'యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?'.. చైనా సైనికులతో జిన్‌పింగ్‌ వీడియో కాన్ఫరెన్స్​

author img

By

Published : Jan 20, 2023, 10:25 PM IST

Updated : Jan 20, 2023, 10:38 PM IST

xi-jinping-asked-china-army-about-war-preparations-on-india-china-border

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై జిన్‌పింగ్‌ ఆరా తీశారు. లద్దాఖ్‌ సరిహద్దుల్లో సైనికుల యుద్ధ సన్నద్ధతను జిన్‌పింగ్‌ తనిఖీ చేసినట్లు చైనా మీడియా పేర్కొంది.

భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో డ్రాగన్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. లద్దాఖ్‌ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీతో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ చైనా సైనికుల యుద్ధ సన్నద్ధతపై ఆరా తీశారు. పీఎల్‌ఏ ప్రధాన కార్యాలయం నుంచి ఆర్మీ జవాన్లతో మాట్లాడిన జిన్‌పింగ్‌.. యుద్ధ సన్నద్ధతపై వారిని ప్రశ్నించినట్లు చైనా అధికార మీడియా వెల్లడించింది. సరిహద్దు పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు తెలిపింది. ఇటీవల కాలంలో సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, దానివల్ల ఆర్మీకి ఎదురవుతున్న సవాళ్లను అధ్యక్షుడు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

సరిహద్దు ప్రాంతాన్ని 24 గంటల పాటు కంటికి రెప్పలా కాపాడుతున్నామని, కట్టుదిట్టంగా భద్రతను పర్యవేక్షిస్తున్నామని ఆర్మీ జవాన్లు జిన్‌పింగ్‌కు చెప్పినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అత్యంత క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లను జిన్‌పింగ్‌ అభినందించారు. తాజా కూరగాయలు అందుతున్నాయో లేదోనని వాకబు చేశారు. వారందరినీ సరిహద్దు రక్షకులుగా అభివర్ణించిన ఆయన.. వారిలో నూతన ఉత్తేజం కలిగేలా మాట్లాడారు.సరిహద్దు వద్ద గస్తీ ఎలా కొనసాగుతోందో ఆరా తీశారు.

2020, మే 5న లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్‌ సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘటన చోటు చేసుకున్న తర్వాత ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య 17 సార్లు అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. కొన్ని చోట్ల బలగాలు ఉపసంహరణ జరిగినా మరికొన్ని ప్రాంతాల విషయంలో ప్రతిష్ఠంభన వీడలేదు. ఓ వైపు తమ బలగాలను వెనక్కి తీసుకుంటున్నామని డ్రాగన్‌ చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతత అవసరమని నొక్కి చెబుతూనే.. ప్రత్యర్థి ఎత్తుగడలను అంచనా వేస్తూ భారత్‌ కూడా తమ దళాలను మోహరిస్తోంది.

Last Updated :Jan 20, 2023, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.