'భారత్​లో బంధువులు'- మోదీతో భేటీలో బైడెన్ హాస్యం

author img

By

Published : Sep 25, 2021, 4:43 AM IST

Updated : Sep 25, 2021, 7:23 AM IST

biden surname

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీలో కాసేపు నవ్వులు విరిశాయి. భారత్​లో ఇంటి పేర్లతో అనుబంధాలు ముడిపెట్టకోవడంపై బైడెన్‌ సరదాగా మాట్లాడారు. గతంలో.. ముంబయి నుంచి ఓ వ్యక్తి లేఖ రాస్తూ.. తన ఇంటి పేరు బైడెన్‌ అని పేర్కొన్నారని గుర్తు ​చేసుకున్నారు.

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు బైడెన్​తో శుక్రవారం తొలి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. కొవిడ్-19పై పోరాటం సహా విస్తృత ప్రాధాన్యతా అంశాలపై శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్​లో సుమారు గంటపాటు చర్చించారు. అయితే.. ఈ సమావేశంలో భారత్​లో ఇంటి పేర్లతో అనుబంధాలు ముడిపెట్టకోవడంపై బైడెన్‌ సరదాగా మాట్లాడారు.

1972లో సెనెటర్‌గా తాను తొలిసారి ఎన్నికైనప్పుడు ముంబయి నుంచి ఓ వ్యక్తి లేఖ రాస్తూ.. తన ఇంటి పేరు 'బైడెన్‌' అని పేర్కొన్నారని బైడెన్​ గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యక్షుడి హోదాలో ముంబయి వచ్చినప్పుడు కొందరు విలేకరులు ఇదే విషయంపై తనను అడిగారని చెప్పారు. ఆ మరుసటి రోజే భారత్‌లో అయిదుగురు బైడెన్లు ఉన్నారని పత్రికలు రాశాయని తెలిపారు. అయితే, వారి గురించి తానెప్పుడూ ఆరా తీయలేదన్నారు. బహుశా ఇవ్వాళ్టి సమావేశం అందుకు ఏమైనా ఉపయోగపడుతుందేమోనంటూ చమత్కరించారు. దీనికి సంబంధించి తాను కొన్ని పత్రాలను తీసుకొచ్చినట్లు తెలిపిన మోదీ...'వారు మీ బంధువులే' అని తెలిపినప్పుడు హాలులో నవ్వులు విరిశాయి.

ఆప్యాయంగా ఆలింగనం...

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికైన తర్వాత ఆయనతో మోదీ ద్వైపాక్షిక భేటీ కావడం ఇదే తొలిసారి. శ్వేతసౌధంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. జో బైడెన్‌ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తొలిసారి జరిగిన ఈ ద్వైపాక్షిక భేటీలో కరోనాపై పోరాటం, వాతావరణ మార్పులు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంపై కీలకంగా చర్చించారు. అలాగే, అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించినట్టు సమాచారం.

ఇదో సరికొత్త అధ్యాయం.. బైడెన్‌

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలైన భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని బైడెన్​ అన్నారు. ఇరు దేశాల దృఢమైన బంధం కోసమే ఈ చర్చలని తెలిపారు. 40 లక్షల మంది ఇండో- అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శక్తిమంతం చేస్తున్నారని మోదీతో అన్నారు. ఇరు దేశాల సబంధాల్లో ఈ భేటీ సరికొత్త అధ్యాయమని తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను భారత్‌-అమెరికా బంధం పరిష్కరిస్తుందని తాను విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.

వాణిజ్య భాగస్వామ్యం బలోపేతం కావాలి.. మోదీ

అనంతరం మోదీ మాట్లాడుతూ.. ఈ శతాబ్ధం మూడో దశాబ్దం ప్రారంభంలో జరుగుతున్న ఈ దైపాక్షిక సమావేశం ఎంతో కీలకమైందన్నారు. ఈ దశాబ్దం రూపుదిద్దుకోవడంలో అమెరికా నాయకత్వం కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత్‌-అమెరికా వాణిజ్యం భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. సాంకేతికత ఓ ఛోదక శక్తిగా మారుతోందన్న ప్రధాని.. ప్రపంచ శ్రేయస్సు కోసం సాంకేతికతను వాడేలా మన ప్రతిభను వినియోగించుకోవాలన్నారు. భారత్‌- అమెరికా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని చెప్పారు.

ఇదీ చూడండి: ప్రపంచానికి మేలు చేసే శక్తిగా క్వాడ్​: మోదీ

Last Updated :Sep 25, 2021, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.