పిల్లల్ని ఎలా కనాలో నేర్పుతున్న పట్టణం.. ఎగబడి వెళ్తున్న జపాన్ జనం!

author img

By

Published : Mar 11, 2023, 1:14 PM IST

japan birth rate decline

గత కొన్నేళ్లుగా జపాన్​లో జననాల రేటు భారీ పడిపోతోంది. గత ఏడాది ఇది ఆల్ టైం కనిష్ఠానికి చేరుకుంది. మరికొన్నేళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే.. జపాన్​ తన ఉనికిని కోల్పోతుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా జపాన్​లో జననాల రేటు పడిపోతుంటే.. ఓ చిన్న పట్టణంలో మాత్రం ఇందుకు భిన్నంగా జననాల రేటు రెట్టింపు నమోదవుతోంది. దీంతో ఇక్కడి ప్రజలు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకునేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఈ పట్టణానికి చేరుకుంటున్నారు. మరి మనం కూడా ఆ ప్రాంతం విశేషాలు తెలుసుకుందామా..!

గత మూడు దశాబ్దాలుగా జపాన్​లో జనాభా భారీగా తగ్గిపోతోంది. గతేడాది జపాన్‌లో జననాల రేటు ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయాయి. మొదటిసారిగా 800,000 కంటే తక్కువ జననాలు నమోదయ్యాయి. అది అక్కడ మరణాల్లో దాదాపు సగం శాతం. మరికొన్నేళ్లు జపాన్​లో ఇదే పరిస్థితి కొనసాగితే.. తన ఉనికితో పాటుగా, జపాన్‌ అదృశ్యమవుతుందని ఆ దేశ ప్రధానమంత్రి సలహాదారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ దేశంలో ఉన్న ఓ చిన్న నగరంలో మాత్రం పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. దేశంలోని జననాల రేటుతో పోల్చితే ఈ పట్టణంలో జననాల రేటు రెండింతలు ఎక్కువగా ఉంది. దీనికి ఈ పట్టణ ప్రజలు అనుసరిస్తున్న విధానాలే కారణమని తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా జననాల రేటు పెంచేందుకు జపాన్​ ప్రభుత్వం రకరకాల విధానాలను అవలంబిస్తున్నా పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. అయితే 'నాగీ' అనే ఓ చిన్న పట్టణం మాత్రం తమ జనాభాను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. దాదాపు 6,000 మంది జనాభా కలిగిన ఈ ప్రాంతంలో.. దేశంలో కంటే రెండు రెట్లు అధిక జననాల రేటు నమోదవుతోంది. ఇక్కడ ఏ ఇంట్లో చూసినా ఇద్దరుముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు కనిపిస్తారు. దీంతో ఈ పట్టణం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. దేశ నలుమూల నుంచే కాకుండా విదేశీ పర్యటకులను కూడా ఈ నాగీ పట్టణం విపరీతంగా ఆకర్షిస్తోంది. తమ కుటుంబాలను చూడడానికి వచ్చే పర్యాటకుల వద్ద నుంచి ప్రత్యేక రుసుం కూడా వసూలు చేస్తుందీ నగరం.

తల్లులు అందరికీ తల్లులే..!

నాగీ ప్రాంతంలో ముగ్గురు లేదా నలుగురు పిల్లలతో ఉన్న కుటుంబాన్ని చూడడం సర్వసాధారణం. తమ కుటుంబ ఆదాయం తక్కువే అయినా సరే.. ఇక్కడి ప్రజలు పిల్లల్ని పెంచడం ఎప్పుడూ భారంగా భావించరు. 'తల్లులు అందరికీ తల్లులే' అనే భావనతో పిల్లలను చూసుకోవడంలో ఇరుగు పొరుగున ఉండే ఇతర తల్లులు, వృద్ధ మహిళలు సహాయం చేస్తుంటారు. వీరికి మన, పర అనే భేదాలు ఉండవు. ఇక్కడి డేకేర్ సెంటర్లు సైతం పిల్లల్ని కనడాన్ని ప్రోత్సహించే విధంగానే ఉంటాయి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబంలో అయితే.. వారి మొదటి బిడ్డను చూసుకునే డేకేర్​ సెంటర్​కు నెలకు 420 డాలర్లను చెల్లిస్తారు. అదే రెండవ బిడ్డ సంరక్షణ కొరకు అయితే అందులో సగం చెల్లిస్తే సరిపోతుంది. మూడో బిడ్డను అయితే కేర్​ సెంటర్​ వారు ఉచితంగానే సంరక్షిస్తారు. ఇదీ కాకుండా నామమాత్రపు చెల్లింపులతో పిల్లలను చూసుకునేందుకు వృద్ధ మహిళలు కూడా ఉంటారు.

దీంతో పాటుగా ఇక్కడ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతి బిడ్డకు సంవత్సరానికి దాదాపు 1,000 డాలర్లు అందిస్తుంది. ఈ మొత్తాన్ని పిల్లల తల్లిదండ్రులకు ఇస్తారు. 2019లో ఇక్కడ జననాల రేటు 2.95 శాతంగా ఉంది. 2020లో ఈ సంఖ్య కాస్త తగ్గగా.. 2021లో మళ్లీ పుంజుకొని 2.68కు చేరుకుంది. అయితే జపాన్​లో మొత్తంలో ఈ జననాల రేటు 1.3 శాతంగా మాత్రమే ఉంది. దక్షిణ కొరియాలో అయితే గతేడాది కేవలం 0.78 శాతంగా ఉంది.

జపాన్ ఇప్పటికీ ప్రపంచంలో నివసించడానికి అత్యంత ఖరీదైన దేశాలలో ఒకటిగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ దేశం జనాభా లేక విలవిల్లాడుతోంది. ఇటీవలే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు ప్రజల వలసలు కూడా జపాన్‌ను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం జపాన్​ జనాభాలో 93శాతం మంది నగరాల్లో నివసిస్తున్నారు. ఇరుకైన ప్రదేశాలతో పాటు జీవన వ్యయం పెరగడం.. చిన్న ఇంటిలో పిల్లలకు సరైన వసతి కల్పించడం ఇక్కడ ప్రజలకు కష్టంగా మారుతుంది. దీంతో గత కొన్నేళ్లుగా జపాన్​ జననాల సంఖ్య భారీగా పడిపోతోంది. దీంతో మూడు దశాబ్దాలుగా అక్కడ ప్రభుత్వం.. ఏంజెల్ ప్లాన్, న్యూ ఏంజెల్ ప్లాన్, చైల్డ్ అండ్ చైల్డ్- రీరింగ్ ఛీరింగ్ ప్లాన్ వంటి వాటిని ప్రవేశ పెట్టి పిల్లల్ని కనే వారికి రకరకాల ప్రోత్సాహకాలు అందిస్తుంది.

జననాల కంటే మరణాలే అధికం..

గతేడాది జపాన్​లో నమోదైన జననాల సంఖ్య కంటే మరణాల సంఖ్యనే రెట్టింపుగా ఉంది. 2022 సంవత్సరంలో 8లక్షల జననాలు నమోదవ్వగా.. మరణాలు మాత్రం 15.8లక్షలు రికార్డ్ అయ్యాయి. 2008లో 12.8కోట్లుగా ఉన్న జపాన్​ జనాభా.. ప్రస్తుతం 12.4కోట్లకు పడిపోయింది. దీంతో పాటుగా ఇదే సమయంలో.. 65ఏళ్ల వయసు కలిగిన జనాభా కూడా 29 శాతానికి చేరుకుంది. జనాభా పెరుగుదల పెద్దగా లేకపోగా.. వేగంగా క్షీణిస్తున్నట్లు నివేదికల ద్వారా స్పష్టమవుతోంది.

సవాళ్ల ముప్పు..

జనాభాలో భారీ క్షీణత ఇదే స్థాయిలో కొనసాగితే ఇప్పుడు పుట్టే పిలల్లకు భవిష్యత్తులో రకరకాల సమస్యలు వస్తాయని.. ప్రధానమంత్రి సలహాదారు మసాకో మోరీ వెల్లడించారు. దీనిని ఇప్పుడు అడ్డుకోకపోతే దేశ సామాజిక భద్రతా వ్యవస్థ కుప్పకూలుతుందని.. దీంతోపాటుగా పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దెబ్బతింటుందని ఆయన తెలిపారు. వీటితోపాటు భద్రతా బలగాల నియామకాలకూ ఈ పరిణామాలు తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జననాల సంఖ్యను పెంచి.. ఈ క్షీణతను అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.