తాలిబన్ల కిరాతకానికి బలైన భారతీయ ఫొటో జర్నలిస్టుకు 'పులిట్జర్'

author img

By

Published : May 10, 2022, 9:01 AM IST

danish siddiqui pulitzer prize

పాత్రికేయ రంగంలో అత్యున్నత పురస్కారమైన 'పులిట్జర్'.. ఈ ఏడాది నలుగురు భారతీయుల్ని వరించింది. గతేడాది తాలిబన్లకు, అఫ్గాన్ భద్రతా బలగాలకు మధ్య పోరును చిత్రీకరించేందుకు వెళ్లి, ప్రాణాలు కోల్పోయిన ఫొటో జర్నలిస్ట్​ డానిష్ సిద్ధిఖీ వీరిలో ఒకరు. సిద్ధిఖీని పులిట్జర్ వరించడం ఇది రెండోసారి.

Danish Siddiqui Pulitzer prize: తాలిబన్ల కిరాతకానికి బలైపోయిన భారతీయ ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీని ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం వరించింది. ఫీచర్​ ఫొటోగ్రఫీ కేటగిరీలో సిద్ధిఖీతో పాటు రాయిటర్స్​ న్యూస్ ఏజెన్సీలో పనిచేసే మరో ముగ్గురు భారతీయులను(అద్నాన్​ అబిది, సన్నా ఇర్షాద్ మట్టూ, అమిత్ దేవ్​) ఈ అవార్డుకు ఎంపిక చేసింది పులిట్జర్ బోర్డ్. భారత్​లో కరోనా విలయాన్ని కళ్లకుగట్టేలా ఫొటోలు తీసినందుకు వీరికి ఈ పురస్కారం ఇస్తున్నట్లు పేర్కొంది.

డానిష్ సిద్ధిఖీని పులిట్జర్​ పురస్కారం వరించడం ఇది రెండోసారి. 2018లో రోహింగ్యాల సంక్షోభాన్ని కవర్ చేసినందుకు పులిట్జర్ అవార్డు దక్కించుకున్న రాయిటర్స్ బృందంలో సిద్ధిఖీ ఒకరు. 2021 జులైలో అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న పోరును కవర్ చేసే క్రమంలో సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయారు. అయితే.. సిద్దీఖి మరణం.. ఆకస్మికంగా జరిగింది కాదని అమెరికా పత్రిక​ ఒకటి తర్వాత కథనం ప్రచురించింది. సిద్దీఖిని తాలిబన్లు బంధించాక.. చిత్రవధ చేశారని చెప్పింది. తలచుట్టూ తీవ్రంగా గాయపరచి, బుల్లెటతో తూట్లు పొడిచి, శరీరాన్ని ముక్కలు చేసి పాశవికంగా చంపారని పేర్కొంది.

వాషింగ్టన్​ పోస్ట్​కు పులిట్జర్​: మరోవైపు.. ఇతర విభాగాల్లోనూ పురస్కారాలు ప్రకటించింది పులిట్జర్ బోర్డు. 2021 జనవరి 6న యూఎస్​ క్యాపిటల్​పై జరిగిన దాడిని కవర్ చేసినందుకు పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో వాషింగ్టన్ పోస్ట్​ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. కొలంబియా విశ్వవిద్యాలయం.. ఏటా ఈ పురస్కారాలు అందిస్తుంది. విజేతలకు ధ్రువపత్రంతో పాటు 15,000 డాలర్ల నగదు బహుమతి ప్రదానం చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.