సోషల్​ మీడియాలో ప్రధాన పార్టీల ప్రచార హోరు.. రసవత్తరంగా గుజరాత్​ ఎన్నికలు

author img

By

Published : Nov 18, 2022, 5:03 PM IST

gujarat election 2022

ఎన్నికలు అంటేనే ప్రచార హోరు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, పర్యటనలతో నేతలు కార్యకర్తలు తిరుగుతుంటారు. త్రిముఖ పోరు నెలకొన్న గుజరాత్‌లో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా అధికార భాజపా దూసుకెళ్తుండగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. కార్యకర్తలు, వాలంటీర్లతో క్షేత్రస్థాయి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా సొంత రాష్ట్రం గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఓ వైపు సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో నేతలు, పార్టీలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటుండగా.. సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌, ట్విటర్, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అధికారపార్టీ ప్రచారం చేస్తుండగా.. అవే వేదికలపై భాజపా సర్కార్‌ వైఫల్యాలను.. కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు ప్రజల వద్దకు చేరుస్తున్నాయి. ఓటర్లే లక్ష్యంగా అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, వాలంటీర్లు.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ముఖ్యంగా అధికార భాజపా ఫేస్‌బుక్, ట్విటర్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌పై ఆధారపడి ప్రచారం చేస్తోంది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీలు... వాట్సాప్‌లో తమ ప్రచారాన్ని క్షేత్రస్థాయి ఓటర్ల వరకు చేరేలా ఏర్పాట్లు చేసుకున్నాయి.

గత 2 దశాబ్దాలుగా భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయాలను 2001 నుంచి 2014 వరకు సీఎంగా మోదీ చేసిన అభివృద్ధిని ప్రచార అస్త్రాలుగా కమలదళం వాడుకుంటోంది. ముఖ్యంగా "గుజరాత్‌ను నేనే తయారుచేశాను" అనే సరికొత్త నినాదంతో గుజరాతీల సెంటిమెంట్‌ను కమలదళం ఉపయోగించుకుంటోంది. ప్రస్తుతం 5 రకాల ప్రచారాలను చేపట్టామని.. వచ్చే రోజుల్లో మరిన్ని ప్రారంభిస్తామని భాజపా సోషల్‌ మీడియా కో-ఇంఛార్జ్‌ మనన్‌ ధని పేర్కొన్నారు. ప్రజలకు కొత్తదనం కోసం ప్రతీ వారం సరికొత్తగా ప్రచారం చేస్తామని తెలిపారు. “20 ఏళ్ల నమ్మకం, 20 ఏళ్ల అభివృద్ధి" అనే నినాదంతో 6 నెలల క్రితమే ప్రచారం ప్రారంభించినట్లు వెల్లడించారు. వీటితోపాటు "మోదీ 20 ఏళ్ల బంగారుపాలన", "వందేభారత్", "భాజపా అంటే నమ్మకం" అనే నినాదాలతో ప్రజల్లోకి విస్తృతంగా భాజపా చొచ్చుకెళ్తోంది. కాషాయ పార్టీకి ఫేస్‌బుక్‌లో 35 లక్షలకుపైగా ఫాలోవర్లు... ఇన్‌స్టాగ్రామ్‌లో 57.8 లక్షల మంది, ట్విటర్‌లో 15 లక్షల మంది, యూట్యూబ్‌లో 45,600 మంది ఫాలోవర్లు ఉన్నారు. భాజపాకు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసేందుకు 20,000 కంటే ఎక్కువ మంది కార్యకర్తలు, 60,000 కంటే ఎక్కువమంది వాలంటీర్లు ఉన్నట్లు ధని తెలిపారు.

gujarat election 2022
భాజపా గుజరాత్​ ఫేస్​బుక్​ ఖాతా
gujarat election 2022
భాజపా గుజరాత్​ ట్విట్టర్ ఖాతా

కాంగ్రెస్‌ పార్టీ కూడా గుజరాతీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. గతంలో తమ ప్రభుత్వం గుజరాత్‌లో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తోంది. గత 27 ఏళ్లుగా గుజరాత్‌ అధికార పీఠంపై ఉన్న భాజపా ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి ఫేస్‌బుక్‌లో 7 లక్షలమంది ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 64.3 లక్షలమంది, ట్విట్టర్‌లో 1,64,000 మంది, యూట్యూబ్‌లో 8,91,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అసెంబ్లీ స్థానాలు, సామాజిక వర్గాల వారీగా సోషల్‌ మీడియా పేజీలు రూపొందించి.. సమస్యలు లేవనెత్తి ప్రత్యేక వ్యూహంతో ప్రచారం చేస్తున్నట్లు కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఛైర్మన్‌ కెయూర్ షా వెల్లడించారు. బూత్‌ స్థాయి, గ్రామస్థాయిలో 50,000 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసి ఠాకూర్లు, పాటిదార్లు, ఆదివాసీలను అందులో చేర్పించి ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ చేసిన పనులే తమను గెలిపిస్తాయని హస్తం శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. 12,000 మంది కార్యకర్తలు, వాలంటీర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

gujarat election 2022
గుజరాత్​ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతా
gujarat election 2022
గుజరాత్ కాంగ్రెస్​ ఫేస్​బుక్​ ఖాతా

ఇక ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీలనే ఆ పార్టీ ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. తమ ప్రచారాన్ని ఓటర్ల వద్దకు చేర్చేందుకు వాట్సాప్‌ను ఆప్‌ ఉపయోగించుకుంటోంది. తమ పార్టీ కళాశాల యువత, నిపుణులపైనే అధికంగా ఆధారపడినట్లు ఆప్‌ సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌ డాక్టర్‌ సఫిన్‌ హాసన్ తెలిపారు. కేజ్రీవాల్‌ నేతృత్వంలోని 25 మంది యువకులతో కూడిన బృందం సోషల్‌ మీడియా ప్రచారాలను పర్యవేక్షిస్తోంది. వీరితోపాటు 20,000 మంది సోషల్‌ మీడియా వారియర్స్ ఉన్నట్లు హాసన్ వెల్లడించారు. వేలాది వాట్సాప్‌ గ్రూప్‌లు రూపొందించి.. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎజెండా, పార్టీ విధానాలు, మేనిఫేస్టో, హామీలు, ఇతర కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నట్లు వివరించారు. ఇతర పార్టీల కంటే ఆప్‌ గుజరాత్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ ఫేస్‌బుక్‌ పేజీ చురుగ్గా ఉందని తెలిపారు. తమకు తక్కువ వనరులున్నాయని.. తాము అధికంగా వాలంటీర్లపై ఆధారపడినట్లు ఆప్‌ తెలిపింది. ఆప్‌నకు ఫేస్‌బుక్‌లో 5.67 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 1,17,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. గుజరాత్‌ రాష్ట్రానికి వేరుగా యూట్యూబ్‌ ఛానల్‌ లేదని... జాతీయంగా ఉన్న ఛానల్‌కు 42.3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నట్లు వెల్లడించారు.

gujarat election 2022
ఆప్​ గుజరాత్ ఇన్​స్టాగ్రామ్​ ఖాతా
gujarat election 2022
భాజపా గుజరాత్ ఇన్​స్టాగ్రామ్​ ఖాతా
gujarat election 2022
గుజరాత్​ కాంగ్రెస్​ ఇన్​స్టాగ్రామ్​ ఖాతా

ఇవీ చదవండి: భాజపాకు మోదీ.. మరి కాంగ్రెస్​, ఆప్​కు విజయ సారథులెవరు?

గుజరాత్​లో త్రిముఖ పోరు.. దళిత ఓటర్ల దయ ఎటువైపో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.