సముద్రంలో చైనా సరికొత్త అస్త్రం.. టార్గెట్​ ఆంధ్ర, కేరళ!

author img

By

Published : Aug 2, 2022, 11:34 AM IST

yuan wang 5 ship

Yuan wang 5 ship: చైనాకు చెందిన నిఘా నౌక 'యువాన్ వాంగ్​ 5'.. శ్రీలంకలోని హంబన్​టొట నౌకాశ్రయం వైపు వెళ్తోంది. అయితే ఈ నౌక 750 కిలోమీటర్లకు పైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. ఫలితంగా భారత్​లోని కల్పక్కం, కూడంకుళం సహా అణు పరిశోధనా కేంద్రాలు దీని పరిధిలో వస్తాయి. అలాగే ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులపై ఈ నౌక నిఘా నేత్రం ఉంచగలదు. చైనా నౌక విషయమై కేంద్ర ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి తన ఆందోళనను తెలియజేసింది.

Yuan wang 5 ship: పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వే చైనా మరో దుందుడుకు చర్యకు ఉపక్రమిస్తోందా? ఈ ప్రశ్నకు రక్షణ రంగ నిపుణుల నుంచి 'అవును' అనే సమాధానం వినిపిస్తోంది. డ్రాగన్‌ దేశానికి చెందిన నిఘా నౌక 'యువాన్‌ వాంగ్‌ 5' గంటకు 35.2 కిలోమీటర్ల వేగంతో శ్రీలంకలోని హంబన్‌టొట నౌకాశ్రయానికి వెళుతున్నట్లు కథనాలు వెలువడడమే ఇందుకు కారణం. ఈ నెల 11 నుంచి 17 వరకు 'యువాన్‌ వాంగ్‌ 5' హంబన్‌టొట వద్ద ఉంటుందని శ్రీలంక రక్షణ మంత్రిత్వశాఖ ఇప్పటికే ధ్రువీకరించింది కూడా.

భారత్‌ ఆందోళన ఎందుకంటే..
'యువాన్‌ వాంగ్‌ 5' క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాల ట్రాకింగ్‌ చేయగలదు. 750 కిలోమీటర్లకుపైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. ఫలితంగా కల్పకం, కూడంకుళం సహా అణు పరిశోధన కేంద్రాలు దీని పరిధిలోకి వస్తాయి. దీంతోపాటు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులపై ఈ నౌక నిఘా నేత్రం ఉంచగలదు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన సంస్థల కీలక సమాచారాన్నీ సేకరించగలదు.

అందుకే హంబన్‌టొటలో..
శ్రీలంకలో చాన్నాళ్లుగా అధికారంలో ఉంటూ ఇటీవలే పదవీచ్యుతులైన రాజపక్స కుటుంబం సొంత నగరం హంబన్‌టొట. ఇక్కడి నౌకాశ్రయాన్ని చైనా నుంచి భారీగా రుణాలు తీసుకుని నిర్మించారు. వ్యూహాత్మక ప్రాంతంలో ఉండడం వల్ల ఈ పోర్టు అత్యంత కీలకమైనదిగా చెబుతుంటారు. మరోవైపు, ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంక.. చైనా నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైంది. దీంతో హంబన్‌బొట నౌకాశ్రయాన్ని చైనా మర్చంట్‌ పోర్ట్‌ హోల్డింగ్స్‌కు లీజుకు ఇచ్చింది. దీంతో డ్రాగన్‌ దేశం ఈ పోర్టును సైనిక అవసరాల కోసం వినియోగించుకునే అవకాశముందనే ఆందోళనలు మొదలయ్యాయి. 2014లో కొలంబో పోర్టులో ఉంచిన చైనా జలాంతర్గామి కంటే.. ఈ నౌక మరింత శక్తిమంతమైనదిగా చెబుతున్నారు.

భారత్‌ అభ్యంతరం..
చైనా నౌక విషయమై కేంద్ర ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వానికి తన ఆందోళనను తెలియజేసింది. అదే సమయంలో సీనియర్‌ అధికారులు పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నారు. మరోవైపు దీనిపై స్పందించిన చైనా.. తన చట్టబద్ధమైన సముద్ర కార్యకలాపాల్లో సంబంధిత పార్టీలు కల్పించుకోకుండా ఉంటాయని భావిస్తున్నట్లు పేర్కొంది.

.

ఇవీ చదవండి: 21 ఏళ్లుగా వేట.. 'ఆపరేషన్​ బాల్కనీ'తో ఖతం.. ఎవడీ అల్​ జవహరీ?

చైనా హెచ్చరికలు బేఖాతరు.. తైవాన్ విషయంలో పెలోసీ తగ్గేదేలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.