‌ చేసి అడుగుతారు. అంతేకానీ, చాటు మాటుగా సందేశాలను పంపించరు. నిజంగా వారికి ఏదైనా జరిగి ఉంటే ఆ సమాచారం మీకు తెలియకుండా ఉంటుందా? ఉన్నతాధికారుల నుంచి డబ్బు కావాలని మీకు సందేశం వచ్చే అవకాశం ఉందా? ఆలోచిస్తే చాలు. మీ డబ్బుకు రెక్కలు రావు.

లాటరీ విజేతలుగా..
లాటరీల్లో రూ. కోట్లు గెలుచుకున్నారనే వార్తలు ఇటీవల వింటున్నాం. ఉన్నంటుండి మనకూ ఇలాంటి లాటరీ వస్తే బాగుండు అని చాలామంది అనుకుంటూనే ఉంటారు. అలా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ దశలోనే మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎస్‌ఎంఎస్‌, ఇ-మెయిల్‌లో మీరు లాటరీ గెలిచారని సందేశాలు వచ్చేస్తాయి. మీరే అని ధ్రువీకరించుకునేందుకు మీ వ్యక్తిగత సమాచారం కావాలని అడుగుతారు. ఆ డబ్బు పొందాలంటే.. ముందుగా కొంత డబ్బు చెల్లించాలంటారు. బ్యాంకు ఖాతా, క్రెడిట్‌ కార్డు వివరాల్లాంటివన్నీ తెలుసుకుంటారు. ఇక ఆ తర్వాత చెప్పేదేముంది?
లాటరీ టిక్కెట్టును మీరు కొనకుండానే విజేతగా ఎలా నిలుస్తారు? ఈ ఒక్క సందేహం మీకు వస్తే చాలు. ఎవరూ మీకు ఉచితంగా డబ్బు ఇవ్వరు. లాటరీ తగిలిందని, ఆర్‌బీఐ నిబంధనల మేరకు కేవైసీ వివరాలు కావాలని అంటే నమ్మొద్దు. ప్రజల నుంచి ఆర్‌బీఐ ఎలాంటి వివరాలనూ తీసుకోదు.

దొంగ సేవా కేంద్రాలు..
బ్యాంకులు, బీమా సంస్థలు, ఆధార్‌.. తదితర సేవా కేంద్రాలకు సంబంధించిన ఫోన్‌ నంబర్లు, ఇ-మెయిల్‌ వివరాల కోసం సెర్చ్‌ ఇంజిన్లలో వెతుకుతుంటారు. కొన్నిసార్లు ఈ వివరాలు సరైనవి కాకపోవచ్చు. సైబర్‌ నేరగాళ్లు తమ నంబర్లను ఇక్కడ ప్రముఖంగా కనిపించేలా ఏర్పాటు చేస్తుంటారు. మనం నిజమేననుకొని, ఫోన్‌ చేస్తాం. బ్యాంకు/బీమా సంస్థ సేవా సంస్థే కదా అనుకొని, వారు అడిగిన వివరాలన్నీ ఇచ్చేస్తాం.
మీకు అవసరమైన ఫోన్‌ నంబర్లు, ఇ-మెయిల్‌ వివరాల కోసం బ్యాంకు/ బీమా సంస్థ అధీకృత వెబ్‌సైటు నుంచి తీసుకోండి. సెర్చ్‌ ఇంజిన్లలో కనిపించే నంబర్లకు నేరుగా ఫోన్‌ చేయొద్దు. ఇ-మెయిల్‌ పంపించకూడదు. బ్యాంకులో నమోదైన ఫోన్‌ నుంచి సేవా కేంద్రానికి ఫోన్‌ చేసినప్పుడు అక్కడ వారికి అన్ని వివరాలూ ప్రత్యక్షం అవుతాయి. మీరే ఫోన్‌ చేస్తున్నట్లు ధ్రువీకరించుకోవడానికి.. ఆన్‌లైన్‌ ఖాతా సమయంలో మీరు ఎంపిక చేసుకున్న ప్రశ్నలకు సమాధానాలు అడిగే అవకాశం ఉంది. అంతకుమించి అడగరు. ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంపరు.

ఇదీ చదవండి: 1జీ నుంచి 5జీకి ప్రయాణం.. డేటా వేగం కాకుండా ఇంకా ఏమైనా మారతాయా?

ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.5 లక్షల కోట్లు.. కాగ్​ నివేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.