సమాచార హక్కు చట్టానికి సంకెళ్లు!

author img

By

Published : Oct 14, 2021, 5:24 AM IST

rti act

సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి ఒరటిన్నర దశాబ్దం పూర్తయినా.. కేంద్రం, రాష్ట్రాలు ఆ చట్టానికి ప్రాధాన్యం ఇచ్చిన సందర్భాలు తక్కువ అని నిపుణులు విమర్శిస్తున్నారు. పాలకుల అలక్ష్యం.. రాష్ట్రాల వారీగా సమాచార హక్కుకు సంకెళ్లు బిగిస్తోందని పేర్కొన్నారు.

ప్రధాన విధానాల రూపకల్పన, ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాల ప్రకటన సందర్భాల్లో ఆయా అంశాలకు సంబంధించిన అన్ని వాస్తవాలనూ అధికార యంత్రాంగం ప్రచురించాలి. సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టంలోని సెక్షన్‌4(1)(సి) ప్రకారం అందరూ దీన్ని అనుసరించి తీరాలి. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాలే లక్ష్యంగా; అక్రమార్కుల ఆటలు కట్టించగలిగే పాశుపతంగా సమాచార హక్కు చట్టం పురుడు పోసుకుని ఒకటిన్నర దశాబ్దాల కాలం దాటిపోయింది. ఇన్నేళ్లలో ఎన్నిసార్లు కేంద్రం, రాష్ట్రాలు ఆ నిబంధనకు పట్టంకట్టాయి? జనజీవితాలను పెనుకుదుపుల పాల్జేసే సర్కారీ నిర్ణయాలెన్నో వెలువడుతున్నా- సమాచార హక్కు చట్టం మౌలిక స్ఫూర్తి మాత్రం తరచూ కొల్లబోతూనే ఉంది! ఆ ఒక్కటి అనే కాదు- మొత్తం చట్టాన్నే చాపచుట్టి అటకెక్కించే దుర్విధానాలను ప్రభుత్వాలు ఆది నుంచీ నిష్ఠగా అమలుచేస్తున్నాయి. దరఖాస్తుదారులకు అండగా నిలవాల్సిన సమాచార సంఘాలు- నేతల అంతేవాసులు, విశ్రాంత అధికారులకు విడిది కేంద్రాలుగా కునారిల్లుతున్నాయి. ఆయా సంఘాలకు సకాలంలో సమర్థులైన కమిషనర్లను నియమించడంలో పాలకుల అలక్ష్యం- రాష్ట్రాల వారీగా సమాచార హక్కుకు సంకెళ్లు బిగిస్తోంది.

దేశవ్యాప్తంగా 26 సమాచార సంఘాల్లో గత జూన్‌ నెలాఖరు నాటికి 2.55 లక్షల అప్పీళ్లు, ఫిర్యాదులు పోగుపడినట్లు సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌ (ఎస్‌ఎన్‌ఎస్‌) పరిశీలనలో తేటతెల్లమైంది. పెండింగ్‌ కేసుల కొండలు కరగాలంటే ఏడాది నుంచి ఏడేళ్ల వరకు పడుతుందంటున్న అంచనాలు ఆందోళన పరుస్తున్నాయి. చట్టప్రకారం తప్పనిసరిగా ప్రచురించాల్సిన వార్షిక నివేదికలనూ ఏపీ, తెలంగాణ సహా 21 రాష్ట్రాల సంఘాలు కొన్నేళ్లుగా గాలికొదిలేశాయి. సమాచార హక్కు చట్టం ప్రభావాన్విత అమలుకు సమాచార కమిషన్ల సమర్థతే ప్రాణాధారమని సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితమే స్పష్టీకరించింది. నిబంధనలకు అనుగుణంగా తగిన సంఖ్యలో కమిషనర్లను కొలువుతీర్చాల్సిన అవసరాన్నీ అది గుర్తుచేసింది. ఆ మేరకు కర్తవ్యదీక్షలో ఏలికల బాధ్యతారాహిత్యం- పౌరుల భావప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగమైన సమాచార హక్కును కాలరాస్తూ, రాజ్యాంగ విలువలూ, ప్రమాణాలనే అపహాస్యం చేస్తోంది!

అధిక సంఖ్యలో ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు కావడం ప్రభుత్వ విజయం కాజాలదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లోగడ అభివర్ణించారు. యంత్రాంగమే స్వచ్ఛందంగా ప్రజలకు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని అందించాలని, ఆ మేరకు అన్ని చర్యలూ తీసుకుంటామని ఉద్ఘాటించారు. స్వచ్ఛంద సమాచార వెల్లడికి గొడుగుపట్టే సెక్షన్‌4(1)(బి) అమలు రాష్ట్రంలో అధ్వానమని గుజరాత్‌ సమాచార కమిషన్‌ వార్షిక నివేదిక తాజాగా కుండ బద్దలు కొట్టింది. తరతమ భేదాలతో అన్ని రాష్ట్రాల్లోనూ అదే దుస్థితి నెలకొంది! తత్ఫలితంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఏడాదికి 40 నుంచి 60 లక్షల ఆర్టీఐ దరఖాస్తులు పోటెత్తుతున్నాయి.

దశాబ్దాలుగా అధికార రహస్యాల చట్టంతో అంటకాగడానికి అలవాటుపడ్డ సర్కారీ సిబ్బంది- కొన్ని వినతులను అరకొర వివరాలతో సరిపెట్టేస్తున్నారు. మరికొన్నింటిని మొత్తానికే తిరగ్గొడుతున్నారు. సమాచారం అందజేయడానికి కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం నిరాకరిస్తున్న దరఖాస్తుల్లో సరైన కారణాలు లేకుండానే తిరస్కృతికి గురవుతున్న వాటి వాటా 40శాతమని ఇటీవల వెల్లడైంది. నిష్పూచీతనంతో చట్టాన్ని నిర్లజ్జగా ఉల్లంఘించే అధికారులకు జరిమానాలు విధించాల్సిన సమాచార సంఘాలు- సుమారు మూడు శాతం కేసుల్లోనే అలా కొరడాను ఝళిపిస్తున్నట్లు గతంలోనే వెలుగుచూసింది. 'పాలకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా నిలువరించగలిగే సామర్థ్యం ప్రజలందరికీ దక్కినప్పుడే స్వరాజ్యం వచ్చినట్లు' అని మహాత్ముడు ఏనాడో స్పష్టీకరించారు. జనావళికి ఆ శక్తియుక్తులను అందించగలిగేది స.హ.చట్టమే! సమాచార సంఘాలను పటిష్ఠీకరిస్తూ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రభుత్వాలు కట్టుబాటు చాటినప్పుడే- బాపూజీ అభిలషించిన 'స్వాతంత్య్రం' దేశానికి సిద్ధిస్తుంది!

ఇదీ చూడండి : 'ఆపరేషన్‌ మలబార్‌'తో చైనాకు భారత్‌ సవాల్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.