పదునెక్కుతున్న విపక్ష గళం- లఖింపుర్‌ ఘటనపై ఆగ్రహావేశాలు

author img

By

Published : Oct 12, 2021, 7:11 AM IST

Opposition leaders

ఆందోళన చేస్తున్న రైతుల మీదకు వాహనం దూసుకువెళ్ళడం, తదనంతర పరిణామాల్లో తొమ్మిది మంది అసువులు బాయడంపై దేశవ్యాప్తంగా భిన్నవర్గాల్లో తీవ్ర నిరసన వెల్లువెత్తింది. చాలాకాలం తరవాత ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతిపక్షం మొత్తం సర్కారును తూర్పారపట్టింది. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఈ కేసులో ప్రధాన నిందితుడు కావడం, అతడి అరెస్టు విషయంలో మీనమేషాలు లెక్కపెట్టి- చిట్టచివరకు అరెస్టుచేయడం అందరినీ విస్మయపరుస్తున్న అంశం.

హత్రాస్‌లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం ఘటన తరవాత... యావద్దేశం దృష్టినీ ఆక ర్షించిన పెద్ద అంశం లఖింపుర్‌ ఖేరి ఉదంతమే. ఆందోళన చేస్తున్న రైతుల మీదకు వాహనం దూసుకు వెళ్ళడం, తదనంతర పరిణామాల్లో తొమ్మిది మంది అసువులు బాయడంపై దేశవ్యాప్తంగా భిన్నవర్గాల్లో తీవ్ర నిరసన వెల్లువెత్తింది. చాలాకాలం తరవాత ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతిపక్షం మొత్తం సర్కారును తూర్పారపట్టింది. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఈ కేసులో ప్రధాన నిందితుడు కావడం, అతడి అరెస్టు విషయంలో మీనమేషాలు లెక్కపెట్టి- చిట్టచివరకు అరెస్టుచేయడం అందరినీ విస్మయపరుస్తున్న అంశం. ఉదంతం చోటు చేసుకున్నప్పుడు... లఖింపుర్‌ ఖేరి బాధిత కుటుంబాలను పరామర్శించడానికి ప్రతిపక్ష నాయకులకు అనుమతి నిరాకరించడాన్నీ ప్రతి ఒక్కరూ తప్పుపట్టారు. చివరికి ఒత్తిడికి తలొగ్గిన సర్కారు, విపక్ష నేతలను అనుమతించింది. ఈ కేసులో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన తరవాతే ఆశిష్‌ మిశ్రా అరెస్టు జరగడం గమనార్హం.

యూపీ సర్కారు వ్యవహార శైలిపట్ల ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండి పడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌, భీమ్‌ ఆర్మీ నేతలూ లఖింపుర్‌ ఖేరిని సందర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌-భాజపా దేశంలో వ్యవస్థలన్నింటినీ హైజాక్‌ చేశాయంటూ ఆరోపించారు. పి.చిదంబరం, సచిన్‌పైలట్‌లాంటి అగ్రనేతలతో పాటు పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, ఇతర రాష్ట్రాల్లోని నాయకులు తమ తమ రాష్ట్రాల్లోనే ఈ ఘటనపై నిరసనలు మొదలుపెట్టారు. అయిదారు నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో భాజపా భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అనూహ్యంగా యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. విపక్షాల అనైక్యత, ఓట్ల చీలికలతో భాజపా మరోసారి అధికారంలోకి రావడం దాదాపు ఖాయమేనని అంతా అనుకున్నారు. అంతలో పరిస్థితి తలకిందులైంది. ప్రధానంగా హరియాణా, పంజాబ్‌, దిల్లీలలోనే తీవ్రంగా ఉన్న రైతుల ఆందోళన... లఖింపుర్‌ ఖేరి ఘటనతో ఒక్కసారిగా యూపీనీ కుదిపేసింది. ఈ ఘటనను జలియన్‌వాలాబాగ్‌ దురంతంతో పోలుస్తూ దీనిపై న్యాయవిచారణ జరిపించాలని ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ డిమాండ్‌ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రాను వెంటనే పదవి నుంచి తప్పించాలని, ఈ ఘటనకు ప్రధాని బాధ్యత తీసుకోవాలని ఆమ్‌ ఆద్మీపార్టీ నేత సంజయ్‌ సింగ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడు వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దుచేస్తేనే రైతులకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు ట్వీట్‌ చేస్తూ... లఖింపుర్‌ ఖేరి ఘటనను తీవ్రంగా ఖండించారు.

ఇప్పటికే దాదాపు విపక్షాలన్నీ లఖింపుర్‌ ఖేరి ఘటనపై పోరాడాలని నిర్ణయించాయి. ఈ ఐక్యతను శాసనసభ ఎన్నికల వరకు కాపాడుకోవాలని కాంగ్రెస్‌పార్టీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. ఒకేసారి రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఇద్దరూ యూపీకి వెళ్ళడం, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్యనేతలు సైతం యూపీని సందర్శించే ప్రయత్నం చేయడాన్ని బట్టి చూస్తే- ఆ పార్టీ ఈ విషయాన్ని ఆషామాషీగా తీసుకోవడం లేదని, దీన్ని ప్రధానాంశంగా చేసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రధాని మోదీ లఖ్‌నవూ వెళ్ళి కూడా ఈ ఘటన గురించి ఒక్కమాటా మాట్లాడకపోవడం, బాధితులను పరామర్శించకపోవడం ప్రతిపక్షాలకు మరింతగా కలిసివచ్చింది. రైతుల మీదకు కారు దూసుకెళ్ళిన వీడియోను భాజపాకే చెందిన మేనకాగాంధీ కుమారుడు వరుణ్‌ గాంధీ ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీంతో భాజపా పెద్దలు ఆగ్రహించి, తల్లీకొడుకులిద్దరినీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించారు. ఈ వేడి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కాషాయకూటమి నెగ్గుకురావడం కొంత కష్టమేనని చెప్పక తప్పదు. గత ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం వల్లే భాజపా భారీ విజయం సాధించగలిగింది. నిజానికి సమాజ్‌వాదీ, బహుజన సమాజ్‌, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే, ఫలితం వేరేవిధంగా ఉండేదన్న విషయాన్ని అఖిలేశ్‌ యాదవ్‌ ఆలస్యంగా గుర్తించారు. లఖింపుర్‌ ఖేరి ఉదంతంతో యూపీలో రైతులకు అండగా నిలిచిన విపక్షాలు- కేవలం ఎన్నికల ప్రయోజనాలకే పరిమితం కాకుండా వారికి న్యాయం జరిగేవరకు పోరాడతాయా అనేది ఆసక్తికర అంశం!

- కామేశ్‌

ఇదీ చూడండి: 'కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రాను బర్తరఫ్​ చేయాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.