భారీ భూకంపం.. 162 మంది మృతి.. 700 మందికి గాయాలు

author img

By

Published : Nov 21, 2022, 2:12 PM IST

Updated : Nov 21, 2022, 10:22 PM IST

INDONESIA EARTH QUAKE

భారీ భూకంపం ఇండోనేసియాను కుదిపేసింది. ఈ ఘటనలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 700 మంది గాయాలయ్యాయి. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుని ఉండొచ్చని, మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 162 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సుమారు 700 మందికి గాయాలయ్యాయి. వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని సియాంజూర్ ప్రాంతంలో.. రిక్టర్‌ స్కేలుపై 5.6 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు.. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.

INDONESIA EARTH QUAKE
భారీ భూకంపం కారణంగా దెబ్బతిన్న భవనాలు

ఇస్లామిక్‌ బోర్డింగ్‌ స్కూల్‌, ఆస్పత్రి సహా అనేక భవనాలు దెబ్బతిన్నాయి. గ్రేటర్‌ జకార్తా ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఎత్తైన భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. పెద్ద పెద్ద అపార్టుమెంట్లలో ఉన్న ప్రజలు మెట్లను ఆశ్రయించి కిందకు చేరుకున్నారు. వందలాది ఇళ్లు, ఇతర నిర్మాణాలు ధ్వంసం కావడం వల్ల శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నట్లు సియాంజుర్ పాలనాధికారి హెర్మన్ సుహెర్మాన్ తెలిపారు.

INDONESIA EARTH QUAKE
గాయపడిన వారికి రోడ్డుపైనే అత్యవసర వైద్యం అందిస్తున్న సిబ్బంది

భూకంపం అనంతరం కూడా ఇక్కడ 25 వరకు ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో.. ప్రకంపనల సమయంలో ప్రజలు ఆరుబయటే ఉండాలని బీఎంకేజీ చీఫ్‌ ద్వికోరిటా కర్ణావతి సూచనలు చేశారు. మరోవైపు.. జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు ఇప్పటికే రంగంలోకి, సహాయక చర్యలు ప్రారంభించాయి. అనేక ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని.. నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

INDONESIA EARTH QUAKE
శిథిలాల కింద చిక్కుకుని గాయపడిన ప్రజలు

27 కోట్లకుపైగా జనాభా కలిగిన ఇండోనేసియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే ఇండోనేసియా రాజధాని జకార్తాలో భూప్రకంపనలు సంభవించడం అరుదు. 2004లో పసిఫిక్‌ మహా సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా సునామీ వచ్చి 12 దేశాల్లో మొత్తం 2 లక్షల 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది ఇండోనేసియా దేశస్థులే కావడం గమనార్హం.

Last Updated :Nov 21, 2022, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.