5G in India: 5జీ వచ్చినా.. 4జీ పైనే మోజు!

author img

By

Published : Sep 7, 2021, 12:48 PM IST

5G in India

భారత్​లో 5జీ సేవలు ప్రారంభమైనా.. 4జీ సేవలకే వినియోగదారులు మొగ్గు చూపుతారని ఇంటర్నెట్ యాక్సెస్ పనితీరు విశ్లేషించే ఓక్లా సంస్థ తెలిపింది. ఈ ఏడాదిలో జరిగిన స్పెక్ట్రమ్ వేలం తర్వాత 4జీ నెట్​వర్క్ సేవలు మెరుగుపడ్డాయని పేర్కొంది. గతేడాది నాలుగో త్రైమాసికంతో పోల్చుకుంటే.. 2021 రెండో త్రైమాసికంలో 4జీ సేవల వినియోగం పెరిగిందని వెల్లడించింది.​

యావత్ దేశం 5జీ నెట్​వర్క్​ రాకపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే దిగ్గజ టెలికాం సంస్థలు ఎయిర్​టెల్​, జియో.. 5జీ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే 5జీ నెట్​వర్క్​ సేవలు అందుబాటులోకి వచ్చినా.. వినియోగదారులు '4జీ' సేవలనే ఎక్కువగా ఉపయోగిస్తారని ఇంటర్నెట్ యాక్సెస్ పనితీరును విశ్లేషించే ఓక్లా సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన స్పెక్ట్రమ్​ వేలం తర్వాత 4జీ సేవలు మెరుగుపడ్డాయని పేర్కొంది. 2020 నాలుగో త్రైమాసికంలో 93.5 శాతం ఉన్న 4జీ సేవల వినియోగం.. 2021 రెండో త్రైమాసికంలో 96 శాతానికి పెరిగినట్లు ఓక్లా తెలిపింది. ఫలితంగా 4జీ సేవల వినియోగానికే యూజర్స్​ ఆసక్తి చూపుతారని వెల్లడించింది.

వేగంలో పెరుగుదల

2020 తొలి త్రైమాసికంలో 10.64 ఎంబీపీఎస్​ ఉన్న ఇంటర్నెట్​ స్పీడు.. 2021 రెండో త్రైమాసికంలో 15.67 ఎంబీపీఎస్​కు పెరిగింది. దీంతో మొబైల్​ నెట్‌వర్క్​ డౌన్​లోడ్​ వేగంలో(జూలై 2021 నాటికి) భారత్​.. ప్రపంచంలోనే 122వ స్థానంలో ఉందని.. ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు, సీఈఓ డగ్​ షటిల్స్​​ తెలిపారు. దేశంలో 5జీ సేవలు ప్రారంభించినప్పటికీ మార్కెట్ చాలా స్థిరంగా, బలంగా ఉంటుందనడానికి ఇది ఒక సూచన అని అన్నారు.

"ప్రస్తుతం దేశంలో 4జీ ఆధిపత్యం చెలాయిస్తోంది. 5జీ సేవలు ప్రారంభమైనా.. 4జీ నెట్​వర్క్​ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన స్పెక్ట్రమ్ వేలం తర్వాత ఆపరేటర్లు తీసుకున్న చర్యలతో 4జీ సేవలు చాలా మెరుగుపడ్డాయి" అని షటిల్స్​ చెప్పారు.

అలాగే భవిష్యత్​లో 5జీ సేవలు మెరుగుపడతాయన్న అంశంపై కూడా మాట్లాడారు. మార్కెట్లో ఓపెన్​ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్​(ఓపెన్​ రాన్​), డైనమిక్ స్పెక్ట్రమ్​ షేరింగ్​(డీఎస్ఎస్​), అందుబాటులోని 5జీ హ్యాండ్‌సెట్‌ల ద్వారా 5జీ సేవలను వేగంగా విస్తరించే అవకాశముందని పేర్కొన్నారు.

5జీ ట్రయల్స్​ ముమ్మరం

కాగా ఇప్పటికే దేశంలో 5జీ ట్రయల్స్​ ప్రారంభమయ్యాయి. ఎయిర్​టెల్​, జియో సంస్థలు 5జీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. 5జీ నెట్​వర్క్​తో దేశంలోని తొలి క్లౌడ్-గేమింగ్​ సెషన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లో 4జీ నెట్‌వర్క్ ద్వారా 5జీ సేవలను విజయవంతంగా ప్రదర్శించింది ఎయిర్‌టెల్. మరోవైపు స్వదేశీ సాంకేతికతతో ముంబయిలో 5జీ ట్రయల్స్​ను ప్రారంభించింది జియో.

సమయం పడుతుంది!

జియో, ఎయిర్‌టెల్‌ వంటి మొబైల్‌ నెట్‌వర్క్‌ ప్రొవైడర్లు 5జీ సాంకేతికతపై ఉత్సుకతగా ఉన్నా.. ప్రభుత్వం ఇంకా అందుకు అవసరమైన స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించలేదు. అయితే 2022 నాటికి ప్రత్యేక యూజర్స్​ కోసం 5జీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొంది. దేశంలో అందరికీ 5జీ సేవలు అందుబాటులోకి రావాలంటే మరో ఐదారేళ్లు సమయం పడుతుందని టెలికాం వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.