అమ్మో.. అమెరికా బాంబర్... శత్రువులకు చుక్కలు చూపిస్తుంది!

author img

By

Published : Dec 4, 2022, 7:31 AM IST

US BOMBER SPECIALITY

కొన్నేళ్లుగా తెరచాటున అభివృద్ధి చేసిన అధునాతన ఆరో తరం స్టెల్త్‌ బాంబర్‌ విమానాన్ని తొలిసారిగా అమెరికా ప్రదర్శించింది. బి-21 రైడర్‌ అనే ఈ లోహవిహంగం.. ప్రపంచంలోనే తొలి 'డిజిటల్‌ బాంబర్‌'. ఈ యుద్ధ విమానంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది శత్రువుల చేతికి చిక్కదు! చైనాతో ఘర్షణలు జరిగితే ఇది తమకు పైచేయి సాధించిపెడుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ యుద్ధ విమానంలో ఉన్న మరిన్ని ప్రత్యేకతలు ఏంటంటే?

కొన్నేళ్లుగా తెరచాటున అభివృద్ధి చేసిన అధునాతన ఆరో తరం స్టెల్త్‌ బాంబర్‌ విమానాన్ని తొలిసారిగా అమెరికా ప్రదర్శించింది. చైనాతో ఘర్షణలు జరిగితే ఇది తమకు పైచేయి సాధించిపెడుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది. బి-21 రైడర్‌ అనే ఈ లోహవిహంగం.. ప్రపంచంలోనే తొలి 'డిజిటల్‌ బాంబర్‌'. కాలిఫోర్నియాలోని పామ్‌డేల్‌ వైమానిక దళ స్థావరంలో ఆయుధ దిగ్గజం నార్త్రాప్‌ గ్రుమన్‌ సంస్థ దీన్ని ఆవిష్కరించింది. నింగిలోని ఉపగ్రహాల కంట పడకుండా చూసేందుకు ఈ యుద్ధవిమానాన్ని హ్యాంగర్‌ నుంచి వెలుపలికి తీసుకురాలేదు.

US BOMBER SPECIALITY
అమెరికా అధునాతన యుద్ధ విమానం

ఎందుకీ బాంబర్‌?
కొన్నేళ్ల కిందటి వరకూ ఉగ్రవాదంపై పోరులో అమెరికా నిమగ్నమైంది. క్రమంగా తన దృష్టిని చైనా సైనిక ఆధునికీకరణపైకి మళ్లించింది. 2035 నాటికి 1500 అణ్వస్త్రాలను సమకూర్చుకునే విధంగా డ్రాగన్‌ దేశం అడుగులు వేస్తోంది. హైపర్‌సోనిక్స్‌, సైబర్‌ యుద్ధాలు, అంతరిక్ష రంగం వంటి అంశాల్లో అద్భుత పురోగతి సాధించింది. వీటివల్ల తన భద్రతా ప్రయోజనాలకు హాని కలుగుతుందని అమెరికా ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో సైనిక ఆధునికీకరణలో భాగంగా బి-21 రైడర్‌ ప్రాజెక్టును చేపట్టింది.
* అమెరికా అమ్ములపొదిలోని బి-1 లాన్సర్‌, బి-2 స్పిరిట్‌ బాంబర్ల స్థానంలో రైడర్లను ప్రవేశపెడతారు.

US BOMBER SPECIALITY
అమెరికా అధునాతన యుద్ధ విమానం

ఎప్పటికి సిద్ధం?
2023లో రైడర్‌ తొలిసారిగా ఆకాశయానం చేసే అవకాశం ఉంది. వర్చువల్‌ నమూనాను ఉపయోగించి దీని సామర్థ్యంపై పరీక్షలు సాగుతున్నాయి. రైడర్‌కు తోడు ఆరోతరం ఫైటర్‌ జెట్‌ తయారీకి రహస్యంగా 'నెక్స్ట్‌ జనరేషన్‌ ఎయిర్‌ డామినేషన్‌' కార్యక్రమాన్ని అమెరికా చేపట్టింది.

US BOMBER SPECIALITY
అమెరికా అధునాతన యుద్ధ విమానం

ఎన్నో ప్రత్యేకతలు..
కంప్యూటింగ్‌ సామర్థ్యం బాగా పెరిగినందువల్ల బి-21లో సాఫ్ట్‌వేర్‌పరంగా ఆధునిక హంగులు సాధ్యమయ్యాయి. డిజైన్‌, తయారీ, నిర్వహణకు సరికొత్త పరిజ్ఞానాలను ఉపయోగించారు. డిజిటల్‌ ఇంజినీరింగ్‌, మెరుగైన సాఫ్ట్‌వేర్‌, ఓపెన్‌ ఆర్కిటెక్చర్‌ ఈ యుద్ధవిమానం సొంతం. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఈ లోహవిహంగాన్ని సులువుగా ఆధునికీకరించొచ్చు. ఇందులో క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా, సెన్సర్లు, ఆయుధాలను అధునాతన రీతిలో అనుసంధానించారు. స్మార్ట్‌ ఫోన్ల తరహాలో దీని సాఫ్ట్‌వేర్లను అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా కొత్త ఆయుధ వ్యవస్థలను జోడించొచ్చు. ఈ నేపథ్యంలో రైడర్‌ను తొలి డిజిటల్‌ బాంబర్‌గా అభివర్ణిస్తున్నారు.

  • రైడర్‌ ఆకృతి అంతటా శక్తిమంతమైన సెన్సర్లు ఉన్నాయి. అవి శత్రువు గురించి నిరంతరం డేటాను అందిస్తుంటాయి. అందువల్ల ఈ యుద్ధవిమానం.. దాడులకే కాకుండా నిఘా సమాచార సేకరణకూ ఉపయోగపడుతుంది.
  • శత్రు దాడులను బి-21 చాలా సమర్థంగా ఎదుర్కోగలదు.
  • అవసరమైతే దీన్ని పైలట్‌రహితంగానూ నడపొచ్చు.

శత్రువుకు మస్కా..
బి-21 విమానం మొత్తం ఒక రెక్క ఆకారంలో ఉంది. దాని ఇంజిన్లు, ఆయుధాలను అంతర్గతంగా అమర్చారు. ఈ లోహవిహంగానికి ప్రత్యేక పూత వేశారు. రైడర్‌ నుంచి వెలువడే ఎలక్ట్రానిక్‌ సంకేతాలూ నియంత్రిత పద్ధతిలోనే ఉంటాయి. ఈ లక్షణాల కారణంగా శత్రువుకు బి-21 ఆచూకీ దొరకదు. ప్రత్యర్థి రాడార్‌ తెరలపై ఇది యుద్ధవిమానంలా కాకుండా మరేదో వస్తువులా కనిపిస్తుంది.

  • తమ దేశంలోకి యుద్ధ విమానాలు చొరబడకుండా చూసేందుకు శత్రువు మోహరించే యాంటీ యాక్సెస్‌, ఏరియా డినైల్‌ ఆయుధ వ్యవస్థలను బి-21 బోల్తా కొట్టించగలదు.
  • రష్యా ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ, చైనా జె-20 స్టెల్త్‌ యుద్ధవిమాన దాడులనూ తట్టుకొనేలా రైడర్‌ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
  • ఎలక్ట్రానిక్‌ దాడులను నిర్వహించగలదు.

బి-2 కన్నా చిన్నగా..
మునుపటి బి-2 బాంబర్‌ కన్నా బి-21 ఆకృతి చిన్నగా ఉంది. ఈ యుద్ధవిమానం ఏకబిగిన ప్రయాణించగలిగే దూరాన్ని పెంచేందుకు ఇలా చేశారు. 2001 అక్టోబరులో అఫ్గానిస్థాన్‌పై దాడుల కోసం బి-2 యుద్ధ విమానాల పైలట్లు నిరంతరాయంగా 44 గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చింది. చాలా పెద్దగా ఉండే ఈ లోహవిహంగాలు పట్టే హ్యాంగర్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా పరిమిత సంఖ్యలోనే ఉండటమే ఇందుకు కారణం. దీనికితోడు ఈ బాంబర్ల విండోలు తెరుచుకునే వీలు లేదు. అందువల్ల హ్యాంగర్లలో ఏసీ వ్యవస్థ తప్పనిసరి. లేకుంటే వేడి వల్ల కాక్‌పిట్‌లోని ఎలక్ట్రానిక్‌ సాధనాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

  • ఎన్ని?: 100 బి-21లను సమకూర్చు కోవాలని అమెరికా భావిస్తోంది.
  • ధర: ఒక్కొక్కటి 70 కోట్ల డాలర్లు (అంచనా)
  • బి-21 రూపకర్త: నార్త్రాప్‌ గ్రుమన్‌
  • గరిష్ఠ వేగం: గంటకు 900 కిలోమీటర్లు (సబ్‌సోనిక్‌)
  • ఇంజిన్లు: ప్రాట్‌ విట్నీ ఎఫ్‌135 టర్బో ఫ్యాన్‌ ఆయుధాలు
  • ఆయుధాలు
    • దీర్ఘశ్రేణి క్షిపణులు
    • సంప్రదాయ, అణు సామర్థ్య బి61 గ్రావిటీ బాంబులు
    • లేజర్‌ అస్త్రాలు

పేరు వెనుక..
పెర్ల్‌ హార్బర్‌ దాడికి ప్రతిగా 1942లో జపాన్‌ నగరాలపై అమెరికా యుద్ధవిమానాలతో విరుచుకుపడింది. 'డూలిటిల్‌ రైడ్‌' అనే ఆ ఆపరేషన్‌లో 80 మంది పాల్గొన్నారు. బి-25 మిచెల్‌ బాంబర్లలో దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి దాడులు చేశారు. ఆ యుద్ధవిమానాల ఇంధన సామర్థ్యం పరిమితమే. అందువల్ల దాడి అనంతరం బాంబర్లలో స్వదేశానికి చేరుకోలేమని తెలిసినా వారు ఈ సాహసానికి సిద్ధపడ్డారు. తిరుగుప్రయాణంలో వారు విమానాలను వదిలేసి పారాచూట్ల సాయంతో చైనా, సోవియట్‌ రష్యాలో దిగారు. అక్కడి ప్రజల తోడ్పాటుతో స్వదేశానికి తిరిగి వెళ్లారు. నాటి దాడులకు గుర్తుగా బి-21కు 'రైడర్‌' అని నామకరణం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.