ముగ్గురు శాస్త్రవేత్తలను వరించిన రసాయనశాస్త్ర నోబెల్.. ఆయనకు రెండోసారి

author img

By

Published : Oct 5, 2022, 3:25 PM IST

Updated : Oct 5, 2022, 4:49 PM IST

NOBEL PRIZE IN CHEMISTRY

రసాయనశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు.. ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. క్లిక్‌ కెమిస్ట్రీతోపాటు బయోఆర్థోగోనల్‌ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గానూ ఈ అవార్డు అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.

క్లిక్‌ కెమిస్ట్రీతోపాటు బయోఆర్థోగోనల్‌ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. ఈ మేరకు నోబెల్ కమిటీ ప్రకటించింది. కరోలిన్‌ ఆర్‌ బెర్టోజీ, మార్టెన్‌ మెల్డల్‌, కే బ్యారీ షార్ప్‌లెస్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది. ఔషధాలను డిజైన్ చేసేందుకు వీలుగా క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్థోగోనల్‌ కెమిస్ట్రీలో చేసిన కృషికి ప్రపంచ అత్యుత్తమ పురస్కారం అందించనున్నట్లు వెల్లడించింది.

క్యాన్సర్‌ నివారణ ఔషధాలను తయారు చేసేందుకు, డీఎన్‌ఏ మ్యాపింగ్‌కు, ప్రత్యేక ప్రయోజనాల కోసం పదార్థాలను సృష్టించేందుకు ముగ్గురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఉపకరిస్తోందని.. రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది. 55 ఏళ్ల కరోలిన్ బెర్టోజీ అమెరికా రసాయనశాస్త్ర పరిశోధకురాలు. ఆమె కాలిఫోర్నియాలోని.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో పనిచేస్తున్నారు. 68 ఏళ్ల మార్టెన్ మెల్డల్‌ డెన్మార్క్‌కు చెందిన రసాయనశాస్త్ర ఆచార్యులు. ఆయన కొపెన్‌హాగన్ వర్శిటీలో విధులు నిర్వహిస్తున్నారు. అమెరికాకు చెందిన కెే బ్యారీ షార్ప్‌లెస్‌.. వైద్యపరిశోధనలు చేసే స్క్రిప్స్‌ రీసెర్చ్‌లో పనిచేస్తున్నారు. 2001లో కూడా కెమిస్ట్రీ నోబెల్‌ను షార్ప్‌లెస్‌ అందుకున్నారు. నోబెల్‌ రెండోసారి అందుకోనున్న ఐదో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు.

NOBEL PRIZE IN CHEMISTRY
రసాయన శాస్త్రంలో నోబెల్​ విజేతలు

గతేడాది రసాయన శాస్త్రంలో నోబెల్‌ అవార్డుకు ఇద్దరు ఎంపికకాగా ఈసారి ముగ్గురు విజేతలుగా నిలిచారు. పరమాణువు నిర్మాణంలో నూతన విధానమైన ఆర్గానోక్యాటలసిస్‌ అభివృద్ధి చేసినందుకు గాను 2021లో బెంజిమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ మెక్‌మిల్లన్‌లకు ఈ అవార్డు దక్కింది. రసాయన శాస్త్రాన్ని పర్యావరణహితంగా మార్చిన ఆ విధానం మానవాళికి ఎంతో ఉపయుక్తంగా ఉందని సెలక్షన్‌ కమిటీ అభిప్రాయపడింది.

సోమవారం వైద్య రంగం, మంగళవారం భౌతిక శాస్త్రం నోబెల్ విజేత పేరును ప్రకటించారు. గురువారం సాహిత్య రంగంలో విజేత పేరు ప్రకటిస్తారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీన ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును వెల్లడిస్తారు.

స్వీడన్​కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వైద్య నోబెల్​కు ఎంపికయ్యారు. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు దక్కించుకున్నారు. మానవులకు అత్యంత సమీప జాతిగా భావించే నియాండెర్తల్స్, డెనిసోవాన్స్​ జీవుల జన్యువులు, ఆధునిక మానవుల జన్యువులను పోల్చుతూ చేసిన పరిశోధనకు పాబో నాయకత్వం వహించారు. రెండు జాతుల మధ్య కలయిక జరిగిందన్న విషయాన్ని ఈ పరిశోధన స్పష్టం చేసింది.

'పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్​'లో చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. ఈ మేరకు నోబెల్ కమిటీ ప్రకటించింది. అలైన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాజర్, ఆంటోన్ జెల్లింగర్​లను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపింది. ఫోటాన్‌లలో చిక్కుముడులు, బెల్‌ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో వీరు చేసిన అద్భుత ప్రయోగాలకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి వీరిని ఎంపిక చేసింది. అవార్డు గ్రహీతల్లో.. అలైన్‌ ఆస్పెక్ట్‌ది ఫ్రాన్స్‌కాగా, జాన్‌ ఎఫ్‌.క్లాజర్‌ అమెరికాలో, ఆంటోన్‌ జైలింగర్‌ ఆస్ట్రేలియాలో భౌతిక శాస్త్ర పరిశోధకులుగా పనిచేస్తున్నారు.

నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్‌ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.

Last Updated :Oct 5, 2022, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.