అధికారాలు లేని పదవులు-ఉత్సవ విగ్రహాల్లా 'ప్రాదేశిక' సభ్యులు!

author img

By

Published : Oct 14, 2021, 7:59 AM IST

mptc, zptc members

ప్రభుత్వం విధులు, నిధులు, అధికారాలను అప్పగించకపోవడం వల్ల- ఎన్నికవుతున్న జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ (జడ్పీటీసీ) సభ్యులు, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) సభ్యులు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. తమకు గౌరవ వేతనాలు ప్రధానం కాదని, అభివృద్ధిలో కీలకం కావడానికి అధికారాలు, బాధ్యతలు, విధులు, నిధులు కట్టబెట్టాలని రెండు దశాబ్దాలుగా ప్రాదేశిక సభ్యులు పోరాటాలు చేస్తున్నా ఫలితం లేదు. గ్రామాల్లో ప్రగతిని ఉరకలెత్తించాలన్న వీరి ఆశలపై నిధులు, విధుల లేమి నీరు చల్లుతోంది.

గ్రామాల్లోని సమస్యలను సత్వరం గుర్తించి పల్లె ప్రగతిని పరుగెత్తించాలన్న సంకల్పంతో 'ప్రాదేశిక' వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం విధులు, నిధులు, అధికారాలను అప్పగించకపోవడంతో- ఎన్నికవుతున్న జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ (జడ్పీటీసీ) సభ్యులు, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) సభ్యులు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో 2019లో 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో 515 జడ్పీటీసీ, 7,219 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇటీవల కొత్త సభ్యులు కొలువుతీరారు. గ్రామాల్లో ప్రగతిని ఉరకలెత్తించాలన్న వీరి ఆశలపై నిధులు, విధుల లేమి నీరు చల్లుతోంది.

సలహాలు, సూచనలకే పరిమితం...

మండలంలోని ఎంపీటీసీ సభ్యుల్లో ఒకరు మండల ప్రజాపరిషత్తు అధ్యక్షుడి(ఎంపీపీ)గా, మరొకరు వైస్‌ ఎంపీపీగా, జిల్లాలోని జడ్పీటీసీ సభ్యుల్లో ఒకరు జిల్లా ప్రజాపరిషత్తు (జడ్పీ) అధ్యక్షుడిగా, మరొకరు ఉపాధ్యక్షుడిగా ఎన్నికవుతారు. మండల, జిల్లా పరిషత్తుల సర్వసభ్య సమావేశాల నిర్వహణకు ఆయా సభ్యులు కీలకం. సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు, నిధుల మంజూరుకు సభ్యుల ఆమోదం తప్పనిసరి. అంతకుమించి ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎలాంటి అధికారాలు లేవు. సర్వసభ్య సమావేశాలకు వరసగా మూడుసార్లు హాజరుకాకపోతే పదవిని సైతం కోల్పోతారు. అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేకంగా నిధులు ఏమీ లేవు. పలు ప్రాంతాల్లో 15వ ఆర్థిక సంఘం మంజూరు చేసే కొన్ని నిధులను మాత్రమే జడ్పీటీసీలకు కేటాయిస్తున్నారు. వెనకబడిన ప్రాంతాల సాధారణ నిధి(బీఆర్‌జీఎఫ్‌) కింద జడ్పీటీసీలకు గతంలో కేంద్రం నిధులు మంజూరు చేసేది. 2015 నుంచి వాటిని కేటాయించడంలేదు. ఫలితంగా గ్రామాల్లో తాము అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేకపోతున్నామని, నిధుల వినియోగం, చెక్కులపై సంతకాలు చేసే అధికారానికీ నోచుకోవడంలేదని ప్రాదేశిక సభ్యులు పెదవి విరుస్తున్నారు.

ఇప్పటికీ ప్రత్యేక గది, కుర్చీ లేవు...

గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్తు సర్వసభ్య సమావేశానికి జడ్పీటీసీ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు మాత్రమే. ఆయా పాలకవర్గాల్లో వీరు అధికారాలు ఉన్న శాశ్వత సభ్యులు కాదు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఉత్సవాలకు వీరు కేవలం ఆహ్వానితులే. గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు కార్యాలయాల్లో ఆయా సభ్యులకు ఇప్పటికీ ప్రత్యేక గది, కుర్చీ లేవు. గ్రామస్థాయి సమావేశాలకు ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి సమావేశాలకు జడ్పీటీసీ సభ్యులు హాజరవ్వచ్చు. అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనలు అందించవచ్చు. అవసరమైన నిధుల కోసం ప్రతిపాదించే, సమస్యలను ప్రస్తావించే అవకాశమూ ఉంది. అభివృద్ధి పనుల్లో అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై ప్రశ్నలూ సంధించవచ్చు. పాఠశాలలను సందర్శిస్తూ, సమావేశాలకు హాజరవుతూ వసతులు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు సూచనలు ఇవ్వవచ్చు. కొన్ని కమిటీల్లో సభ్యులుగా ఉండి వాటికి సలహాలు, సూచనలు అందించవచ్చు. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఉండదు. ప్రాదేశిక స్థానాల ఎన్నికలకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు అధికారాలు, విధులు, నిధులు కేటాయించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మొదట్లో ఎంపీటీసీలకు రూ.750, జడ్పీటీసీలకు రూ.2,250 చొప్పున ప్రతి నెలా గౌరవ వేతనం ఉండేది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఎంపీటీసీ సభ్యులకు రూ.6,500, జడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీలకు రూ.13,000 చొప్పున గౌరవ వేతనాన్ని పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ సభ్యులకు ఆరు వేల రూపాయలు, ఎంపీటీసీ సభ్యులకు మూడు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారు. తమకు గౌరవ వేతనాలు ప్రధానం కాదని, అభివృద్ధిలో కీలకం కావడానికి అధికారాలు, బాధ్యతలు, విధులు, నిధులు కట్టబెట్టాలని రెండు దశాబ్దాలుగా ప్రాదేశిక సభ్యులు పోరాటాలు చేస్తున్నా ఫలితం లేదు.

ప్రత్యేక నిధులు

గ్రామపంచాయతీల్లో తమ పేరిట నామఫలకం, కుర్చీ ఏర్పాటు చేయాలని ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్తు కార్యాలయాల్లో తమకు ప్రత్యేక గది కేటాయించాలని జడ్పీటీసీ సభ్యులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. ఏదో ఒక చోట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని కల్పించాలని, కొన్ని కమిటీలకు అధ్యక్షులుగా నియమించాలని వేడుకుంటున్నారు. కేవలం ఎంపీటీసీ సభ్యులే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా రాష్ట్ర బడ్జెట్‌లో రూ.500 కోట్లను కేటాయిస్తామని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గ్రామాల్లో సర్పంచులకు ఉన్న కొన్ని అధికారాలను విభజించి ఎంపీటీసీలకు కేటాయించాలన్న ప్రతిపాదనలూ ఆచరణకు నోచుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ప్రాదేశిక సభ్యులకు పాలనలో అధికారాలు, బాధ్యతలు, విధులు కట్టబెట్టాలి. గ్రామాలు, మండలాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. అభివృద్ధిలో సంపూర్ణంగా భాగస్వాములను చేస్తూ వారి సేవలను వినియోగించుకుంటేనే ప్రజాసమస్యలు సత్వరం పరిష్కారానికి నోచుకుంటాయి.

- ఏలేటి ప్రభాకర్‌రెడ్డి

ఇదీ చూడండి: స్థానిక సంస్థలకు రూ.581 కోట్లు

ఇదీ చూడండి: సమాచార హక్కు చట్టానికి సంకెళ్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.