జీరో సైజ్ ఇలియానాను కోలీవుడ్ బ్యాన్ చేసిందా?.. ఇదిగో క్లారిటీ!
Published: Mar 11, 2023, 9:20 PM

దక్షిణాది సినిమాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఇలియానా ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా తమిళంలో ఆమె సినిమా చేసి దాదాపుగా 11 ఏళ్లు అవుతుంది. దీంతో ఆమెను తమిళ సినీ పరిశ్రమ బ్యాన్ చేసిందనే వార్తలు ఊపందుకున్నాయి. గతంలో తమిళంలో ఒక సినిమా ఒప్పుకున్న ఇలియానా.. ఆ నిర్మాత నుంచి భారీ మొత్తంలో అడ్వాన్సుగా తీసుకున్నారట. కానీ ఆ సినిమా చిత్రీకరణ జరగలేదట. దీంతో సదరు నిర్మాతకు భారీ నష్టం వచ్చిందట. తనకు న్యాయం చేయాలని ఆ నిర్మాత.. తమిళ చలనచిత్ర నిర్మాతల మండలిని ఆశ్రయించారట. ఆయన ఫిర్యాదును పరిశీలించిన నిర్మాతల మండలి.. ఇలియానా ఇకపై ఏ తమిళ సినిమాలోనూ నటించకుండా చర్యలు తీసుకుందట. ఇదీ ఇలియానాపై వినిపించిన వార్తల్లోని సారాంశం. వాస్తవానికి ఈ వార్తల్లో నిజం లేదు. ఈ విషయాన్ని తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి స్పష్టం చేసింది. " ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం. ఇలాంటి రూమర్స్ ఎవరు పుట్టిస్తారో అర్థంకాదు. కావాలనే ఇలాంటి రూమర్లను సృష్టిస్తారు" అని నిర్మాతల మండలి ఓ జాతీయ పత్రికకు వెల్లడించింది. అయితే, ఇలియానాపై ఇలాంటి తప్పుడు వార్తలు రావడానికి కారణం ఉంది. ఆమె దక్షిణాది సినీ పరిశ్రమల్లో పనిచేసి చాలా కాలమే అయ్యింది. తెలుగులో కనీసం 2018లో మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించారు. కానీ, తమిళంలో ఆమె చివరిగా 2012లో వచ్చిన దళపతి విజయ్ నంబన్ సినిమాలో కనిపించారు. ఆ తరువాత తమిళ ఇండస్ట్రీ వైపు చూడలేదు. దీంతో ఆమెను కోలీవుడ్ బ్యాన్ చేసిందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి.

